నాకు పనీ పాడూ లేదు


                                


ఈ విషయం మాఆవిడకు మాత్రమే తెలుసుననుకొన్నాను. కాని ఇది అందరికి తెలిసిపోయిందని నాకు అర్ధం అవటానికి ఆలస్యం అయింది.  మాపక్కింటి పంకజాక్షిగార్కి, ఎదురింటి ఎంకట లక్ష్మిగార్కి, వెనకున్న వనజమ్మగార్కి ఇంకా అక్కడెక్కడో ఉన్న జ్యోతి గార్కి, ఇంకెక్కడో ఉన్న శ్రీలలితగార్కి, కూడా ఇదే అభిప్రాయం ఉందని తెలిసి కడుంగడు నానందించితిని. అమందానంద కందళిత హృదయార విందుడనైతిని.  మాఆవిడ అప్పుడప్పుడు నామీద జాలి పడినా, అమ్మలక్కల సమితి వాళ్ళూ, అఖిలాంధ్ర పెళ్ళాల సభ వాళ్ళు నామీద విరుచుకు పడిపోతున్నారు.  నేనేం  చేసినా అది పనికింద రాదు. నా ఉద్యోగం, నా కష్టం,  ఇవన్నీ హుళక్కు, మిధ్య, పనీ పాడు లేకుండా చేసే కాలక్షేపం బఠాణీలన్నమాట.  పైగా  సూదిలో దారం ఎక్కించడం కూడా చేతకాని వాడు, ఇంకే పని చెయ్యలేడు అని కూడా తీర్మానించేసారు.

వీళ్ళందరూ (మన అంటే మొగుళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి కష్టపడి) ఇంట్లో మేమెంత పని చేస్తున్నామో మీకు తెలుసా ఆయ్ అని కోప్పడ్డారు. ఇంట్లో ఎంత పని ఉంటుందో మీకు తెలుసా అని హాచ్చెర్యపడిపోయారు. ఇళ్ళు కడిగి ఊడ్చేస్తాం, గిన్నెలు చిల్లులు పడేలాగ ఉతికేస్తాం, బట్టలు చిరిగిపోయేదాకా తోమేస్తాం, వంట చేసి పాడేస్తాం తెలుసా అని డబాయించేసారు. మీరు విడిచిన లుంగీ తీసేది మేమే, మీ పక్క బట్టలు సర్దేది మేమే, మీరు తాగిన కాఫీ కప్పు కడిగేది మేమే, మామీద అజమాయషీ చెయ్యడానికి, నెలకి వెయ్యిరూపాయలు ఇచ్చి  మీరు పెట్టిన పనిమనిషికి కాఫీ టిఫెన్లు కూడా పెట్టేది మేమే, మేమే, మేమే అని మూడు మాట్లు నొక్కి మరీ ఉద్ఘాటించారు.  మీకేం, హాయిగా ఆఫీసు కెళ్ళిపోయి పనీ పాడు లేకుండా, టీ లో బిస్కెట్లు నంచుకుని తింటూ, ఎ.సి రూములో విశ్రాంతి తీసుకొని మధ్య మధ్య లో పక్కసీటు కాజల్ తోనో, ఎదుటి సీటు ఇలియానా తోనో  పోచికోలు కబుర్లు చెప్పుకొని నవ్వుకుంటూ  ఇంటికి తిరిగొచ్చే మీకు మాఅగచాట్లు అర్ధం చేసుకొనే మనసు లేదని కూడా దులిపేసారు. ఇంట్లో ఉన్న అనుష్క మీకు సూర్యాకాంతంలాగా, బయట ఛాయాదేవి నయనతారలాగా ఎందుకు కనిపిస్తుందో ఎప్పటికి మాకు అర్ధంకాదు అని  కర్కశంగా కడిగేసారు. పని చేసి, చేసి అలసి సొలసి పోయి కాస్త విశ్రాంతి కోసమని, మా చిన్నప్పటినించీ చూస్తున్న ఆడ వాళ్ళ కేనా అగచాట్లు అనే టి.వి సీరియల్ చూద్దామని కూర్చుంటే  కాఫీ అని అరుస్తాడా మొగుడు అని ఆవేశపడిపోయారు.

 నాజీవితంలో ముఖ్యమైన రెండో మనిషి, ఎప్పుడూ నన్ను విమర్శించే  మా బాసు గారు,  ఏపనీ సరిగ్గా చేయవేమోయి శంభులింగం అనీ, అసలు నీకు చేతనైన పని ఏదైనా ఉందా శంకరనారాయణా అనీ, నాకు అధికారాలు లేవుకానీ, ఉంటే నీకెప్పుడో ఉద్వాసన చెప్పేసేవాడిని సింహాచలం అనీ, అనేవాడు.  నా ప్రమోషను కాగితం పట్టుకొని, పదిహేనేళ్ళు ఒకే సీట్లో కూర్చున్నవాళ్ళందరికి ఇవ్వాలని రూలుండబట్టి నీకు ఇవ్వాల్సివచ్చింది  భజగోవిందం అని విచారించాడు. నన్ను ఎవరూ ఆదర్శంగా తీసుకోకూడదని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్ధించి, రెండు నిముషాలు మౌనం పాటించి మరీ ప్రమోషను ఆర్డరు చేతికి ఇచ్చాడు.  అంతేకానీ  పనీ పాడు లేకుండా కూర్చున్నాడు అని ఎప్పుడూ అనలేదు.  ఎందుకో మరి మాకాలనీ  AAS  and APS  వాళ్ళు నా మీద ఇల్లా విరుచుకు పడిపోతున్నారు.  పనీపాడూ లేనివాడనని.

నేను రిటైరయిన నాల్గో రోజున మా ఇంట్లో సంతాపసభ జరిగింది. పాపం లీలావతమ్మగార్కి ఎంత కష్టం వచ్చింది, ఆ హిరణ్యకశిపుడు ఇంక ఇంట్లోనే ఉంటే ఈమె పాట్లు, వర్ణింపనలవి  కాదు కదా అని నిర్వేదము తో కూడిన విచారముతో దు:ఖించి, నేను నా రిటైర్మెంటు తో వచ్చిన డబ్బుతో కొన్న స్వీట్లు, హాట్లూ, ఇవీ అవీ అన్నీ ముదమార, కడుపారగా భుజించి,  నన్నాడిపోసుకొని, మా ఆవిడను ఓదార్చి, ధైర్యం చెప్పి, నాపైన ఉసి గొల్పి తమ తమ స్వగృహముల కేగినారు. 

సంతాప సభ జరిగిన మరునాడు ఉదయం సరిగ్గా పదకొండు గంటలకు, నేను మృదు మధుర శాంత స్వనంతో దేవీ శ్రీదేవి, ఆర్యపుత్రీ, ఓ కప్పు కాఫీ కావాలి అని దీనంగా అభ్యర్ధించాను. మాఆవిడ విందో లేదో నాకు తెలియదు కాని పంకజాక్షి వినేసింది. ఆవిడ కు ఉన్న ఏకైక పని మాఇంట్లో దూరదర్శన్, దూరశ్రవణ్ ప్రసారాలను monitor   చేసి పున:ప్రసారం చేయడం.  నామాట వినడం, వాటికి ఇంకో రెండు విశేషణాలు జోడించి,  వాటిని తన మొబైల్ లో SMS చేసెయ్యడం జరిగిపోయింది. అదేదో వల పని(Net working) ట ఒక నొక్కుతో పాతిక మందికి పంపవచ్చుట. ఈవిడ మూడు నాలుగు నొక్కులు నొక్కిందనుకుంటాను. అంతేకాదు లాండ్ లైను, మొబైలు ఉపయోగించి  ఇంకో అంతమంది కి అడక్కుండానే సమాచారం మీచెవిలో స్కీము లో ప్రసారం చేసేసింది.  ఒక పావు గంటలో ఆల్ నెట్ వర్క్స్ ఆర్ బిజి అయిపోయాయి. మా ఆవిడ మొబైలు వెరీబిజి. SMS లు శరవేగంతో వచ్చేసాయి. మచ్చుకు కొన్ని అణిముత్యాలు,

ఈ దాష్టీకాన్ని ఖండిస్తున్నాము
దేవి శ్రీదేవి అని నిందించడాన్ని సహించరాదు
ఆర్యపుత్రీ అని తిట్టినందుకు క్షమార్పణ చెప్పాలి
రిటైరయిన వాడికి కూడా కాఫీనా అందునా మిట్టమధ్యాహ్నం
సీరియల్ టైములో కాఫీ అడిగితే ప్రభుత్వం ఏంచేస్తోంది 
రావణాసురుడి రాజ్యంలో మండోదరి కి రక్షణ లేదా

ఇంతలో  ఆడవారికే ప్రత్యేకమైన ఛానల్ పడతీ ఓ పడతీ లో బద్దలవుతున్న వార్త, బద్దలవుతున్న వార్త, బద్దలవుతున్న వార్త, అంటూ వచ్చేసింది. యాంకరమ్మ గారు భళ్ళున నవ్వి, ఇపుడే అమ్దిన వారత, సూడండి స్సూడండి. మాపెత్తేక ఇలేకరి చెబుతున్నారు. ఇలేకరిగారూ  ఇలేకరిగారూ ఇనిపిస్తోందా ఏం జెరుగుతోంది అకడ. 

విలేఖరి గారు అందుకున్నారు: ఇక్కడ పరిస్తితి అదుపు తప్పేటట్టుగా ఉంది. తాటకాసురుడి ఇంటివద్ద ఉన్నాం. ఇంటి తలుపులు వేసే ఉన్నాయి. అలికిడి వినిపించటంలేదు. బహుశా మహిషాసురుడు ఈ ఇంట్లో పతివ్రతా శిరోమణి అయిన తన సతీమణి ని చెరపట్టాడనీ, కాఫీ ఇమ్మని బలాత్కారం చేస్తున్నాడని చెప్పుతున్నారు. AAS  మరియూ APS సభ్యులు ఇంటిని చుట్టుముట్టారు.

యాంకరమ్మ: ఆ ఇంట్లో ఎవరునారు? తాతకాసుర్ కి మహిసాసుర్ కి హేమితీ రిలేసన్. ఇందాక రావనాసుర్ అని అనారు. ఈన ఎవరు?  AAS, APS  ఏమ్తి?

ఇలేకరి: ఇంట్లో ఉన్న మొగుడాసురుడిని ఎవరి కిష్టమైన పేరుతో వారు పిలుస్తున్నారు. అందరూ ఒకటే. అమ్మల అక్కల సమితి, అఖిలాంధ్ర పెళ్ళాల సభ.  ఇప్పుడే మగ పోలీసులు వచ్చారు. ఆడ పోలీసులు వచ్చేదాకా మేమేం చెయ్యం అని అంటున్నారు. పంకజాక్షి గారిని అడుగుదాం.  పంకజాక్షిగారూ ఏంజరుగుతోంది ఇక్కడ.

పంకజాక్షి:  ఏంజరుగుతోందా? అనాదిగా ఈదేశంలో జరుగుతున్నదే. ఇక్కడ పునరావృతం అవుతోంది. కడుపునొప్పితో, శిరోవేదనతో, బాధపడుతున్న సతీమణి ని,  61ఏళ్ళ స్త్రీరత్నాన్ని కాఫీ  ఇమ్మని  పొద్దున్నించి  మొగుడు నానాహింసలు  పెడుతుంటే  కడుపు రగిలిపోవట్లేదా నీకు. ఇంకా ఎన్నాళ్ళు ఈ పురుషాహంకారం.  ఈ హింసకు కారణమైన వారిని అరెస్టు చేసేదాకా మేము నిరశన కొనసాగిస్తాము.  జై AAS జైజై  APS.

బద్దలవుతున్నవార్త,  బద్దలవుతున్నవార్త,  బద్దలైపోయిన  వ్ ఆ ర్ త్ అ.

మొగుడు దొడ్డితలుపు తెరుచుకొని దొడ్డిదారిని గోడ దూకి కాలు విరగకొట్టుకొని కుంటుకుంటూ పరిగెడుతూ, పరిగెడుతూ పారిపోయాడు.  మామూలుగానే పోలీసులు దొడ్డదారిని ఇంట్లో ప్రవేశించారు.  పతివ్రతాసతీశిరోమణి  గాఢనిద్రలో ఉన్నట్టు అభిజ్ఞవర్గాల భోగట్టా.  ఏమిచెయ్యాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారని, ఏం జరుగుతోందో తెలియక ప్రభుత్వం ఉత్తరదిశగా చూస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి.

నేను:  ఏంచేసానో అర్ధంకాక, ఇప్పుడు ఏంచెయ్యాలో తోచక, పోలీసుల భయంతో పారిపోయి, మళ్ళీ వారిచేతికి చిక్కడం ఇష్టంలేక, ఆత్మహత్య చేసుకుందామని డిసైడయిపోయాను.  జేబులో ఓ సంతకం చేసిన తెల్లకాగితం పెట్టుకుంటున్నాను.  నా ఆత్మహత్య ఏరాజకీయ పార్టీకో,  ఏ రాజకీయ నాయకుడికో పనికి వస్తే, ఆవిధంగా రాసుకొని, పాపం మా ఆవిడ కి ఒకటొ రెండో లక్షలు వస్తాయేమో చూడండి.

ఇకపై నా గతేమి,   లేదా గోదారి,   అంతదూరం కష్టమేమో,   ఉందిగా  మూసీ,    అని పాడుకుంటూ  

జై భజరంగ  భళీ  దూకేస్తున్నాను  దూకేస్తున్నాను మూసీలోకి.  నన్నెవరూ పట్టుకోరా ప్లీజ్.








సతీ ద్రౌపదీ పాకం (ఆడ వారికి మాత్రమే)

పెళ్ళై కొత్తగా కాపురానికి వెళ్ళేటప్పుడు మాఅమ్మ చెప్పింది, మగాడి హృదయానికి దగ్గిర దారి వాడి పొట్ట అని. మామూలుగా అందరు తల్లులు చెప్పినట్టుగానే “మగడి అడుగుజాడలలోనే నడవాలి. అతని కను సన్నల లోనే మెలగాలి. మొగుడు ముండాకొడుక్కి ఏకష్టమూ రాకుండా చూసుకోవాలి” అని కూడా చెప్పింది. అప్పట్లో అమాయకపు వెర్రిపిల్లని కాబట్టి, కామోసు అనుకొని అల్లాగే నడవడానికి ప్రయత్నించాను. కాలం గడిచే కొద్ది, మగరాక్షసుడు ఆడఇస్త్రీని ఎంతగా అణగ తొక్కుతున్నాడో అర్ధం చేసుకోసాగాను. ఈనికృష్ట, నీచ, స్వార్ధ మగ ప్రపంచ౦లో స్త్రీని సమిధల లాగ వాడుకొంటున్నారని అర్ధం అవసాగింది. ఏఆడది ఐనా “ఓరి నాకొడకా, నీ భార్య అడుగు జాడల లోనే నడవాలి. ఆమె మాటకు ఎదురు చెప్పకూడదు” అని బోధిస్తోందా అని నేను మిమ్ములని ప్రశ్నిస్తున్నాను. మనం మారి తీరాల్సిన సమయం ఆసన్నమయింది అని నేను నొక్కి వక్కాణిస్తున్నాను. మగపురుగులను జయించి, అణగదొక్కి, మన కాలుకింద చెప్పులాగ చేసుకొని, మనటామీ పక్కన కట్టిపడేయాలి. అంత దాక లేదు మనకి విశ్రాంతి అని తీర్మానించుకున్నాను. నిద్రాహారాలు మాని ఈ విషయం మీద తీవ్రంగా, నిశితంగా మరియూ దీర్ఘంగా ఆలోచించుట కుపక్రమించితిని. చించగా, చించగా మాపెరట్లో కరివేపాకు మహా వృక్షము కింద నాకు జ్ఞానోదయమై౦ది. ఆహా! మహా వృక్షములుండునది న్న్యూటన్, గౌతముడు, నేను లాంటి మహాత్ములకు జ్ఞానోదయము కలుగుటకే కదా! మగాడిని జయించటానికి కూడా వాడి పొట్టే గతి అని గ్రహించాను. అప్పటినించి వంటలమీద సమగ్ర పరిశోధనలు, ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాను. పురాతన తాళపత్ర గ్రంధాలు చదివాను. హిమాలయ పర్వతాల్లో కందమూలాలు మాత్రమే తిని తపస్సు చేసుకొనే మునుల పత్నులతో చర్చలు జరిపాను. ఈవిధంగా సంపాదించిన జ్ఞానాన్ని మీ అందరితో ప౦చుకొందామని ఈ నా ప్రయత్నం.

మగవాళ్ళని మంచివారని, చెడ్డవారని వేరుగా చూడవద్దు. రాముడైనా, రావణాసురుడైనా మగాడే. మనం ఇద్దరినీ జయించాలి. మగాళ్ళు ముఖ్యంగా మొగుళ్ళు రెందు రకాలుగా ఉంటారు. పాషాణహృదయులు, వెన్న సమాన మానసులు అని. మళ్ళీ ఇందులో subcategories ఉంటాయి. వెన్నలో అప్పుడే చేసినవెన్న, ఫ్రిజ్ లో దాచిన వెన్న, గేదెవెన్న, ఆవువెన్న ఇత్యాదులు. వీటి గట్టితనంలో తేడాలుంటాయి. అల్లాగే, పాషాణాలలో కూడా, ఇటుక, రాయి, గ్రానైట్, బండరాయి మొదలైనవి.. ఏమగాడైనా వెన్నగాడో పాషాణంగాడో ఎల్లా తెలుస్తుంది. మామూలుగా అయితే అనుభవం మీద తెలుస్తుంది. అనుభవించి తెలుసుకోవాలంటే టైము పడుతుంది. ఈలోపల వాడు ఏకు మేకై కూర్చుంటాడు. మరీ ఆలస్యం అయితే వాడు గేస్ లీక్ చేయించేస్తాడు. అందుకనే సాధ్యమైనంత త్వరగా మొక్కగా ఉండగానే వంచాలి. మొక్కని ఏ పరిస్తితుల్లోనూ మాను కానీయ రాదు. తేలిగ్గా కనిపెట్టటానికి ఒక పద్ధతి ఉంది. సినిమాల్లో హీరో లాగ ప్రవర్తించే వాళ్ళు సర్వసాధారణంగా పాషాణ హృదయులని నా ధృఢ విశ్వాసం. ఎ౦దు కంటారా, హీరోని చూడండి, ఎడా పెడా జనాలని, అదే, గూండాలని, విలన్లని ఉతికి పారేస్తుంటాడు. చేతితోనూ, కాలితోనూ అప్పుడప్పుడు తలతో ఎద్దులాగ కుమ్మేస్తుంటాడు. గాడిదలాగ కాళ్ళు వెనక్కివిసిరి తన్నేస్తుంటాడు. నేలమీద నడుస్తూ, పరిగెడుతూ కొట్టేస్తుంటాడు. ఈమధ్యన గోడలమీద, కప్పులకింద కూడా నడుస్తూనూ, ఎగిరి గాలిలోనూ గూండాలని ఉతికేయడం మొదలు పెట్టేడు. ఇహ, విలనుగారో, వాడి ఎస్ బాసుగాడో తుపాకీ కాల్చేస్తుంటాడు. ఎప్పుడైనా గుండు హీరోగారి గుండెలోనో, కాలిలోనో మరెక్కడైనాకాని దిగబడి పోతుంది. అయినా డోంట్ కేర్. ఈయన అల్లాగే కుమ్మేస్తుంటాడు. పటకా కత్తితో కొట్టినా, కత్తితో గుండెలో పొడిచినా ఈయన తనపని మానడు. ఉతుకుడే ఉతుకుడు. కత్తి గుండెలో దించినా, తుపాకితో కాల్చినా ఏమాత్రమూ నొప్పిలేనివాడు పాషాణహృదయుడేనని నాగట్టి నమ్మకము.

సినిమాల్లో హీరోయిన్ బీదతండ్రి లాంటివాళ్ళు వెన్నసమానమానసులు అని నా అనుమానం. ఈయనికి చీమ కుట్టినా నెత్తురు కారిపోతుంది.. కాలి మీద కుట్టినా నోట్లోంచి ముక్కులోంచి రక్తం కారిపోతూంటుంది. అర్జంటుగా ఆసుపత్రికి తీసుకెళ్ళాల్సివస్తుంది. ఆసుపత్రిలో డాక్టర్లు తెగ కంగారు పడిపోతారు, పెట్టేస్తారు. హీ.తం. కి రక్తం ఎక్కించేస్తారు. ఓ ఫుట్ బాల్ బ్లాడరు లాంటిది ఈయనకు తగిలించేస్తారు. అందులో గాలి నిండుతూ ఉ౦టుంది, వెంటనే ఖాళీ అవుతూంటుంది. ఎందుకో మనకి అర్ధంకాదు. మనకేంటి వాళ్ళకే అర్ధంకాదు. నర్సమ్మ దాని కేసి దీర్ఘంగా, విషాదంగా చూస్తూంటుంది. ఎందుకైనా మంచిదని ఆయనికి ఓ మిషను తగిలించేస్తారు. అందులో ఓ తెల్లగీత అడ్డ దిడ్డంగా పరిగెడుతూంటు౦ది. అప్పుడు డాక్టరు  గారు గంభీరంగా, భారంగా, విషాదంగా కళ్ళు తుడుచుకుంటూ చెప్పుతాడు. హీ.తం. కి ’యాంట్ కుటింగ్ ఫోబియా’. అర్జంటుగా ఆపరేషన్ చేయాలి. లక్షా ముఫ్ఫైఆరువేల పద్ధెనిమిది రూపాయల నలభై పైసలు అవుతుంది. అర్జంటుగా కట్టేయండి అని చెప్పేసి, వెంటనే వెళ్ళిపోతాడు, ఎవరూ ఏమీ ప్రశ్నించకుండా. హీ. దగ్గర సరిగ్గా పద్ధెనిమిది రూపాయల నలభై పైసలు మాత్రమే ఉంటాయి. హరిలోరంగ హరి అనిపాడుతూ పరుగు లంకి౦చుకుంటుంది మిగతాడబ్బుకోసం. ఆపైకధ మీరు ఏసిన్మాలో చూసినా తెలిసిపోతుంది. మన కధకొస్తే, చీమకుడితేనే ఇంత కంగారుపడి, కంగారుపెట్టే మనిషి వెన్నమనసుగాడేనని నేను నమ్ముతాను.

ఈపద్ధతిలో కనిపెట్టినపుడు, అప్పుడప్పుడు, ఘోరమైన తప్పిదాలు జరుగుతుంటాయి. మగాళ్ళలో గోముఖ వ్యాఘ్రాలు, పులిచర్మం కప్పుకొన్న నక్కలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. తేలిగ్గా కనిపెట్టడానికి కొన్ని కొండ గుర్తులున్నాయి. వంకాయ కూర మాఅమ్మమ్మ చేస్తేనే బాగుంటుంది. మానాన్నమ్మ బెండకాయ ఇగురు చేసింద౦టే గిన్నెకూడా నాకేస్తాము. మా అమ్మలాగ వంట ఎవరూ చెయ్యలేరు అని గొణుక్కొనేవాడు పాషాణం గాడు. వెన్నగాళ్ళు ఉప్పుకొంచెం తక్కువయిందనో, పులుపు చాలలేదనో సలహాలు పాడేస్తూ, ఫరవాలేదనో, బాగానే ఉందని సాగదీస్తూ లాగించేస్తారు. లేలేతవెన్నగాళ్ళు మనం ఏంచేసినా, ఎల్లాచేసినా అమృతంలా ఉందంటూ ముక్కుమూసుకొని తినేస్తారు. వీళ్ళని మనమేం చేయనఖ్ఖరలేదు. వాళ్ళే ఓగొలుసు తెచ్చుకొని కట్టేసుకొని మనకుక్క పక్కన పడి ఉంటారు. కాని వీళ్ళతో మనకి విజయగర్వం ఉండదు. యుద్ధంచేసి గెలిస్తే వచ్చే ఆనందమే చిదానందం. కొన్ని హృదయాలు అంతుబట్టవు. వాళ్ళు పెళ్ళాంతోటే కాదు, అమ్మ, తోబుట్టువులతో కూడా అంతగా మాట్లాడరు. ఏంపెట్టినా తినేసి వెళ్ళిపోతారు. మనసులో ఏముందో బయటకు చెప్పరు. చిన్నపాము నైనా పెద్దకర్ర తోటే కొట్టాలన్న సూత్రం వీళ్ళకి వర్తింపచేయాలి.

మొగాళ్ళని ఇలా ఏరకం  గాడో కనిపెట్టేసిన తర్వాత మనం శస్త్రాలను, అస్త్రాలను సిద్ధం చేసుకోవాలి. వెన్న మానసులకి శస్త్రాలు చాలు. అస్త్రాలు అఖ్ఖర్లేదు. మనలో కూడా కొంతమంది శాడిస్ట్స్ ఉండవచ్చు. వాళ్ళు శస్త్రాలతో మొగుడిని ఆట పట్టించి, ఏడిపించి, చివరకు అస్త్రాలతొ పడగొట్టవచ్చు. తేలికగా విజయం సాదించాలా లేక అట ఆడుకుంటూ కొట్టేయాలా అన్నది మన ఇష్టం. ఇప్పుడు ఆగ్నేయాస్త్రం లాంటి వంటకం ఒకటి తయారుచేసే విధానం చెబుతాను. ఇది వెన్నమనస్కుల దగ్గరిని౦చి గ్రానైటు గాళ్ళదాకా ’వైడ్ స్పెక్ట్రమ్ ఏంటిబయాటిక్’ లాగ పనిచేస్తుంది. దీని  పేరే ’ సతీ  ద్రౌపదీ  పాకం’. ఇది  ఒక్కమాటు తింటే చాలు, నిర్వీర్యుడై, నిస్తేజుడై, నిరాసక్తుడై మన్నుతిన్న పాములాగ, మీమాట దాటకుండా పడిఉంటాడు. పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు ద్రౌపది ఈవంటకం చేసిందని, అది తిన్న పాండవులు మూర్ఛపోయారని మునిపత్నులు నాకు చెప్పారు. అప్పుడే ధర్మరాజు ద్రౌపదిని వంట డ్యూటీ నించి తప్పించి భీమసేనుడికి వంట వార్పుల డ్యూటీ అప్పగించాడని ప్రతీతి. ఈవిషయం బయటకు పొక్కకుండా శ్రీకృష్ణుడు చాలాజాగ్రత్తలు తీసుకొన్నాడని నాపరిశోధనలలో తేలింది.

సతీ ద్రౌపదీపాక౦ చేయడం చాలాతేలిక. ఏకూరగాయ కనిపిస్తే అది వాడవచ్చు. ఆకుకూరైనా బాగానే ఉంటుంది. రె౦డూ కలిపి కూడా వేయవచ్చు. ఏది లేకపోయినా డోంట్ వర్రీ, నిన్నమిగిలిన కూరైనా సరిపోతుంది. ఇదీలేకపోతే పక్కింటివాళ్ళు పాడేసిన పుచ్చువంకాయలు, పండిపోయిన అరటికాయలు, ఎండిపోయి పురుగుపట్టిన తోటకూర ఏదైనాసరే నిరభ్యంతరంగా వాడవచ్చు. స్టవ్ వెలిగించి, పైన ఒకమూకుడు పెట్టి ఎంతో కొంత నూనె వెయ్యండి. నూనె కాగిం తర్వాత మనం వేయాలనుకున్న ఆకు కూరలు, కూర గాయలు ఇత్యాదులన్నీ కలిపి  వేయండి. అతర్వాత ఎంతో  కొంత అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటొ, కొత్తిమీర, కరివేపాకు లలో ఏమి ఉంటే అవి వెయ్యండి. ఈ వంటకంలో  గొప్పతన మేమిటంటే వేటికీ  కొలతలు చూడ నఖ్ఖరలేదు. ఇవన్నీ ఉడకడానికి టైము పడుతుంది కాబట్టి, మీరు వెళ్ళి హాయిగా టివి పెట్టుకొని ఒక సీరియల్ చూసేయండి. సీరియల్ చూసి ఏడ్చి ముక్కు చీదుకున్న తర్వాత, స్టవ్ మీది మూకుడు మీదకు ఓ లుక్ పారేయండి. నూనె పొగలు కక్కుతూంటుంది. వేసిన పదార్ధాలు నలుపు రంగులోకి మారుతూంటాయి. ఈమాటు ఇంత పప్పు, ఎండుమిర్చి, ఉప్పు వేసి, అవసరమనుకొంటే మరింత నూనె పోసి మళ్ళీవచ్చి టివి లో లీనమై పొండి. మళ్ళీకొ౦చెం సేపు ఏడ్చింతర్వాత, మిమ్మల్ని మీరే ఓదార్చుకొని వచ్చి ఇన్నిమెంతులు, ఆవాలు, ధనియాల పొడి, మసాలా పొడి వేసి చూడండి. మూకుడులో పదార్ధం నల్ల నల్లగా, జిగురు జిగురుగా అదో రకమైన కంపు కొడుతూంటుంది. బాగాకలియపెట్టి ఇంత పెరుగు పోసి వచ్చేయండి టివి దగ్గరకు. టివి లో ’ విప్పండి చీర, గెలవండి లంగా’ కార్యక్రమం అయిం తర్వాత వచ్చి స్టవ్ ఆర్పేసి మూకుడు దింపేయండి. సువాసన కోసం ఇంత ఏలకుల పొడి, లవంగాల పొడి తగిలించండి. సతీ ద్రౌపదీపాకం రెడీ. ముఖ్యగమనిక:- ఇది పొరపాటున కూడా మీరు రుచి చూడకండి.

మీశ్రీవారికి ఇది ప్రేమగా అన్నంలొ కలిపి పెట్టండి. మీఆయన వచ్చేటప్పటికి ఇది కలిపి అట్టేపెట్టండి. లేకపోతే నల్ల నల్లగా, తెల్ల తెల్లగా, జిగురుగా ఉన్న కూరలాంటి పదార్ధాన్ని అన్నంలో కలుపుకోడానికి గురుడు ఇష్ట పడక పోవచ్చు. అవసరం ఐతే ఇంత శృంగారాన్ని ఒలకబోసి శ్రీవారిని మత్తులో దించి వాడి నోట్లో మూడు నాలుగు ముద్దలు కుక్కేసి నోరూ ముక్కూ మూసేయండి. ఊపిరాడక, దిక్కుతోచక వెఱ్ఱి మొగుడు నోట్లోది, గొంతులోంచి పొట్టలోకి ట్రాన్స్ ఫర్ చేసేస్తాడు. అంతే ఫినిష్. మీరు జయించినట్లే. ఒక్కమాటు అమాంతంగా పైకిలేస్తాడు. మీకేసి కౄరంగా కసిగా చూస్తాడు. కంగారుపడకండి. అంతేవేగంగా వాడి కడుపులో గుడగుడా మెదడులో బడబడా మొదలైపోతుంది. తట్టుకోలేక, ఆయొక్క శ్రీమన్నారాయణుడి దివ్యసాక్షాత్కారం పొందిన భక్తుడి లాగ నిశ్చేష్టుడయి పోతాడు. మంచినీళ్ళు గడగడా తాగేస్తాడు. కిందపడి దొర్లుతాడు. ఈస్థితిలో మీరు కొంచెం కఠినంగానే ఉండాలి. జాలిపడ్డారో మీపని అయి పోయిందన్నమాటే. ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తాడు, నోట మాట రాదు, కంటి నుండి నీరు కారి పోతూంటుంది. నువ్వు ఇంత పని చేసావా అన్నట్టు చూస్తాడు. పేగుల్లో శివతాండవం, మెదడులో కదాకళి జరిగిపోతూంటుంది. ఈస్థితిలో వీలైతే వారిని బెడ్ రూములోనికి నెట్టి తలుపు గడియ పెట్టేయండి. వచ్చి టివి సౌండు బాగా పెంచేయండి. బెడ్ రూములో ఆయన వింత వింత శబ్దాలు చేస్తుంటాడు. డోంట్ వర్రీ. రెండు మూడు గంటల తరువాత బెడ్ రూము తలుపు తెరవండి. గురుడు అప్పటికి కొంచెం స్థిమితపడ్డట్టు కనిపిస్తాడు. మాట పలుకుతుంది.. బహుశా “ఇంక నీవు వంట చెయ్యవద్దు డియర్” అంటాడు. రెండు మూడు రోజులు గురుడు అదోలా ఉంటాడు. మత్తుగా నీరసంగా ఉంటాడు. తిండి సరిగా తినడు. మరేం ఫర్వాలేదు.  నాలుగో రోజుకి  కొంచెం తేరు కుంటాడు. కాని తలుచు కొన్నప్పుడల్లా కడుపులో తిప్పేస్తుంది. అప్పటినించి మీరు వంట చేస్తానంటే బెదురుతాడు. తనే వంట చేస్తాడు. లేకపోతే హొటలు నించో, ఏదైనా మెస్ నుంచో కేరియరు తెప్పిస్తాడు. వంట చేస్తానని బెదిరిస్తే చాలు మీకు కావల్సినవన్నీ నిముషాలమీద తెచ్చి పడేస్తాడు. మీరు హాయిగా “మీర జాల గలడా నాయానతి సతీ ద్రౌపదీ పాక మహిమన్” అని పాడు కుంటూ పొద్దుటి నించి రాత్రిదాకా టివి చూస్తూ ఏడుస్తూ, ముక్కు చీదుకుంటూ కాలం గడిపేయవచ్చు.

అస్త్రశస్త్రాలు తయారు చేసే విధానాలు, ఏది ఎప్పుడు ఎల్లాగ ప్రయోగించాలో మొదలైన వివరాలన్నీ “వంటలూ- వాంతులు” అనే నాపుస్తకంలో వ్రాసాను. చదివి ప్రయోగించండి. ఈపుస్తకం ప్రచురించిన తరువాత, అఖిల భారతీయ పూటకూళ్ళ సంఘం, హొటలువాళ్ళు, కేటరింగువాళ్ళు అంతాకలసి నాకు ఘనసన్మానం చేసారు. మగాళ్ళమీద అంకాళమ్మ లాగ విరుచుకు పడిపోతానని “అంకాళమ్మ” అనే బిరుదు కూడా ఇచ్చారు. అడ్డ గాడిద లందరికి, అడ్డగోలు యూనివర్సిటీలు డాక్టరేటులు ఇచ్చేస్తుంటే తప్పేంటి అంటూ నాకూ ఓ డాక్టరేటు ఇచ్చేసారు. ఈపుస్తకం బహుళ ప్రాచుర్యం పొందితే ఇంక ఏ పడతీ ఇంటిలో వంట చేయదు కాబట్టి మాదే సామ్రాజ్యం అని వాళ్ళంతా మురిసిపోతున్నారు. వాళ్ళే నా పుస్తకం ఫ్రీగా ఇస్తున్నారు. తెచ్చుకోండి. బానిస బతుకు నించి విముక్తులు కండి. జయ జయ అంకాళమ్మా అని నాకు జేజేలు పలకండి.

                             సర్వే భర్తాః దుఃఖినో భవంతు

                             సర్వే భార్యాః సుఖినో భవంతు

ముందుమాట చివర వ్రాస్తున్నాను. సుమారు పాతికా ముఫ్ఫై ఏళ్ళ క్రితం గౌహతి నించి హౌరా, రైలులో వెళుతూ బంగాయ్ గాం స్టేషనులో దోశల పేకట్టు కొన్నాను. అవి ఒకటిన్నర పేజీల తెలుగు పత్రిక లో కట్టాడు. దోసలు తిన్నతర్వాత జాగ్రత్తగా చట్నీ, నూనె మరకలు తుడిచి ఆ కాగితం చదివాను. హౌరా చేరేలోపు కనీసం ఒక అరడజను మార్లు చదివాననుకుంటాను. నవ్వు ఆపుకోవడం చాలా కష్టం అయింది. పక్కన కూర్చున్న వాళ్ళు నాకేసి వింతగా చూసారు. ఆ రచన ఎవరు వ్రాసారో తెలియలేదు. పూర్తి కధ చదవలేదు. ఆతర్వాత దానికోసం ప్రయత్నించాను కాని దొరకలేదు. ఆ పత్రిక ఏదో గుర్తు లేదు. నాల్గేళ్ళక్రితం  నేను తెల్గులో వ్రాసిన మొదటి రచన ఇది. ఈ నా రచన ఆరోజు నేను చదివిన కదకు అనుకరణ. ఆకధకు దీనికి పోలికలు ఉండవచ్చు.  ఆ తర్వాత దీన్ని రెండు మాట్లు తిరగ వ్రాసాను.  ఐనా చదివిన ఆ రచన, పోలికలు,  వాసన పోలేదు అనుకుంటాను.
 మొదటి రచన మీద మమకారంతో, నాకు పేరు కూడా తెలియని ఆ రచయితకు క్షమార్పణలు చెపుతూ ఇక్కడ ఇది అతికించడానికి సాహసిస్తున్నాను. ఇది చదివి ఎవరైనా బాగుందని అభిప్రాయ పడితే అది ఆయనకే చెందుతుంది.