బులుసు సుబ్రహ్మణ్యం కధల అచ్చు పుస్తకం


నాలుగు  రోజుల క్రితం ప్రింటర్ దగ్గర నుంచి  “బులుసు సుబ్రహ్మణ్యం కధలు”  ప్రింటెడ్  పుస్తకాలు తెచ్చాను. 
నా బ్లాగు “నవ్వితే నవ్వండి” లో వ్రాసిన   29 కధలు ఉన్నాయి ఈ పుస్తకం లో.

ఈ పుస్తకం  ప్రివ్యూ,  కవర్ పేజితో సహా కినెగే లో 


http://kinige.com/book/Bulusu+Subrahmanyam+Kathalu   లో  చూడవచ్చు.  

కినిగే లో eబుక్  వచ్చేసింది ఆరు   రోజుల క్రితం. అచ్చు పుస్తకం, eబుక్ కూడా పైన ఇచ్చిన లింక్ లో కొనుక్కోవచ్చు.  

కినెగే లో కొనుక్కోవడం వీలుకాని వారు ప్రింటెడ్ బుక్స్ కొరకు నన్ను  ఈ కింది చిరునామాలో సంప్రదించవచ్చును.

B. SUBRAHMANYAM,
Plot No. 139, Road No. 7,
South End Park, Mansurabad,
L. B. Nagar,  HYDERABAD – 500 068.

Cell. – 9963127723, Telephone. – 040 24124494.


206 పేజీల పుస్తకం వెల Rs. 150/ మాత్రమే.
(ఇండియాలో పోస్టేజి ఫ్రీ, రిజిస్టర్డ్ పార్సెల్ ద్వారా)

మనియార్డర్ ద్వారా కానీ, DD (on ICICI, or SBI,  L.B.Nagar, Hyderabad, Branches)  ద్వారా కానీ, నెట్ బేంకింగ్ ద్వారా కానీ డబ్బు పంపి,  పుస్తకములు పొందవచ్చును.
 
మీరంతా కొని, చదివి, ఆనందించాలని కోరుకుంటున్నాను. మీరే కాదు, మీ బంధు మిత్రుల చేత కూడా కొనిపించి
వారిని కూడా ఆనందింప జేసి, నన్ను ధన్యుడిని చేయాలని  మనవి చేసుకుంటున్నాను.......దహా.

బులుసు సుబ్రహ్మణ్యం కధలు, eబుక్


నా పుస్తకం "బులుసు సుబ్రహ్మణ్యం కధలు"  eబుక్ కినిగె ద్వారా నిన్న  విడుదల అయింది. పుస్తకం ప్రివ్యూ



ప్రముఖ బ్లాగరు ఆలమూరు సౌమ్యగారు నా పుస్తకానికి  తొలిపలుకులు వ్రాసారు. వారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

నా కధలు పుస్తక రూపంలో రావడానికి చాలామంది సహాయం చేసారు. సాంకేతిక సహాయం కొందరు, మాట సహాయం కొందరు, ప్రూఫ్ రీడింగ్ లో కొందరు నావెంట ఉండి నన్ను నడిపించారు. వారందరికి ధన్యవాదాలు. 

కొన్ని కొన్ని బలహీన క్షణాల్లో ఒక్క మాట ఉత్సాహం నింపుతుంది. అటువంటి క్షణాలు కొన్నిటిని అధిగమించటానికి మిత్రులు సహకరించారు.

బ్లాగ్మిత్రులు, శ్రీ పంతుల గోపాలకృష్ణ, శ్రీమతి సుధారాణి, శ్రీ వేణు శ్రీకాంత్ దార్ల , శ్రీ రహ్మానుద్దిన్ షేక్ , శ్రీ అనిల్ అట్లూరి, శ్రీ బుద్ధ మురళి, మిత్రులు, జోర్హాట్లో నా సహద్యోగి డా. యస్. కొండలరావు, మిత్రులు శ్రీ బి. సూర్యనారాయణ మూర్తి,  గార్లకు బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.  

బ్లాగులో పరిచయమైన మా చిన్నమ్మాయి (ఈమె పేరు నాకు ఇప్పటికీ తెలియదు...దహా.), నా బ్లాగు పయనంలో నన్ను ఆదరించి, అభిమానించి, ప్రోత్సహించిన అనేక మంది పాఠకులకు, మిత్రులకు ధన్యవాదాలు.

నేను తెలుగులో వ్రాయగలను అనే నమ్మకం కలిగించి, నా చేత మొదట కధ వ్రాయించిన, సౌత్ ఎండ్ పార్క్ మిత్రులు శ్రీ యస్.వి.యం.శాస్త్రి గారికి, శ్రీ యం.వి.సుబ్బారావు గారికి బ్లాగ్ముఖంగా  ధన్యవాదాలు.

ఒక పుస్తకం ప్రచురించడానికి రచయిత ముఖ్యమైనా,  అతని వెనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా నిలబడే వారు చాలా మంది ఉంటారని ఈ నా ప్రయత్నంలో మరోమారు అర్ధం అయింది.

ప్రింట్ పుస్తకం ఇంకో పది రోజుల్లో వస్తుంది అని అనుకుంటున్నాను. రాగానే బ్లాగులో తెలియచేస్తాను.

ప్రింటర్,  "చరిత ఇంప్రెషన్స్,"  అజామాబాద్, హైదరాబాదు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ eబుక్ కి వారు ఇచ్చిన పి.డి.యఫ్. ఫైల్స్ ఉపయోగించాను.

ప్రింటెడ్ బుక్ ధర Rs.150/ గా నిర్ణయించాం.                  

కినిగె వారి ధర Rs.135/ మాత్రమే. 

నా  పుస్తకం eబుక్ గా ప్రచురించిన కినేగె వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

పాఠకులందరూ చదివి, వారి అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. 

అభిప్రాయాలు, పుస్తకం రేటింగ్ కినిగె లో (పై లింక్) తెలియ జేస్తే సంతోషిస్తాను. 

మీ అభిప్రాయాలు నాకు అమూల్యం, నన్ను, నా పుస్తకాన్ని మెరుగు పరుచుకోడానికి ఎంతో సహాయం చేస్తాయి.  

బులుసు సుబ్రహ్మణ్యం కధలు


ఏదైనా స్వానుభవం అయితే కానీ లోతు తెలియదు అంటారు. నిజమే ముమ్మాటికి నిజమే అనిపించింది. పుస్తకం ప్రచురించాలంటే ఉత్సాహమే కాదు,  భాష మీద పట్టు, అంతో కొంతో వ్యాకరణ జ్ఞానం, వీటికి తోడు శ్రద్ధ, ఓపిక కూడా పుష్కలంగా ఉండాలని కూడా తెలుసుకున్నాను. అన్నిటికన్నా తెలుగు మాష్టారికి తప్పులు వెతకడంలో ఉండే సునిశిత దృష్టిలో పదో వంతైనా కనీసం ఉండాలి, అని కూడా అర్ధం అయింది. మిత్రులు సహకరించారు. సూచనలు చేశారు. కొన్ని పాటించాను. కొన్ని మరిచిపోయాను. కొన్నిటికి అశ్రద్ద చేశాను.  నాలుగు  కాపీలు కరక్షన్స్ చేశాను. అయినా వ్యాకరణ,  అక్కడక్కడ  భాషా దోషాలు ఉన్నాయేమో నని అనుమానం. అనుమానమేమిటి ఉండే యుంటాయని నమ్మకమే. వ్యాకరణం ముఖ్యంగా సంధులు గట్రా నేర్చుకొని పదాలకి ముడి పెట్టేద్దామనుకున్నాను. కానీ ఒక్క పుస్తకానికి ఇంత కష్టపడాలా, వద్దులే  అని విరమించుకున్నాను.  అన్నట్టు అక్షయపాత్ర అంటే ఏమిటో కూడా తెలిసి వచ్చింది. అదేమిటో,  వెతికిన కొద్దీ తప్పులు దొరుకుతూనే యున్నాయి.  కానీ ఇవేవి కదాగమనానికి గానీ, హాస్యానికి గానీ అడ్డు రావనే అనుకుంటున్నాను. ఈ లోపాలు సవరించి ఉండాల్సింది కానీ ఓపిక సన్నగిల్లింది. ఆలస్యం అవుతోందనే  అనే అంశం తొందరపెట్టింది.  చివరికి విసుగొచ్చి ఇంక ఎవరికీ చూపించను, ఇదే ఫైనల్, అంతే అని నిర్ణయించుకున్నాను. ప్రింటండి అని ప్రింటర్ కి చెప్పేశాను.   

బ్లాగుల్లో వ్రాసేటప్పుడు వీటి మీద శ్రద్ధ పెట్టలేదు. అయినా పాఠకులు చదివారు, ఆదరించారు. శా యా, సా యా, ఉండు అని యుండాలా, యుండు అని ఉండాలా, లాంటి సందేహాలతో ఒక మిత్రుడిని విసిగించాను కూడా. విసిగి, వేసారి ఆ మిత్రుడు బ్రహ్మోపదేశం చేశాడు.  “వత్సా,  పాఠకుడికి  నవ్వు వచ్చిందా నవ్వుకుంటాడు, నవ్వుకి వ్యాకరణ, భాషా  దోషాలు ఉండవు. ఇందులో దోషం ఉంది కాబట్టి నవ్వను అని భీష్మించుకోడు. నవ్వు రాలేదా, దోషాలు చూసి నవ్వి పోతాడు. ఎలాగైనా విజయం నీదే”  కళ్ళు తెరుచుకున్నాయి. కదా అని ఆనందపడ్డాను. అయినా పంటి కింద రాయిలా ఏ దోషమైనా కష్టపెడితే  క్షమించమని పాఠకులను వేడుకుంటున్నాను.


(నిజం చెప్పాలంటే తెలుగులో రచనలు  (హాస్యం అయినా సరే) చేసే అర్హత నాకు ఉందా? తగుదునమ్మా అంటూ వ్రాసిన వాటిని పబ్లిష్ చేయడం భావ్యమా అని కూడా రెండు మూడు మాట్లు అనుకున్నాను. ఇది నా మనసులో మాట. ఎవరితోనూ అనకండి ప్లీజ్.) 
    
పుస్తకం అమ్మకానికి పెట్టకూడదనే మొదట్లో అనుకున్నాను. ఒక రెండు – మూడు  వందలు కాపీలు వేయించి బంధు మిత్రులకి పంపిద్దామని అనుకున్నాను. ఒక 35 కధలు ఎంచుకున్నాను. మొత్తం 250 పేజీలకు చేరింది. ప్రింటరు చెప్పిన ధర 250 కాపీలకు నన్ను ఆలోచింపచేసింది. అనుకున్న దానికన్నా ఎక్కువ, చాలా ఎక్కువ కావడంతో మానేద్దామా అని కూడా అనుకున్నాను. ఆరు కధలు తీసేసి  208  పేజీలకు కుదించాను. ఆర్టిస్ట్ ఖర్చులు మిగిల్చి కవర్ పేజీ మీద నా ఫోటో పెట్టి (పాఠకులు భయపడినా సరే అని ధైర్యం చేసి),   ఆ విధంగా ముందుకు పోదామని ఆలోచన చేశాను. 300 కాపీలకి నేను అనుకున్న బడ్జెట్ దరిదాపులకు వచ్చింది.  ఇంకో రెండు మూడు వేలు అటైనా ఫరవాలేదు అని ధైర్యం చేశాను.

ఈ లోపున కొంతమంది మిత్రులు అన్నారు  “మీ బంధు, మిత్రగణంలో లేనివారు పుస్తకం కావాలంటే కాపీలు ఉంటాయా?” అని. “ఒక 75 - 100 కాపీలు ఉంటాయేమో” అని జవాబు ఇచ్చాను. “అంతకన్నా ఎక్కువ మంది కావాలంటే?” అని కొచ్చెను మార్కు కూడా పెట్టారు. నేను నవ్వేశాను. ఘట్టిగానే నవ్వాను. “మనకంత సీను లేదు. మిగిలిన పుస్తకాలు ఆటక మీదే ఉంటాయి” అని ఇంకో మాటు నవ్వాను, ఇంకా ఘట్టిగా.  “ఏమో దురదృష్టం కమ్ముకొచ్చిన పాఠకులు అడగవచ్చు గదా”  అని లేనిపోని సందేహాలు నా మనస్సులో కలిగించారు. కనీసం ఇంకో రెండు వందల పుస్తకాలు వేయించండి. ధర కూడా తగ్గుతుంది గదా. ఒక eబుక్ కూడా తీసుకు రండి. మీకు ఖర్చు తగ్గుతుంది. కావాలనుకున్న పాఠకులకు పుస్తకం దొరుకుతుంది” అని ఉత్సాహం కలుగజేశారు. “ఏ పుట్టలో ఏ పాముంటుందో, ఏ సలహాలో ఏ ఔచిత్యముంటుందో, ఎవరికెరుక” అనుకొని ఇంకా బాగా ధైర్యం చేసి, తెగించి ఐదువందల కాపీలు వేయిద్దామని నిర్ణయించాను. 

eబుక్  గురించి ఆలోచిస్తున్నాను. కినిగె వారిని సంప్రదించాను. “ ప్రింటర్ ఇచ్చిన పిడిఎఫ్  కాపీ, కవరు పేజీ, రెండూ  మాకు పంపండి. మేము పరిశీలించి నిర్ణయం తీసుకుంటాము” అన్నారు. బహుశా ఇంకో రెండు మూడు రోజుల్లో వారికి అవి పంపి, వారి నిర్ణయం కోసం చూస్తాను. 

ఒక వేళ ఏదీ కుదరక పొతే, ఏం చెయ్యాలో ప్రణాళిక కూడా వేసుకున్నాను. ఇంకొన్ని రోజుల్లో పుస్తక ప్రదర్శనల సీజను మొదలవుతుంది కదా, ప్రదర్శన బయట పాతిక పుస్తకాలు నెత్తిమీద పెట్టుకుని “కధల పుస్తకం బాబూ కధల పుస్తకం, నవ్వుకుందామనుకున్నా, నవ్వి పోదామనుకున్నా, సరసమైన ధరకు  అమోఘ అవకాశం” అని అరుస్తూ అమ్మటానికి ప్రయత్నిస్తాను. 
 
అన్నట్టు పుస్తకం పేరు  “బులుసు సుబ్రహ్మణ్యం కధలు”.   
    
ఈ నెల రెండవ వారంలో ప్రింటరు పుస్తకాలు ఇస్తారు అని అనుకుంటున్నాను. వచ్చిన తరువాత మిగిలిన వివరాలతో  ఇంకో టపా వేస్తాను.

పుస్తకం వేస్తానన్నారు కదా ఏం చేశారు? అని ఒకరిద్దరు అడిగారు. అందుకని ఈ టపా ఇప్పుడు.

అదీ సంగతి.