మీ ఆయన మిమ్మలని ఎంతగా ప్రేమిస్తున్నాడు?

అసలు మన మొగుడు గారు మనని ప్రేమిస్తున్నాడా  లేక  ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడా? ఈ సమస్య అందరి  భార్యలది. ఎప్పుడో అప్పుడు ఈ అనుమానం వస్తుంది. ఏదో నాలుగు మూరల మల్లెపూవులు పట్టుకొస్తేనో, రెండు గులాబీ పూవులు ఇచ్చి “ఐ యామ్ తెగ లవింగ్ యు డార్జిలింగ్,  సిమ్లా, కులుమనాలి” అంటే నమ్మేయడమేనా? గులాబీ కి ఉన్న ముళ్ళు లాగా వీడి మనసు లో కుళ్ళు ఏ మాత్రం ఉందో  హౌ టు తెలుసుకొనింగ్?  అని మధనపడని హాడది లేదంటే నో హాచ్చెర్యమ్.   

ఈ సమస్య మీద నేను అంటే ప్రభావతి అని పిలవబడే ప్రద్యుమ్నుడి భార్య నన్నమాట,  తిరిగి పరిశోధన (research) చేశాను. మా మహిళా సభలో కూలంకషంగా చర్చించాను. ఈ సమస్య కి అనేక కోణాలున్నాయి. మొగుడు భార్యామణి అంటే మురిసిపోవడం కాదు. భార్యామణి అంటే అర్ధం తెలుసుకోవాలి . భార్యలలో మణి అంటే ఏమిటీ? ఎంతమంది భార్యలు? అని నిలదీయాలి. మిగతా భార్యలు ఎక్కడ? అని ప్రశ్నించాలి.   భర్త,  యమునా తీరమున సంధ్యా సమయమున అని పాడుకొనే సందర్భాలు కనిపెట్టాలి.  ఆ సంధ్య ఎవరో తెలుసుకొనే ప్రయత్నం చెయ్యాలి.  వారికి తూర్పున ఉషోదయాలు, పడమర సంధ్యా రాగాలు లేకుండా జాగ్రత్త పడాలి. భార్య పతివ్రతగా ఉండాలనుకొనే ప్రతీ భర్తా సతీవ్రతం పాటించాల్సిందే. ఒకే బాణమూ, ఒకటే మాటా, ఒకే భామకే రాముని ప్రేమా   అన్నట్టు  ఉండాల్సిందే.  అల్లా అని “ఫో బాల నువ్విక పుట్టింటికి పొమ్ము బాలా”  అనగానే  ఏ  నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు  అని పాడుకుంటూ వెళ్లిపోవడం కాదు.  “ఐ నో గో,  యు గెట్ ఔట్” అనగలగాలి.  అంత ధైర్యం మనకి ఉందని వారికి అర్ధం అయితే చాలు వాడికి వేరే మార్గం లేక మన్ని ప్రేమించడం మొదలు పెట్టుతాడు. ఒకమాట కొంచెం రహస్యం గా చెపుతాను. పాపం మొగుడు,  పెళ్ళైన  కొత్తలో మనని తెగ ప్రేమించేస్తాడు. వాడి అవసరం అటువంటిది. ఆ టైము లోనే మనం పట్టు బిగించెయ్యాలి.  పెళ్ళాం = బెల్లం , అమ్మా నాన్నా = అల్లం  అని నూరి పోసేయాలి. అప్పుడే వారు మన వలలో పడుతారు.  మనకి సిద్ధాంతాలు అన్నీ తెలిసినా,  కొన్ని మొండి ఘటాల దగ్గర మన పప్పులు  ఉడకక పోవచ్చు. కొండొకచో మన మొగుడితో  ముచ్చట పడి పోయి వారి వలలో మనమే పడిపోవచ్చు. ఇవన్నీ occupational  hazards. పెళ్ళాం  అంటే  లైఫ్ లాంగ్ ఉద్యోగం అనుకోవాలి. అప్పుడే మన హక్కుల కోసం పోరాటం చేయవచ్చు.  అంతే తప్ప నా బాధ్యత, నాధర్మం అని సతీ అనుసూయ లాగా ఫీల్ అయితే మీ ఖర్మ,  మిమ్మలని ఎవరూ బాగు చెయ్యలేరు.  ఎప్పుడూ బాధ్యతల గురించి అంటీ ముట్టనట్టుండాలి కానీ హక్కుల కోసము అవిశ్రాంత పోరాటాలు సలపాలి.

సరే పెళ్లి అయింది. మనకి ధర్మ సూత్రాలు తెలియక కొంతకాలం సంసారం చేసేసాము. వాట్ నెక్స్ట్. అని ఆలోచించండి. ఇప్పటికైనా మేలుకొని జూలు విదల్చండి. 5-10 ఏళ్ళు సంసారం చేసిం తర్వాత మీకు జ్ఞానోదయము అయితే మొగుడు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి.  హాహాహ్హా నా మొగుడి గురించి నాకు తెలియదా ? వాట్ నాన్సెన్స్  అని ఇదైపోకండి. 10 ఏళ్ళు సంసారం చేసినా 25 ఏళ్ళు చేసినా మొగుడు గాడు ఓపట్టాన అర్ధం కాడు. అందుకనే వాడిని మొగుడు అంటారు.  అర్ధం అయ్యేడని మనం భ్రమ పడతాము అని తెలుసుకోండి.  నేను చెప్పింది మీరు నమ్మక పోతే, ఓ పని చేయండి. మీ ఇంటి చుట్టుపక్కల పె.గీ.గీ.దా.వా, అని పేరుబడ్డ ఒకడిని మీ ఇంటికి భోజనానికి పిలవండి. ఛండాలంగా సాంబారు పెట్టి వాడికి వడ్డించండి. వాడు లొట్టలు వేసుకుంటూ మిమ్మల్ని చూస్తూ గిన్నెడు సాంబారు తాగేస్తాడు.  పెళ్ళాం గీచిన గీటు దాటని వాడు. అంటే అల్లా ఉంటాడా అని ఆశ్చర్య పడకండి.  మొగుడు పైకి కనిపించేది ఒకడు, అవకాశం వస్తే మరొకడు. చాలామంది మొగుళ్లు అవకాశం లేక, దొరకక, మిమ్మల్ని హింసించే మార్గం తట్టక,  మంచి భర్తలుగా మిగిలిపోతారు అని మీరు గ్రహించాలి.   

ఈ విషయం పైన  నేను చాలా లోతుగా, సమగ్రంగా అధ్యయనం చేశాను. అనేక మొగుళ్ళ మనస్థత్వాలు శోధించాను. అనేక మనస్థత్వ శాస్త్రవేత్తలతో చర్చించాను. చర్చించి, శోధించి ఆపైన మధించి, వాటిని క్రోడీకరించి పంచరత్నాలు లాంటి ఐదు ప్రశ్నలు తయారు చేశాను. సమయానుకూలంగా వాటిని మీ  వారికి సంధించి జవాబులు రాబట్టండి.         
     
1. ఉప్మా లో పచ్చి మిరపకాయలు బదులు ఎండు మిరప కాయలు వేయవచ్చా?

అ. సారీ డియర్ నిన్న పచ్చి మిర్చి మరిచిపోయాను.
ఆ. నువ్వు ఏం వేసినా బాగానే ఉంటుంది.
ఇ. ఫరవాలేదు ఏదైనా వేయవచ్చు.
ఈ. ఏదో ఒకటి అఘోరించు.
ఉ. పచ్చిమిర్చి అయిపోతే చెప్పి ఏడవాలి.

2. మా చెల్లెలికి పెళ్ళిలో బహుమతిగా ఫ్రిజ్ ఇద్దామా, మైక్రో ఓవెన్ ఇద్దామా ?

అ. అబ్బే అవేం బాగుంటాయి,LCD TV  కొని ఇద్దాం.
ఆ. రెండూ ఇచ్చేస్తే నష్టం ఏమిటి.
ఇ. మనకి మీ నాన్న ఏం ఇచ్చాడో అంతకన్నా ఎక్కువ ఇవ్వక్కర్లేదు.
ఈ. ఒక అరడజను చెంచాలు ఇస్తే చాలదా
ఉ. అసలు పెళ్ళికి వెళ్లాలంటావా

3. పక్కింటావిడ 4 తులాల నెక్లసు  కొనుక్కుంది, మరి నాకేంటి కొంటారు?      

అ. 4 తులాలు అంటే 40 వేల మిల్లీ గ్రాములు, అంతా బరువు నీ మెడ 
     మోయలేదేమో  సన్నుతాంగీ అంటాడా.
ఆ. Moon light కన్ననూ నీదు మోము bright, దూది పింజ కన్ననూ
     నాదు పర్సు light ట  అంటాడా.
ఇ. మీ తమ్ముడు ఓ లక్ష అప్పు ఇస్తాడేమో కనుక్కో అంటాడా
ఈ. ఇప్పుడు నీకు నగలు అవసరమా అంటాడా
ఉ. ఓ వడ్డాణం కొనుక్కో ఉన్న రెండు ఎకరాలు కూడా అమ్మేస్తాను  అంటాడా

4.   మీ పెళ్లి రోజున మీ ఆయన ఏంచేస్తాడు? 

అ. ఉదయాన్నే లేవగానే “నీ కళ్ళల్లో నా కళ్ళు చూసుకోనా,  
     నీ ముక్కుతో  నాముక్కు రాసుకోనా” అని పాడుతూ 
     NTR లాగా బుగ్గ కందిపోయేటట్టు చిటిక వేస్తాడా
ఆ. ఏడుస్తూ శలవు పెట్టి, నవ్వుతూ మిమ్మల్ని ఊరంతా తిప్పి 
     హోటల్ లో డిన్నర్ పెట్టిస్తాడా
ఇ. మీకో మంచి చీర కొనిపెట్టి, తను మాసిన లాగు, చిరిగిన చొక్కా
    వేసుకొని ఆఫీసు కి వెళ్లిపోతాడా
ఈ. అసలు ఏం గుర్తు లేనట్టు ఆఫీసు కి వెళ్లిపోతాడా
ఉ. విషాదంగా భారంగా నిట్టూరుస్తూ, ఓ మందు బాటిలు ఓపెన్ చేసి 
    “కొయి లౌటాదె మేరే బీతే హువే దిన్” అని పాడుకుంటాడా      

5.   31 రోజులు,  పైవాడి బూతులు, కిందవాడి తిట్లూ భరిస్తూ కష్టపడి 
      1వ తారీఖుకి   సంపాదించిన జీతం  డబ్బులు

అ. మొత్తం మీచేతిలో పోసి అప్పుడప్పుడు పానిపూరి తింటానికి
    ఓ పదిరూపాయలకి మిమ్మల్ని ప్రాధేయపడతాడా
ఆ. మొత్తం మీ చేతిలో పోసి పాకెట్ మని గా మీరిచ్చింది తీసుకుంటాడా
ఇ. ఇంటి ఖర్చులకి ఇంత అని ఇచ్చి మిగతాది తన దగ్గరే ఉంచుకుంటాడా
ఈ. మీకు పూలు కొనుక్కోడానికి 100 రూపాయలు ఇచ్చి మిగతాదంతా 
     తనే ఉంచుకుంటాడా
ఉ.  మీకు ఏమి ఇవ్వకపోగా, ఇంటి ఖర్చులకి కూడా మీ నాన్న నడిగి 
     పట్టుకు రమ్మంటాడా

జవాబులు వచ్చింతర్వాత మార్కులు కింది విధంగా వేసుకోండి

అ కి 16 నించి 20 మార్కులు, ఆ కి 12నించి 16 మార్కులు, ఇ కి 8నించి 12 మార్కులు, ఈ కి 4 నించి 8 మార్కులు, ఉ కి 0 నించి 4 మార్కులు.
 
75+ వచ్చిన వాడిని అసలు నమ్మకండి. తేనె పూసిన కత్తిలాంటి వాడు . వాడు అందరితోనూ నవ్వుతూనే, మంచిగానే  ఉంటాడు. అతి మంచి మంచిది కాదు . మిమ్మల్ని తెగ ప్రేమించేస్తాడు. అవకాశాలు సృష్టించుకుంటాడు  నవ్వుతూనే ఎదురింట్లో ఏ ఛండిక తోనో లేక ఏ మార్తాండి తోనో కాపురం పెట్టేయగలడు. వాళ్ళిద్దరూ కలసి మీ జీవితం నవ్వుల పాలు చేసెయ్యగలరు. ఇటు వంటి వాడితో బహు జాగ్రత్త గా ఉండాలి. తాజమహల్ కట్టించేస్తాను నీ కోసం అంటాడు. కట్టించాలంటే ముందు నువ్వు  పైకెళ్ళాలి గదా అనేస్తాడు కూడానూ.

60+ వచ్చిన వాళ్ళ తో కూడా కొంచెం జాగ్రత్త తప్పదు. అవకాశం  లేక మంచిగా ఉండడానికి ప్రయత్నించే వాళ్లు వీళ్ళు . రోజూ రెండు తిట్లూ, నాలుగు మొట్టి కాయలు వేస్తుంటే  తిన్నగానే మనకి నచ్చినట్టు ఉంటారు. కంట్రోల్ అన్నది ముఖ్యం వీళ్ళతోటి. వీడు కూడా చాలా బాగానే ప్రేమించే బాపతు.     

 45+ వీళ్ళు  ఉత్తమ భర్తలు అనుకోవచ్చు. ప్రతిదీ ఆలోచించి ఒక మోతాదు లోనే చేస్తారు. ప్రేమించడం కూడా అంతే. కానీ వీళ్ళను కొంచెం పొగిడితే బాగానే ప్రేమించేస్తారు. వీళ్లతో మనకి ఏ భయం ఉండదు. ఇబ్బంది అసలే ఉండదు.

30+ మిమ్మల్ని ఉద్ధరించడానికి పెళ్లి చేసుకున్నట్టు ఫోజు కొట్టుతారు. కానీ కొంచెం భయస్తులు. అప్పడాల కర్ర కే భయపడుతారు. కాబట్టి దాని ఉపయోగం తప్పదు. ఉపయోగించి నంత కాలం మన చెప్పుచేతలలో ఉంటారు. గతి లేక, భయంతో చచ్చినట్టు ప్రేమిస్తారు.  ఎంతగా ఉపయోగిస్తే  అంతగా ప్రేమిస్తారు.

30 కన్నా తక్కువ  అయితే  ఒక మంచి లాయరు ని వెతుక్కోండి.  వెంటనే విడాకులు తీసుకోండి.
            
                         మంగళం  

ఫుల్ సినీమా హాల్లో నేను చూసిన పావు గంట సినీమా


నేను ఆనర్స్  ప్రీ ఫైనల్లో ఉండగా అంటే 1962 సంవత్సరం, నా రూమ్మేటు వీరేంద్ర చౌదరి వివాహం జరిగింది. నువ్వు తప్పకుండా రావాలిరా అని వాడు వేడు కోవడంవల్లా, వాళ్ళ నాన్నగారు, ఇంతంత మీసాలు పెంచుకొని, కరుకుగా మాట్లాడుతూ, పంతులూ నువ్వు రెండు రోజులు ముందర వచ్చెయ్యి అని ఆజ్ఞ జారిచేయడం వల్ల నేను ఆ పెళ్ళికి వెళ్ళేను ఒక రోజు ముందర. నేను వాళ్ళ ఊరు వెళ్ళడానికి సకల వాహనాలు ఉపయోగించ వలసి వచ్చింది. నిడదవోలు దాకా రైలు, ఆపైన బస్సు, ఆ తరవాత, రెండెడ్ల బండి ఎక్కి సుమారు మధ్యాహ్నం మూడు గం// కి వాళ్ళ ఇల్లు చేరాను.  నన్ను చూసి వాళ్ళ నాన్నగారు, ఆ వచ్చేసావా ? అని అడిగేరు. నేను వచ్చినందుకు ఆనందించాడో, లేక మొహమాటానికి పిలుస్తే వచ్చేసాడేమిటి అన్న భావమో నాకు అర్ధంకాలేదు. ఒరేయ్ రంగా పంతుల్ని అబ్బాయి దగ్గరకు తీసుకెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయారు. రంగాగారు రండి మాష్టారు అంటూ నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళాడు. అల్లాంటి ఇల్లు నేను అప్పటి దాకా చూడలేదు, పెద్ద హాలు,  హాలుకి అరడజను గుమ్మాలు, వాటి లో గదులు. వాటిని దాటి వెళ్ళితే మధ్యన వరండా, మళ్ళీగదులు. ఈ గది లోంచి ఆ గదిలోకి  పరుగు పెట్టే  పిల్లలు, ఉంగరాలు లేని వేళ్ళు లేని వాళ్ళు, సిల్కు లాల్చీలు, సిల్కుపంచిలు ధరించిన వాళ్ళు మగవారు హడావడి గా తిరిగేస్తున్నారు. పట్టు చీరలు కట్టుకొని, చీర కూడా కనిపించకుండా నగలు పెట్టేసుకొని, కదిలే మార్వాడీ కొట్టు లాగ అడుగులో అడుగు వేసుకుంటూ, బంగారం వాసన వేస్తూ తిరిగే మహిళా మణుల మధ్య నించి, నన్ను లాక్కేళ్ళి అబ్బాయి దగ్గర దిగపెట్టేడు. వచ్చావా, రా అన్నాడు అబ్బాయి. ఇంతలోనే ఓ పెద్ద ప్లేటు నిండా నాలుగు స్వీట్లు అన్నేరకాల కారం పలహారాలు పట్టుకొచ్చి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ఓ పెద్దమనిషి. అబ్బాయి చుట్టూ అమ్మలు, మధ్యలో అమ్మాయిలు, పరాచికాలు, పగలబడి నవ్వడాలు. ప్లేటు లోవి తినాలో, వాళ్ళ మాటలు వినాలో అర్ధం కావట్లేదు. అబ్బాయి తో మాట్లాడటానికి కూడా సందు దొరకటంలేదు. సరే నని చేతిలోపని మీద  దృష్టి పెట్టేను.

ఎల్లాగో సందు చూసుకొని అబ్బాయి గారు నాదగ్గరికి వచ్చాడు. ఒరేయ్ నీబస మాశాస్త్రి గారింట్లో ఏర్పాటు చేసారు నాన్నగారు. మా జనాల మధ్యన ఉండగలను అనుకుంటే ఇక్కడ ఉండు లేకపోతే అక్కడికి వెళ్ళు. ఒరేయ్ రంగా సార్ ని జాగ్రత్తగా చూసుకో.  పెళ్ళికొడుకు నాకు జాగ్రత్తలు చెప్పి మళ్ళీ ఆడ వారి మధ్య కెళ్ళిపోయాడు. రంగా గారు అక్కడేఉన్న ఆడవారిని, అటూఇటూ తిరుగుతున్న మగవారిని పరిచయం చేస్తున్నాడు.  నాకు ఆ బంగారం వెనకాల మనుషులు  కనిపించడం లేదు.అంతా బంగారమే కనిపిస్తోంది. మీఇంట్లో ఘోషా ఉన్నట్టు ఉంది రంగా అన్నాను  రంగా నవ్వేసాడు. రండి మిమ్మల్ని శాస్త్రి గారింటికి తీసుకెళ్ళతాను అని నాబేగ్ భుజాన తగిలించుకుని బయల్దేరాడు. ఓ ఐదు నిముషాలు, రెండు వీధులు తిరిగిం తర్వాత ఓ ఇంటి ముందు ఆగి శాస్త్రి గారూ అని పిలుస్తూ లోపలికి  తీసుకు వెళ్ళాడు. టైము చూసాను అప్పుడే నాలుగు అయింది. ఈ ఊరు వచ్చి  గంట దాటిందా అని ఆశ్చర్య పోయాను. ఇంతలో శాస్త్రిగారు వచ్చారు లోపలినించి.

రా బాబూ కూర్చో అన్నారు ఒక కుర్చీ నాముందకు తోసి. నేను కూర్చున్నాను
మీది భీమవరమా?  నేను అవును అన్నట్టు  తల ఊపాను
చౌదరి గారి అబ్బాయి స్నేహితుడవా?
విశాఖపట్టణం లో కలసి  చదువు కుంటున్నారా?
మీ నాన్న గారు  తెలుగు  పండితులా?
మీ రిద్దరూ హాస్టల్లో ఒకే రూము లో ఉంటారా?

నేను అన్నింటికి తలఊపాను. అన్నీ ఆయనకి తెలిసిన ప్రశ్నలే వేసారే అని ఆశ్చర్యపోయాను. నాభావం తెలుసుకున్న వాడై రంగా చెప్పాడు. మీ గురించి అబ్బాయి గారు అన్నీ చెప్పారు అన్నాడు.   శాస్త్రిగారి భార్య కాఫీ పట్టుకొచ్చి ఇచ్చింది. ఆవిడ కూడా అవే జవాబు అఖ్ఖర్లేని ప్రశ్నలు వేసింది. నేను షరా మామూలుగానే తలనూచాను. మొహమాటకు పడకు నాయనా. ఏమైనా కావల్సివస్తే అడుగు. అని మళ్ళీ లోపలికి వెళ్ళి పోయింది ఆవిడ. ఏమి అడగాలా అని ఆలోచిస్తుంటే, ఏదైనా అవసరం అనుకుంటే అడుగు నాయనా అని శాస్త్రి గారు వీధిలోకి వెళ్ళారు. ఇప్పుడు అనుమానం వచ్చేసింది. అవసరం అంటే ఏమిటీ అని ఆలోచించడం మొదలు పెట్టాను. మీరు ఏమీ ఆలోచించకండి. మై హూ హై అన్నాడు రంగా. ఈ మధ్యనే హిందీ నేర్చేసుకుంటున్నాను. బొంబాయి వెళ్ళాలి అన్నాడు రంగా. నేనేం మాట్లాడలేదు. మళ్ళీ హిందీ లో వాయించేస్తాడని. మనకి బొత్తిగా అర్ధంకాని భాష అది. ఇంగ్లీషు సినిమా లైనా కొంచెం అర్ధం అవుతాయేమో కాని హింది అసలు నహీ.  సరే సార్ మీరు  ఓ గంట విశ్రాంతి తీసుకోండి. నేను మళ్ళీ వస్తాను అని చక్కాపోయాడు.

సరే అని నేను మంచం మీద నడ్డి వాలుద్దామనుకుంటుంటే, శాస్త్రి గారి భార్య వచ్చేసింది. మాఊరు వాళ్ళ ఊరూ దగ్గరే అని కనిపెట్టేసి మాఅమ్మ వాళ్ళ గురించి, నాన్న వాళ్ళ గురించి, మా గోత్రాలు, ఋషులు మొదలగు వారిగురించి  కూలంకషంగా చర్చించి, ఇంకా పెళ్ళి ఎందుకు కాలేదు నాయనా అని అడిగేసింది ఆవిడ. అప్పుడే తొందరేమండి. ఇంకా చిన్న వాడినే గదా అని అన్నాను. అయ్యో అదేమిటి నాయనా నీవయసు లో ఈయన మా మామగారిని  తాతని  చేసేసారు. నాకు అర్ధం కాలేదు. ఆవిడ నవ్వింది. మట్టి బుర్ర ఆప్పుడు అర్ధం అయింది.  ఇక్కడే ఉంటె ఈవిడ నాకు సంబంధాలు చూస్తుందేమోనని భయం వేసింది ఊరు చూసోస్తా నని ఆవిడ కి చెప్పి బయట పడ్డా. అన్ని పల్లెటూర్ల లాగే ఉంది. పచ్చగా,  హాయిగా చల్లగాలి వీస్తోంటే మెల్లగా నడుచుకుంటూ వెడుతున్నాను

రెండు వీధులు తిరిగే టప్పటికి రంగా వచ్చేసాడు. అప్పుడే బోరు కొట్టేసిందా  మాఉరు అంటూ .రండి ఆచివర సినిమా హాల్ ఉంది. అందులో కూర్చుందురు గాని మంచి కాలక్షేపం అన్నాడు.ఇప్పుడా అన్నాను టైము చూస్తూ ఐదు అయింది. ఇంకో ఘంటన్నర ఆట ఉంటుందండి. ఏదో పేరు చెప్పేడు జానపద సినిమా అన్నాడు. హాల్ మనదే అన్నాడు. సరే ఆవిడ తో కబుర్ల కన్నాఇదే మంచిది అనుకొని టూరింగ్ టాకిసా అని అడిగాను . కాదండి ఫుల్ సినిమా హాల్ అన్నాడు. నాకు అర్ధం కాలేదు. మీ పట్నం లాగానే నండి. సిమెంటు బిల్డింగ్ , నేలా, బెంచి, కుర్చీ, రిజర్వుడు పైగా బాల్కని కూడా ఉందండి. ఈ చుట్టుపక్కల పదిహేను ఊర్లకి ఇదే పెద్ద సెంటరండి సినిమాలకి . చుట్టుపక్కల ఊళ్ళలో నాలుగు టూరింగ్ టాకీసు లున్నాయండి మన ఊర్లోనే ఫుల్ సినిమా హాలండి. మూడు అభిమాన సంఘాలున్నాయండి మా ఊర్లో.   అబ్బో పెద్ద చరిత్రే ఉందే మీ ఊరుకి అన్నాను.  అప్పుడప్పుడు కొత్తసినిమాలు కూడా వస్తాయండి విడుదలయిన నెలరోజుల్లో. ఆహా అన్నాను. ఇంతలో హాలు దగ్గరికి వచ్చేసాం. నన్ను తీసుకెళ్ళి బాల్కనీ లో కూర్చో పెట్టేడు. నేను మళ్ళి సినిమా అయే టప్పటికి వస్తానండి అని వెళ్లి పోయాడు.

నేను కూర్చుని చుట్టుపక్కల సర్వె చేసాను.మొత్తం 12 సీట్లు ఉన్నాయి మొదటి వరుస మూడు, రెండోవరుసలో నాలుగు, మూడో వరుస లో ఐదు ఉన్నాయి.చివరి వరుసలో నలుగురు కూర్చున్నారు. రెండో వరుసలో ముగ్గురు ఉన్నారు. మొదటి వరుసలో నేను మధ్య సీటులో ఫాన్  కింద కూర్చున్నాను. తెరమీదకి చూసాను.రాజు గారు  గుఱ్ఱం మీద, వెనక్కాల  సైనికులు గుఱ్ఱాల మీద, కాల్బంటులు,  శూలాలు , గదలు, కత్తులు  పట్టుకొని పరుగెడుతున్నారు. వెనక్కాల సంగీతము  దడ దడ లాడించేస్తోంది. వ్యతిరేక దిశ లొ ఇంకో రాజు గారు అంతమంది సైనికులతో వచ్చేస్తున్నారు. సరిగ్గా అదే టైము లో నాపక్కన రెండు సీట్లలో ఇద్దరువచ్చి కూర్చున్నారు. కొద్దిగా మందు వాసన వేస్తోంది. యుద్ధం మొదలవు తోందిరా అన్నాడు ఒకడు. సిగతరగా నిన్నా ఇదే టైముకి వచ్చాం రా అన్నాడు ఇంకోడు. రెండు సైన్యాలు ఒకరి కెదురుగా ఇంకోరు పరిగెడుతున్నారు.

ఒకడు:  అబ్బాయి గారి స్నేహితుడు గారు రా
రెండో వాడు: అవును రా సినిమాకు వచ్చినట్టున్నారు.
సినిమాలో సైన్యాలు పరిగేస్తున్నాయి.
ఒ: పావుగంట ముందు వస్తే పాట వినేవాళ్ళం గదా
రెం: ఇంకో పాట ఇప్పుడు వస్తుంది గదా
సి: రెండు సైన్యాలు ఒక దాని ఎదురుగా ఒకటి నిల్చున్నాయి.
నేను జేబు లోంచి సిగరెట్టు తీసి వెలిగించాను.
ఒ: ఫ్రెండు గారు సిగరెట్లు కాలుస్తారను కుంటాను రా
రెం: అబ్బాయి గారు కూడా కాలుస్తారాండి
నే: కాలుస్తాడండి
సి: ఇద్దరు రాజులు కత్తులు దూసారు
ఒ:, రెం:,  చుట్టలు వెలిగించారు
సి:  రాజు లెక్కిన గుఱ్ఱాలు గుండ్రంగా పరిగెడుతున్నాయి.
నే: ఉత్సాహంగా చూస్తున్నాను ఎప్పుడు యుద్ధం మొదలవుతుందా అని
గుఱ్ఱాలు ఆగాయి.రాజు ఒకటి కి రాజు రెండుకి ఓ ఇరవై గజాల దూరం
ఒ.రా: ఓరోరి దురాత్మా. కదనమున నన్ను గెలవగలవా
రె.రా: నీచా దుష్టా నీ పొగరణచెద కాచుకొమ్ము
ఒ: ఈళ్ళిప్పుడు ఇంకో పది మాటల యుద్ధం చేస్తారండి. అప్పుడు కత్తి యుద్ధం మొదలు
రె: అబ్బాయి గోరు అవి నిజంకత్తులేనంటారా
ఒ.: నీ మొహం. నిజంకత్తులైతే ఛస్తారు. అట్ట కత్తులు
రె: సౌండ్ వస్తుంది కదరా
ఒ: అది ఎనకాల మూజిక్ రా
సి: కత్తి యుద్ధం మొదలయింది 
టంగ్ టంగ్ టటంగ్ టంగ్ టంగ్ టటంగ్ టంగ్
చేగోడీలు, చేగోడీలు మధ్యలో అమ్మేవాడు రంగప్రవేశం
ఒ: అర్ధరూపాయి వి ఇవ్వరా
వీళ్ళు నమలడం మొదలు పెట్టారు. రెండు చెవుల్లోను కర్ ఖర్ ఖ్ఖర్
టంగ్ టంగ్ టటంగ్ టంగ్ టంగ్ టటంగ్ టంగ్
కర్ ఖర్ ఖ్ఖర్  కర్ ఖర్ ఖ్ఖర్
ఒ: ఇప్పుడు ఆడి పెళ్ళాం ఈడి పెళ్ళాం పాట పాడుతారు డూయెట్టు
టంగ్ టంగ్ టటంగ్ టంగ్ టంగ్ టటంగ్ టంగ్
కర్ ఖర్ ఖ్ఖర్  కర్ ఖర్ ఖ్ఖర్
ఒ:రా.పె.: కరుణించుమా కనకదుర్గా నా నాధుని గెలిపింపుమా
రె.రా.పె.: కాపాడుమా పరమేశ్వరా నాపతికి జయము నీయుమా
టంగ్ టంగ్ టటంగ్ టంగ్ టంగ్ టటంగ్ టంగ్
కర్ ఖర్ ఖ్ఖర్  కర్ ఖర్ ఖ్ఖర్
ఒ.: పరమేసరుడు గెలుస్తాడా పార్వొతీ దేవి గెలుస్తుందా
నే: నిన్న చూసారుగా. మీకు తెలిసే ఉండాలి కదా
రె.: నిన్న సరిగ్గా పాట అయేటప్పటికి కరెంటు పోయింది
టంగ్ టంగ్ టటంగ్ టంగ్ టంగ్ టటంగ్ టంగ్
కర్ ఖర్ ఖ్ఖర్  కర్ ఖర్ ఖ్ఖర్
ఒ:రా.పె.: కరుణించుమా కనకదుర్గా ఆఆఆఆ ఆఆఆఆ
రె.రా.పె.: కాపాడుమా పరమేశ్వరా  ఆఆఆఆ ఆఆఆఆ
ఇంతలో ఒ.రా. చేతిలో కత్తి విరిగిపోతుంది. ఒ.రా దొర్లుకుంటూ ,రె.రా కత్తి విసురుతూ, దొర్లుకుంటూ, విసురుతూ ఒక నది దగ్గరకు వచ్చేస్తారు. నది కి ఒక తాళ్ళ వంతెన ఉంటుంది.
కర్ ఖర్ ఖ్ఖర్  కర్ ఖర్ ఖ్ఖర్
ఒ:రా.పె.: కరుణించుమా స సా రి రీ రిర్రీ గగ్గా గ్గాఆఅ పదనిస పాదానీసా
రె.రా.పె.: కాపాడుమా గా గా పాప్పానా న్నా అమామ్మామాపాదనిసాఆఆ
కర్ ఖర్ ఖ్ఖర్  కర్ ఖర్ ఖ్ఖర్
ఇక్కడ ఒ.రా, రె.రా లు వంతెన మీద యుద్ధం ఒ.రా, రె. రా చేతిలో కత్తి ఎగర కొట్టేస్తాడు. ఇద్దరు ముష్టి యుద్ధం మొదలు పెడతారు.
ఢుషుం ఢుషుం ఢుషుం ఢుషుం ఢుషుం
కర్ ఖర్ ఖ్ఖర్  కర్ ఖర్ ఖ్ఖర్
ఒ:రా.పె.:  కనకదుర్గా
రె.రా.పె.:  పరమేశ్వరా
ఢుషుం ఢుషుం ఢుషుం ఢుషుం ఢుషుం
అప్పుడు రె.రా నీళ్ళలో పడిపోతాడు. ఒ.రా నీళ్ళలోకి దూకేస్తాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి
ఢుషుం ఢుషుం బుడుంగ్ బుడుంగ్ ఢుషుం ఢుషుం బుడుంగ్ బుడుంగ్ ఢుషుం
కర్ ఖర్ ఖ్ఖర్  కర్ ఖర్ ఖ్ఖర్
ఒ.రా.పె.: కరుణించుమా
రె.రా.పె.: పరమేశ్వరా
ఇంతలో రెండు మొసళ్ళు నీళ్ళలో కొట్టుకుంటున్న వారి దగ్గరగా వచ్చి ఘ్ర్యీ: ఘ్ర్యీ: అంటాయి
ఒ.రా.పె.: కనక దుర్గా దుర్గా దుర్గా ఆఆఆఆఆఅ
రె.రా.పె.: కాపాడుమా మా మాఆఆఆఆఆఆఆ
రె.రాపె గారి దగ్గర ప్రమిద ఆరిపొతుంది. ఒ.రాపె గారి దీపం ఆరి, వెలిగి, వెలిగి ఆరిపోయేటట్టు ఉన్నట్టుంటే కరెంటు పొతుంది.
రె.: సిగతరగా, సరిగ్గా నిన్నా ఇక్కడే కరంటు పొయిందండి.
ఒ.: ఇప్పుడు ఏమవుతుందండీ అబ్బయి గొరూ,
నే.: నాకు తెలియదు ఈ సినీమా నేను చూడలేదు
రె.: మీరు డైట్రు అయితే ఏం చేస్తారు
నే.: రెండో దీపం కూడా ఆర్పేస్తాను.రెండు మొసళ్ళూ ఇద్దరిని తినేస్తాయి. ఇద్దరు పెళ్ళాలు ఆత్మహత్య చేసుకుంటారు. అప్పుడు రెండు రాజ్యాలలో ప్రజలు సుఖంగా జీవిస్తారు.
హహహహహ్హహ్హహ్హ అని ఘట్టిగా నవ్వి నేను అక్కడనించి పారిపోయాను.

గమనిక : ఈ కధ మొదటగా  Books & Galfriends  లో 31/10/2010 న  ప్రచురించ బడింది.  http://bandgf.blogspot.com/2010/10/blog-post_31.html

నేను ఎందుకు వ్రాస్తున్నాను ... మూడు

సూత మహర్షి చుట్టూ పరికించెను. మేఘాలలో సమాంతరంగా దూరంగా తమిళ రాష్టంలో  శ్రీవినాయగన్, శ్రీవ్యాసన్ కూర్చునున్నారు. ఈయన చెపుతున్నాడు, ఆయన వ్రాస్తున్నాడు. ఈశాన్య దిక్కుగా బొంగ రాష్ట్రంలో మేఘాల పైన బహు దూరంలో బొసిస్ట బ్రొమ్మరిసి యోగ బాసిస్టం చదుబుకుంటూ ఏగుచుండెను. ఇంకా  పైన స్వర్గానికి దగ్గరగా సప్త ఋషులు వేదపఠనం చేసుకుంటూ అనంతంలోకి వెళ్ళిపోతున్నారు.
దగ్గరగా ఉన్న వ్యాసమహర్షి దగ్గరికి  వెళ్ళి చింతన్ బైఠక్  చేద్దామని నిశ్చయించినవాడై, సూతమహర్షి, శౌనక మహా మునిని పిలిచాడు.
సూతమహర్షి   నాయనా శౌనకా, నేనొక దేవ రహస్యాన్ని తెలుసు కొనుటకై వ్యాస మహర్షి దగ్గరకు  వెళ్ళుతున్నాను. నువ్వు ఇక్కడ ఉన్న ఆది మహా మునులను, మునులను, సాధ్వీ మణులను, సాధ్వీ లలామలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. ఆ చివరాఖరున పది మంది యమ కింకరి లను కాపలా పెట్టితిని. వారలను కూడా చూచు చుండుము.
శౌనకుడు:  అల్లాగే గురూ గారూ, మొదట వారిని వదలి, చివరాఖరి వారిని బహు జాగ్రత్తగా పరికించెదను. ఇవ్విధంబుగా యమ కింకరి లను కాపలా పెట్టుట బహు రమ్యముగా నున్నది. పొదుపుగా దుస్తులు ధరించిన భూలోక  సినీమా నటీ మణుల వలె సుందరము గా నగుపించు చున్నారు. ఈ జాగ్రత్త ఏలనో?
సూతమహర్షి:   క్రిందటి మారు నేను సత్య లోకమున కేగినప్పుడు, ఆ చివర పంక్తుల లోని చాలా మంది,  మహా మునులు  కాలేని,  పురాణ  కధలు విన నిచ్చగించని, ముని సత్తములు, భూలోకము నకు పారి పోయారు.   అచట స్వామీజీలు, బాబాలు, అమ్మలు, అమ్మాజీలు గా అవతరించారు.  వారికేం తెలియక పోయినా, కధలు చెప్పుతూ, జనులను మభ్య పెట్టుచూ, మేడలూ మిద్దెలూ కట్టించు కొనుచూ, ఖరీదైన వాహనములలో తిరుగుచూ స్వర్గలోక భాగ్యాలను భవించుచున్నారు. కలియుగ ప్రభావమున మనుజులు ఆలోచించ జాలక, మోసగింప బడుతున్నారు.
శౌనకుడు:  అవును మహర్షి పుంగమోత్తమా, రెండు శ్లోకాలు, మూడు పద్యాలు, నాలుగు పాటలూ నేర్చుకొన్న వారందరూ  ఆంధ్ర దేశమున బాబాలు, అమ్మాజీలు గానూ మారుచున్నారని నారద మహర్షి చెప్పినారు.
 సూతమహర్షి:  శౌనకా,  పుంగవా చాలును, దానిని మొత్తనవసరం లేదు.
శౌనకుడు:  అటులనే పుంగవా క్షమించుడు మహర్షి పుంగవా

సూతమహర్షి,  అక్కడ ఉన్న సాధ్వీ  లలామలు,  మునులు కిందకు,  భూలోకమునకు  పారిపోకుండా, శౌనకునకు  తగు  జాగ్రత్తలు సూచించిన వాడై,  దక్షిణాభి ముఖంగా  ప్రయాణానికి  ఉద్యుక్తుడయ్యాడు. ఇక్కడ  అంతర్ధానమై  అక్కడ ప్రత్యక్షమగు సౌకర్యము కలవాడైననూ, సరదాగా మేఘముల లోని ఐసు మీద  స్కేటింగు చేయుచూ, మేఘమునకూ,  మేఘమునకూ కల మధ్య దూరమును అతి  చతురతతో దూకుచూ, ఆనందించుచూ,  సాగి  పోవు చుండగా, పక్కనే  ప్రత్యక్ష మయ్యాడు నారద మహర్షి.
ప్రణామ,  ప్రతి వందన కార్య క్రమాలు జయ ప్రదంగా ముగించిన తర్వాత,

నారద:  నాయనా, సూతా ఎచటికేగుచుంటివి?
సూతుడు:  మహర్షీ,  సర్వాంతర్యామికి ఆంతరంగిక  భక్తులు. తమకు తెలియని విషయము కలదా?
నారద:  విధి విలాసం బహు విచిత్రమైనది సూతా
సూతుడు:  అది ఏమి నారద మహర్షీ?
నారద:  సర్వాంతర్యామి తిరుపతి లో బందీ అయినాడు. అలిమేలు మంగకు కూడా దర్శనం దుర్లభమై పోయినది.  నా లాంటి వారికి  శ్రీవారి దర్శన భాగ్యం కలి యుగాంతమున నేమో.
సూతుడు:  స్వామీ మీరు నారాయణ అని పిలిచిన వారు పలుకుదురని కదా ప్రతీతి.
నారద:  శ్రీవెంకటేశ్వర స్వామి ఒక విధమైన నిద్ర మత్తు లో ఉంటున్నారు సూతా.  రాత్రి  12.30 గం//  నిద్రపుచ్చి నట్లే పుచ్చి,   1.30 గం// లకు సుప్రభాతం పాడుతున్నారు. వారికి విశ్రాంతి, నిద్ర రెండు నూ లేవు. వారి వంటిమీద, వారి ఖజానాలోనూ యున్న ఆభరణములు మాయమైననూ వారికి తెలియ లేదు. బ్రహ్మ, శివ,  దేవేంద్రాది  దేవతలు  పెద్ద పెద్ద  గొంతుకలతో  స్తోత్రము  చేసిననూ వారికి  వినిపించుట లేదు. నేనెంత, నాగొంతు కెంత, నా తుంబుర నాదమెంత?.
సూతుడు:  మరి దీనికి ఉపాయమేదైనా ఆలోచించ లేదా బ్రహ్మా బృహస్పతాది జ్ఞానులు.
నారద:  అదియును అయినది. ఉపాయము బెడిసి కొట్టినది. మరొక అపాయము సంభవించినది
సూతుడు:  అది ఏమి, ఏమాకధా?
నారదన్:  నాయనా సూతన్ నన్ను సతాయించకుము. శ్రీవ్యాసన్ ను అడుగుము.
సూతన్:  అటులనే స్వామిన్, తమిళనాట ప్రవేశించితి మన్నమాట.

అంత దూరమున నారదన్, సూతన్ లను చూచిన  శ్రీఏకదంతన్  అత్యవసర పని మీద వెళ్ళుతున్నానని  వ్యాసన్ తో చెఫ్ఫి మేఘాలలో అంతర్ధాన మయ్యాడు. వ్యాసన్ గారు నారదన్, సూతన్ లను ఆహ్వానించెను.

సూతన్:  మహర్షి వ్యాసన్, మీరు,  విఘ్నేశ్వరన్ ఇచట మేఘాలలో మకాం పెట్టుటకు కారణం బెట్టిది?  మీ కధా కాలక్షేపం సత్య లోకమున గదా జరుగ వలసినది.
వ్యాసన్:  అవును నాయనా, కానీ సత్యలోకమున జలము నిండు కొనుట వలన ఇచట ఉంటిమి.
సూతన్:  మహర్షీ వివరముగా సొల్లుడీ
వ్యాసన్:  వినాయక చవితి జయ ప్రదంగా ముగిసిందని భక్తులందరూ సంతసించితిరి. కానీ, కలుష భూయిష్టమైన లడ్డూలు, కుడుములూ ఆరగించిన పార్వతీనందనన్ కు అజీర్తి చేసినది. సత్య లోకమున నీటి కరవు వలననూ, ఇచట మేఘాలలో నీరు సమృద్ధిగా నుండుట వలననూ, మాటి మాటికి నీటి అవసరం తీరు నందాక , వారు ఇచట వసించుటకు నిశ్చయించారు.
సూతన్:  సత్య లోకమున నీరు లేకుండుట నాశ్చర్యముగ నున్నది.
నారదన్:   సూతా కొన్ని దేవ రహస్యము లుండును. అవి పురాణాలలో చెప్ప బడవు. సమయం, సందర్భం కలసి వచ్చినందున నే నీ కెరుక పరిచెద గాక. సావధానుడవై ఆలకించుము. పూర్వ బ్రహ్మల కాలములో మునులు, రాక్షసులు, పని లేని వారు, ఘోర తపం బాచరించెడి వారు. వారి తపాగ్ని సత్య లోకమున వ్యాపించి నీరు నావిరి చేసెను. నీరు లేక పోవుట వలన నవబ్రహ్మ విష్ణువు నాభి కమలమున జన్మించ వలసి వచ్చెను కదా.
సూతన్:  అది ఎట్లు స్వామిన్.?
నారదన్: సూతా నీవొక సందేహాల పుట్టవి. కమలము పుట్టుటకు నీరు కావలెను గదా. సత్యలోకమున నీరు ఇల్లె.  కైలాసమున మంచు గడ్డలలో కమల ముద్భవించదు కదా. అందువలన విష్ణు లోకమున జన్మించవలసి వచ్చెను.
సూతన్:  వైకుంఠము పాల  సముద్రమున నున్నది కదా. అచట నీరెట్టుల వచ్చెను?
నారదన్:  ఆహా సూతన్, తెలివైన ప్రశ్న వేసితివి.
సూతన్:   అవును, స్వామిన్, నేనెపుడునూ అంతే.
 నారదన్: పాల సముద్రం  శ్రీమన్మహాలక్ష్మికి  వారి తండ్రి గారు అరణము గా నిచ్చితిరి. ఒకానొక సమయము న శ్రీహరి కి శ్రీలక్ష్మి కి కలహము సంభవించెను. అపుడు శ్రీసతి తాను పాలు తాగి, పాలలోని నీరు శ్రీపతి చే తాగించెను. ఆ విధంగా శ్రీనాధుడి ఉదరమున మంచినీటి సరస్సు వెలసెను. కమలము జనియించెను. కమలం పుట్టగానే చటుక్కున నవబ్రహ్మ అందులోకూర్చుండి పోయెను  
సూతన్:   ఆహా, బ్రహ్మ నాభి కమలమున పుట్టుటకు ఇంత వృత్తాంతము గలదా. సరే మరి సత్య లోకమున నీటి కొఱత తీరుటెట్లు?
నారదన్:  నేనుంటిని గదా త్రిలోక సంచారిని. కైలాసం నించి వారాని కొక మారు రెండు టన్నుల ఐసు తెచ్చి పడవేయుచున్నవాడ. దానితో వారు సరిపెట్టు కుందురు.

ఇంతలో శ్రీగణేశన్ అత్యవసర పని ని పూర్తి చేసుకొని వచ్చెను.
శ్రీవినాయగన్: అందరూ కుశలమేనా, ఎచట నుండి రాక ఇటకున్ సూతా ఆఆఆఆ, సుఖులే శిష్యగణముల్, సాధ్వీలలామలున్ , ఆఆఅఆఆఆఅఆఆ
సూతన్:  స్వామీ మీరు రాగ మాపినచో ప్రత్యుత్తర మిచ్చెదను.
శ్రీవినాయగన్:  అది సరే, ఇచటకు నారద సహితులై  మీ రాక లోని అంతరార్ధ మేమి?
సూతన్:  తమకు తెలియని బ్రహ్మ రహస్యము లుండునా లంబోదరన్.
లంబోదరన్:   అంతయూ గ్రహించితిని. భూలోకమున ఆ ఎనానిమస్ యోగాభ్యాసం, త్రిలోకముల నలజడి ఇదియే గదా.
సూతన్:  అవును స్వామిన్, ఈ ఉపద్రవము నాపుటెట్లు?.
వ్యాసన్: అసలు ఈ కధ  ఏమి మలుపులు తిరగనున్నది. నేను మరల నొక పురాణము రాయ వలసిన అగత్యము దాపురించుచున్నదా?
నారదన్:  లేదు వ్యాసన్ నీవు రాయ నఖ్ఖర లేదు. వాడే రాయుచున్నాడు.
గజాననన్:  వాడు బ్లాగులో బరుకుచుండును. వాడు యోగాభ్యాసమొనర్చిన, వాని శరీరమున జ్యోతి ప్రజ్వలించును. ఆ  జ్యోతి  ప్రభావమున  సూక్ష్మ రూపుడై   త్రిలోక సంచారము   చేయగలడు.  త్రిలోకములలో పనీ పాడు లేని వారందరికి బ్లాగోపనిషత్తు నుపదేశించును. ముఖ్యముగా సూతమహర్షి యాశ్రమము న జొచ్చి, వినుటయే గాని మరి యొక పని లేని,    సూతుని కధలు వినుటకు నిచ్చగించని వారికి కూడ బ్లాగోపనిషత్తు నుపదేశించును. సాధ్వీమణులు కాలేని సాధ్వీ లలామలు, మహామునులు కాలేని మునులు వీని ప్రభావమునకు లోనై , వీడు ఉచితముగా నిచ్చు లప్పుటప్పు లను పట్టుకొని భూలోకమున బ్లాగులలో జొరబడుదురు. భూలోకమల్ల కల్లోల మగును.
వ్యాసన్:  అది ఎట్లు స్వామిన్?
గజకర్ణన్:  శ్రీ శ్రీ అని యొక మహాకవి యుండెడివాడు. ఆయన కవిత్వము రాయు వారల కొక ఉపదేశము  చేసెను,
తలుపు గొళ్ళెం
హారతి పళ్ళెం
గుఱ్ఱపు కళ్ళెం
కాదేది కవిత కనర్హం

దీనిని ఆదర్శంగా తీసుకొని బ్లాగులలో వ్రాయు కొందరు,
అరటి తొక్కా   కందముక్కా
కాలీఫ్లవరూ   కాకరకాయా
పాలవాడూ   నీళ్ళవాడూ
కూరలోడూ   కరెంటోడూ
ముద్దపప్పూ  ఆవకాయ
ఉప్మాకూరా    ఉప్పేలేని కూరా
మాడిన వేపుడు   ఉడకని అన్నం
మింగే మొగుడు   తినని పెళ్ళాం
అంటూ
ఏది చూస్తే   అదే రాస్తూ
ఏది తోస్తే    అదే రాస్తూ
అదే రాస్తూ  అదే రాస్తూ
బ్లాగు పాఠకుల
బుఱ్ఱే తింటూ  బుఱ్ఱే తింటూ
రాసేస్తున్నార్  బరికేస్తున్నార్
ఏమిటిదంటే
ఎందుకంటే  ఎందుకంటూ
రాసేసాడు   రాసేసాడూ
వీడో   మహా  పురాణం

ఈవిధంగా విజృంభించి రాసేస్తున్న భూలోక బ్లాగర్ల కి త్రిలోక వాసులు కూడా తోడైతే బ్లాగు పాఠకుల పని
శ్రీమద్రమారమణ గోవిందో హరి:   

ఇతి బ్లాగోపనిషత్తే  నేనెందుకు వ్రాస్తున్నాను  మహా పురాణ:  సమాప్త:

బృహస్పతి ఏమి ఉపాయం చేసాడు?
వీసా వెంకటేశ్వర స్వామి చిలుకూరు లో వెలియడానికి గల కారణాలు ఏమిటి?
విదేశీ కాన్సలేటు వాళ్ళు V V రికమండేషను ఎందుకు ఒప్పుకుంటారు?   T V S ను ఎందుకు ఒప్పుకోరు?
ఇంతకీ ఎనానిమస్ యోగా చేసాడా?
ఇల్లాంటి ప్రశ్న లన్నీ వచ్చేస్తున్నాయా మీకు?
వేద శాస్త్రములు చదివిన వారికే తెలియని బ్రహ్మ రహస్యం ఎనానిమస్ కి ఎలా తెలుస్తుంది? 

పి.యస్.: బ్లాగు లో పరిచయమైన మా చిన్నమ్మాయికి కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు. నేను ఎందుకు వ్రాస్తున్నానుమూడు భాగాలు  ఓపిక గా చదివి అవసరమైన చోట మార్పులు చేసి నందుకు.

నాకు పనీ పాడూ లేదు


                                


ఈ విషయం మాఆవిడకు మాత్రమే తెలుసుననుకొన్నాను. కాని ఇది అందరికి తెలిసిపోయిందని నాకు అర్ధం అవటానికి ఆలస్యం అయింది.  మాపక్కింటి పంకజాక్షిగార్కి, ఎదురింటి ఎంకట లక్ష్మిగార్కి, వెనకున్న వనజమ్మగార్కి ఇంకా అక్కడెక్కడో ఉన్న జ్యోతి గార్కి, ఇంకెక్కడో ఉన్న శ్రీలలితగార్కి, కూడా ఇదే అభిప్రాయం ఉందని తెలిసి కడుంగడు నానందించితిని. అమందానంద కందళిత హృదయార విందుడనైతిని.  మాఆవిడ అప్పుడప్పుడు నామీద జాలి పడినా, అమ్మలక్కల సమితి వాళ్ళూ, అఖిలాంధ్ర పెళ్ళాల సభ వాళ్ళు నామీద విరుచుకు పడిపోతున్నారు.  నేనేం  చేసినా అది పనికింద రాదు. నా ఉద్యోగం, నా కష్టం,  ఇవన్నీ హుళక్కు, మిధ్య, పనీ పాడు లేకుండా చేసే కాలక్షేపం బఠాణీలన్నమాట.  పైగా  సూదిలో దారం ఎక్కించడం కూడా చేతకాని వాడు, ఇంకే పని చెయ్యలేడు అని కూడా తీర్మానించేసారు.

వీళ్ళందరూ (మన అంటే మొగుళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి కష్టపడి) ఇంట్లో మేమెంత పని చేస్తున్నామో మీకు తెలుసా ఆయ్ అని కోప్పడ్డారు. ఇంట్లో ఎంత పని ఉంటుందో మీకు తెలుసా అని హాచ్చెర్యపడిపోయారు. ఇళ్ళు కడిగి ఊడ్చేస్తాం, గిన్నెలు చిల్లులు పడేలాగ ఉతికేస్తాం, బట్టలు చిరిగిపోయేదాకా తోమేస్తాం, వంట చేసి పాడేస్తాం తెలుసా అని డబాయించేసారు. మీరు విడిచిన లుంగీ తీసేది మేమే, మీ పక్క బట్టలు సర్దేది మేమే, మీరు తాగిన కాఫీ కప్పు కడిగేది మేమే, మామీద అజమాయషీ చెయ్యడానికి, నెలకి వెయ్యిరూపాయలు ఇచ్చి  మీరు పెట్టిన పనిమనిషికి కాఫీ టిఫెన్లు కూడా పెట్టేది మేమే, మేమే, మేమే అని మూడు మాట్లు నొక్కి మరీ ఉద్ఘాటించారు.  మీకేం, హాయిగా ఆఫీసు కెళ్ళిపోయి పనీ పాడు లేకుండా, టీ లో బిస్కెట్లు నంచుకుని తింటూ, ఎ.సి రూములో విశ్రాంతి తీసుకొని మధ్య మధ్య లో పక్కసీటు కాజల్ తోనో, ఎదుటి సీటు ఇలియానా తోనో  పోచికోలు కబుర్లు చెప్పుకొని నవ్వుకుంటూ  ఇంటికి తిరిగొచ్చే మీకు మాఅగచాట్లు అర్ధం చేసుకొనే మనసు లేదని కూడా దులిపేసారు. ఇంట్లో ఉన్న అనుష్క మీకు సూర్యాకాంతంలాగా, బయట ఛాయాదేవి నయనతారలాగా ఎందుకు కనిపిస్తుందో ఎప్పటికి మాకు అర్ధంకాదు అని  కర్కశంగా కడిగేసారు. పని చేసి, చేసి అలసి సొలసి పోయి కాస్త విశ్రాంతి కోసమని, మా చిన్నప్పటినించీ చూస్తున్న ఆడ వాళ్ళ కేనా అగచాట్లు అనే టి.వి సీరియల్ చూద్దామని కూర్చుంటే  కాఫీ అని అరుస్తాడా మొగుడు అని ఆవేశపడిపోయారు.

 నాజీవితంలో ముఖ్యమైన రెండో మనిషి, ఎప్పుడూ నన్ను విమర్శించే  మా బాసు గారు,  ఏపనీ సరిగ్గా చేయవేమోయి శంభులింగం అనీ, అసలు నీకు చేతనైన పని ఏదైనా ఉందా శంకరనారాయణా అనీ, నాకు అధికారాలు లేవుకానీ, ఉంటే నీకెప్పుడో ఉద్వాసన చెప్పేసేవాడిని సింహాచలం అనీ, అనేవాడు.  నా ప్రమోషను కాగితం పట్టుకొని, పదిహేనేళ్ళు ఒకే సీట్లో కూర్చున్నవాళ్ళందరికి ఇవ్వాలని రూలుండబట్టి నీకు ఇవ్వాల్సివచ్చింది  భజగోవిందం అని విచారించాడు. నన్ను ఎవరూ ఆదర్శంగా తీసుకోకూడదని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్ధించి, రెండు నిముషాలు మౌనం పాటించి మరీ ప్రమోషను ఆర్డరు చేతికి ఇచ్చాడు.  అంతేకానీ  పనీ పాడు లేకుండా కూర్చున్నాడు అని ఎప్పుడూ అనలేదు.  ఎందుకో మరి మాకాలనీ  AAS  and APS  వాళ్ళు నా మీద ఇల్లా విరుచుకు పడిపోతున్నారు.  పనీపాడూ లేనివాడనని.

నేను రిటైరయిన నాల్గో రోజున మా ఇంట్లో సంతాపసభ జరిగింది. పాపం లీలావతమ్మగార్కి ఎంత కష్టం వచ్చింది, ఆ హిరణ్యకశిపుడు ఇంక ఇంట్లోనే ఉంటే ఈమె పాట్లు, వర్ణింపనలవి  కాదు కదా అని నిర్వేదము తో కూడిన విచారముతో దు:ఖించి, నేను నా రిటైర్మెంటు తో వచ్చిన డబ్బుతో కొన్న స్వీట్లు, హాట్లూ, ఇవీ అవీ అన్నీ ముదమార, కడుపారగా భుజించి,  నన్నాడిపోసుకొని, మా ఆవిడను ఓదార్చి, ధైర్యం చెప్పి, నాపైన ఉసి గొల్పి తమ తమ స్వగృహముల కేగినారు. 

సంతాప సభ జరిగిన మరునాడు ఉదయం సరిగ్గా పదకొండు గంటలకు, నేను మృదు మధుర శాంత స్వనంతో దేవీ శ్రీదేవి, ఆర్యపుత్రీ, ఓ కప్పు కాఫీ కావాలి అని దీనంగా అభ్యర్ధించాను. మాఆవిడ విందో లేదో నాకు తెలియదు కాని పంకజాక్షి వినేసింది. ఆవిడ కు ఉన్న ఏకైక పని మాఇంట్లో దూరదర్శన్, దూరశ్రవణ్ ప్రసారాలను monitor   చేసి పున:ప్రసారం చేయడం.  నామాట వినడం, వాటికి ఇంకో రెండు విశేషణాలు జోడించి,  వాటిని తన మొబైల్ లో SMS చేసెయ్యడం జరిగిపోయింది. అదేదో వల పని(Net working) ట ఒక నొక్కుతో పాతిక మందికి పంపవచ్చుట. ఈవిడ మూడు నాలుగు నొక్కులు నొక్కిందనుకుంటాను. అంతేకాదు లాండ్ లైను, మొబైలు ఉపయోగించి  ఇంకో అంతమంది కి అడక్కుండానే సమాచారం మీచెవిలో స్కీము లో ప్రసారం చేసేసింది.  ఒక పావు గంటలో ఆల్ నెట్ వర్క్స్ ఆర్ బిజి అయిపోయాయి. మా ఆవిడ మొబైలు వెరీబిజి. SMS లు శరవేగంతో వచ్చేసాయి. మచ్చుకు కొన్ని అణిముత్యాలు,

ఈ దాష్టీకాన్ని ఖండిస్తున్నాము
దేవి శ్రీదేవి అని నిందించడాన్ని సహించరాదు
ఆర్యపుత్రీ అని తిట్టినందుకు క్షమార్పణ చెప్పాలి
రిటైరయిన వాడికి కూడా కాఫీనా అందునా మిట్టమధ్యాహ్నం
సీరియల్ టైములో కాఫీ అడిగితే ప్రభుత్వం ఏంచేస్తోంది 
రావణాసురుడి రాజ్యంలో మండోదరి కి రక్షణ లేదా

ఇంతలో  ఆడవారికే ప్రత్యేకమైన ఛానల్ పడతీ ఓ పడతీ లో బద్దలవుతున్న వార్త, బద్దలవుతున్న వార్త, బద్దలవుతున్న వార్త, అంటూ వచ్చేసింది. యాంకరమ్మ గారు భళ్ళున నవ్వి, ఇపుడే అమ్దిన వారత, సూడండి స్సూడండి. మాపెత్తేక ఇలేకరి చెబుతున్నారు. ఇలేకరిగారూ  ఇలేకరిగారూ ఇనిపిస్తోందా ఏం జెరుగుతోంది అకడ. 

విలేఖరి గారు అందుకున్నారు: ఇక్కడ పరిస్తితి అదుపు తప్పేటట్టుగా ఉంది. తాటకాసురుడి ఇంటివద్ద ఉన్నాం. ఇంటి తలుపులు వేసే ఉన్నాయి. అలికిడి వినిపించటంలేదు. బహుశా మహిషాసురుడు ఈ ఇంట్లో పతివ్రతా శిరోమణి అయిన తన సతీమణి ని చెరపట్టాడనీ, కాఫీ ఇమ్మని బలాత్కారం చేస్తున్నాడని చెప్పుతున్నారు. AAS  మరియూ APS సభ్యులు ఇంటిని చుట్టుముట్టారు.

యాంకరమ్మ: ఆ ఇంట్లో ఎవరునారు? తాతకాసుర్ కి మహిసాసుర్ కి హేమితీ రిలేసన్. ఇందాక రావనాసుర్ అని అనారు. ఈన ఎవరు?  AAS, APS  ఏమ్తి?

ఇలేకరి: ఇంట్లో ఉన్న మొగుడాసురుడిని ఎవరి కిష్టమైన పేరుతో వారు పిలుస్తున్నారు. అందరూ ఒకటే. అమ్మల అక్కల సమితి, అఖిలాంధ్ర పెళ్ళాల సభ.  ఇప్పుడే మగ పోలీసులు వచ్చారు. ఆడ పోలీసులు వచ్చేదాకా మేమేం చెయ్యం అని అంటున్నారు. పంకజాక్షి గారిని అడుగుదాం.  పంకజాక్షిగారూ ఏంజరుగుతోంది ఇక్కడ.

పంకజాక్షి:  ఏంజరుగుతోందా? అనాదిగా ఈదేశంలో జరుగుతున్నదే. ఇక్కడ పునరావృతం అవుతోంది. కడుపునొప్పితో, శిరోవేదనతో, బాధపడుతున్న సతీమణి ని,  61ఏళ్ళ స్త్రీరత్నాన్ని కాఫీ  ఇమ్మని  పొద్దున్నించి  మొగుడు నానాహింసలు  పెడుతుంటే  కడుపు రగిలిపోవట్లేదా నీకు. ఇంకా ఎన్నాళ్ళు ఈ పురుషాహంకారం.  ఈ హింసకు కారణమైన వారిని అరెస్టు చేసేదాకా మేము నిరశన కొనసాగిస్తాము.  జై AAS జైజై  APS.

బద్దలవుతున్నవార్త,  బద్దలవుతున్నవార్త,  బద్దలైపోయిన  వ్ ఆ ర్ త్ అ.

మొగుడు దొడ్డితలుపు తెరుచుకొని దొడ్డిదారిని గోడ దూకి కాలు విరగకొట్టుకొని కుంటుకుంటూ పరిగెడుతూ, పరిగెడుతూ పారిపోయాడు.  మామూలుగానే పోలీసులు దొడ్డదారిని ఇంట్లో ప్రవేశించారు.  పతివ్రతాసతీశిరోమణి  గాఢనిద్రలో ఉన్నట్టు అభిజ్ఞవర్గాల భోగట్టా.  ఏమిచెయ్యాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారని, ఏం జరుగుతోందో తెలియక ప్రభుత్వం ఉత్తరదిశగా చూస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి.

నేను:  ఏంచేసానో అర్ధంకాక, ఇప్పుడు ఏంచెయ్యాలో తోచక, పోలీసుల భయంతో పారిపోయి, మళ్ళీ వారిచేతికి చిక్కడం ఇష్టంలేక, ఆత్మహత్య చేసుకుందామని డిసైడయిపోయాను.  జేబులో ఓ సంతకం చేసిన తెల్లకాగితం పెట్టుకుంటున్నాను.  నా ఆత్మహత్య ఏరాజకీయ పార్టీకో,  ఏ రాజకీయ నాయకుడికో పనికి వస్తే, ఆవిధంగా రాసుకొని, పాపం మా ఆవిడ కి ఒకటొ రెండో లక్షలు వస్తాయేమో చూడండి.

ఇకపై నా గతేమి,   లేదా గోదారి,   అంతదూరం కష్టమేమో,   ఉందిగా  మూసీ,    అని పాడుకుంటూ  

జై భజరంగ  భళీ  దూకేస్తున్నాను  దూకేస్తున్నాను మూసీలోకి.  నన్నెవరూ పట్టుకోరా ప్లీజ్.