నా జీవిత చరిత్ర - తొలిపలుకులు చదివిన తరువాత సహృదయులైన ముగ్గురు మిత్రులు తొలి పలుకులు వ్రాసి ఇస్తామని ముందుకు వచ్చారు. వీటిని మొదటి తొలి పలుకులు, మధ్య తొలి పలుకులు మరియూ తుది తొలి పలుకులు గా పెట్టేద్దామని నిర్ణయించుకున్నాను. ఇన్ని తొలి పలుకులు ఉన్న ఆత్మకధ పుస్తకం బహుశా నాదే మొదటిదనుకుంటాను. శిష్యులు కొంతమంది తొలి పలుకులకు అనుబంధం గా నా గురించి వారి వారి అభిప్రాయాలు ఒక చిన్న నవలా రూపం లో ఇస్తామని ఉత్సాహ పడుతున్నారు. పెద్దపుస్తకానికి చిన్న పుస్తకం ఉచితం, స్కీము కూడా తయారయి పోయింది. ఇక ఆలస్యం చేయకుండా నేను వ్రాయడమే మిగిలింది. మొదటి పర్వం లో నా బాల్యం గురించి అంటే పుట్టినప్పటినించి నాకు పది ఏళ్ళ వయసు దాకా, వ్రాద్దామని మొదలు పెట్టాను.
పుట్టినప్పటినుంచి కూడా పనీ పాడు లేకుండా ఉండడం నాకు అలవాటుట. రెండేళ్ళ దాకా పనీపాడు లేకుండా ఏడ్చేవాడినట. పనీ పాడు ఉన్నవాళ్ళు పనులు మానుకొని నన్ను ఊరుకోబెట్టేవారుట. రెండేళ్ల నుంచి నడక బాగా అలవాటు అయి అటూ ఇటు తిరుగుతూ అల్లరి చేస్తుంటే పని ఉన్నవాళ్ళు పని పాడుచేసుకొని నాతోటి ఆడుకొనేవారుట. ఇంకో ఏడాది గడిచేటప్పటికి నాలోని జ్ఞానజ్యోతి ప్రకాశించడం మొదలు పెట్టిందిట. ఇంట్లో గ్లాసులు, గరిటెలు, చెంచాలు మొదలైనవి వీధిలోకి విసిరేస్తే అవి మళ్ళీ ఎలా ఇంట్లోకి వచ్చేవో పరిశోధించే వాడినట. ఇంకొంచెం పెరిగేటప్పటికి బొమ్మలు అవి విరగకొట్టి వాటిలో ఏమున్నాయో తెలుసుకొనే ప్రయత్నాలు చేసేవాడినట.
ఇల్లాగే ఇంకొంత కాలం గడిచేటప్పటికి మా నాన్నగారు కంగారు పడి, పనీ పాడు లేకుండా ఉంటే వీడి జ్ఞానపిపాస భయంకరం గా తయారవుతుందని భీతి చెందినవారై, 4 ఏళ్ల వయసులో ఓ పలకా బలపం చేతికి ఇచ్చి, తీసుకెళ్లి స్కూల్లో వేశారుట. అప్పటికే అక్కడ ఉన్న జ్ఞాను లతో కలసి నేను కూడా మా మాష్టారుకి జ్ఞానబోధ చేసేవాడినట. అ, ఆ లు అనేక కొత్త రకాలు గా వ్రాసి ఆయన కంట నీరు తెప్పించేవాడినట. పలక మీద దిద్దించి, పలక విరిగినప్పుడు లేక బలపం నేను ఫలహారం చేసినప్పుడు ఇసుకలో దిద్దిస్తూ, రెండు నెలల ప్రయత్నం తరువాత ఓ రోజు సాయంకాలం వీరేశం మాష్టారు మా నాన్నగారిని కలిశారుట.
శాస్త్రిగారూ మీ అబ్బాయి ఏ పికాసో యో అయే సూచనలు కనిపిస్తున్నాయి. సందేహం లేదు అని మొఱ పెట్టుకున్నారట.
మా నాన్నగారు తీవ్రంగా ఆలోచించి దీర్ఘం గా నిట్టూర్చి
వీరేశం మాష్టారు గారూ వీడిని రవివర్మ లా మార్చే గురుతర బాధ్యత మీ మీదే పెడుతున్నాను. అవసరం అనుకుంటే పేకా వారి అమ్మాయితో పెళ్లి జరిపిస్తుండండి. అని అనుమతి ఇచ్చేశారు.
అప్పుడే పెళ్ళా, నాల్గైదు క్లాసులకి రానీయండి అని అభ్యంతరం చెప్పిందిట మా అమ్మగారు.
అమ్మాయీ, వీడు నాల్గైదు క్లాసులకి రావాలంటే ఇప్పటినుంచి అప్పుడప్పుడు పెళ్లి తప్పదమ్మా అన్నారుట వీరేశం మాష్టారు.
తప్పక మా అమ్మగారు కూడా అంగీకరించారుట.
రెట్టించిన ఉత్సాహంతో మా మాష్టారు , నా చెవులు మెలేస్తూ, వీపు మీద తబలా, మృదంగం వాయిస్తూ, అవసరం అనుకున్నప్పుడు భయంకరం గా ఆఫ్రికా డ్రమ్ములు కూడా వాయిస్తూ అ ఆ లు అంకెలు అవీ నేర్పేశారుట. అంకెల్లో నేను ఒకట్లు, రెళ్ళు ఎక్కువుగా ఉపయోగించేవాడినట. మేష్టారూ ఒకటికి, మేష్టారూ రెంటికి అంటూ క్లాసులోంచి పరిగెత్తేవాడినట.
ఇల్లా నేను ఒకటో క్లాసు వెలగబెడుతున్నానని విని మా బాబయ్య గారు ఆనంద భరితుడై మా ఇంటికి వచ్చినప్పుడు, అల, తల, వల, పలక ల బొమ్మల పుస్తకం నాకు బహుమతి గా తెచ్చారుట. బహుమతి ఇచ్చిన బాబయ్య ఊరుకోకుండా అందులో బొమ్మలు చూపించి ఇదేమిటిరా బుజ్జీ అంటూ విసిగించేవాడు. నాకు చిరాకేసి చెప్పాను బాబయ్యతో.
బాబయ్యా ఇది నాకు నువ్వు నేను చదువుకోడానికి ఇచ్చావు. నువ్వు చదువకూడదు అని.
అయినా వినిపించుకోకుండా మొట్టికాయలు, తొడపాశాలు కూడా బహుమతి ఇచ్చి అవి అన్నీ నాచేత పలికించాడు. మా బాబయ్య వెళ్ళింతరువాత మా అక్కయ్యలు కూడా ప్రయత్నించేవారు. అప్పుడే నా జ్ఞానచక్షువులు విచ్చుకున్నాయి. పుస్తకం లోని పేజీలు పడవలై అల,వల,తలలు నీటిలో కొట్టుకుపోయాయి. ఆ తరువాత నా వీపు మీద విమానాలు ఎగిరాయి.
మా మాష్టారు చేతులు లావుగా వాయడం వల్లనూ, నలుగురైదుగురు పేకా వారమ్మాయిలు నా శరీరం మీద భరత నాట్యం చేయడం వల్లనూ ఒకటి రెండు క్లాసులు గట్టెక్కించేసాను.
పాపం మా పితాశ్రీ గారు పుస్తకాలు కొనడం, అట్టలు వేయడం, దబ్బనం తో లావుపాటి దారం తో వాటిని కుట్టి, నేను పేజీలు చింపడం క్లిష్టతరం చేసేవారు. కానీ హనుమంతుని ముందా కుప్పిగంతులు. నాలుగు నెలలయ్యేటప్పటికి మళ్ళీ పుస్తకాలు కొనడం, అట్టలు వెయ్యడం కుట్టడం వంటి నాలుగు నెలల ప్రణాళికలు మా నాన్న గారు చేసుకునేవారు.
ఈ విధం గా నేను పుస్తకాలు చింపడం లో కొత్త మార్గాలు కనిపెడుతూ, పక్కవాళ్ళ పుస్తకాల్లోంచి తీసివేతలు చేస్తూ, మా స్కూలు ఎదురుగా ఉన్న చెరువులో పడవల కూడికలు వేస్తూ, మాష్టారు కొట్టిన దెబ్బలని నాన్న గారు తిట్టిన తిట్లతో బాగహారం చేస్తూ;
ముక్కులోని ద్రవం ఎప్పుడూ కిందకే వెళ్ళుతుందన్న న్యూటన్ గారి సిద్ధాంతం తో బాటు, చింతా మాష్టారి చింత బరిక కన్నా రాయప్రోలు వారి వెదురు బద్ద వీపు మీద ఎందుకు ఎక్కువ మంట పుట్టిస్తుందో అర్ధం చేసుకొనే ప్రయత్నం చేస్తూ;
అశోకుడు నాటించిన చెట్ల వల్ల ఎంతమందికి ఎన్ని పళ్ళు దొరికాయో తెలియకపోయినా, హరి వారి ఇంట్లో జామచెట్టు కన్నా మల్లాది వారి ఇంట్లో బాదం చెట్టుకు ఎన్ని రాళ్ళు ఎక్కువ కావాలో లెఖ్ఖబెట్టుకుంటూ;
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం వల్ల రాత్రులు పగలు వస్తాయని తెలుసుకున్న తరువాత, ఇంటికొచ్చిన చుట్టం చుట్టూ ఎన్ని మాట్లు తిరిగితే ఎన్ని కానులు రాలుతాయని అంచనా వేసుకుంటూ;
ప్రైమరీ స్కూలులో చదువు పూర్తి చేసేశాను.
అప్పుడు మా నాన్నగారు నా చదువు గురించి పునరాలోచనలో పడ్డారు. ప్రైమరీ స్కూలు చదువుకే అరఎకరం ఖర్చయితే ఎలా అని విచారించారు. విచారించి లాభం లేదు, వీడికి పుస్తకాల అవసరం లేకుండా, మెళ్ళో ఓ దారం పోగు వేసి వేదాధ్యయనం చేయడానికి మా తండ్రిగారి గురువు గారి దగ్గరికి పంపుదామని నిర్ణయించుకున్నారు.
ఈ కఠోర నిర్ణయం విన్నతరువాత మా అమ్మగారు నిరసన తెలియచేసారు. ఆ తరువాత తీవ్రం గా వ్యతిరేకించారు.
మన వంశం లో వేదాలు చదివిన ఘనాపాటి ఒక్కడైనా ఉండాలని మా నాన్నగారు పట్టుబట్టారు.
మా అమ్మగారు మహాత్మా గాంధీ గారి అడుగు జాడల్లో సత్యాగ్రహం చేశారు.
వేదాలు చదివి మీరేం ఉద్ధరించారు. ఉన్న ఆస్థి కరగపెట్టడం తప్ప. వీడు ఇంగ్లీష్ చదువులు చదవాల్సిందే అని నాలుగు రోజులు అభోజనం ఉన్నారు.
మా మేనమామలు, మా మాతా మహులు కూడా రంగంలోకి దిగారు. ( మా పితామహులు అప్పటికే కాలం చేశారు). మా నాన్న గారు పని చేస్తున్న స్కూలు లోని తోటి మాష్టార్లని కూడా రంగం లోకి దింపి మా తాత గారు మా నాన్నగారిని ఒప్పించి తమ పుత్రికా రత్నం అభీష్టం నెరవేరడానికి సహకరించారు.
సరిగ్గా ఇక్కడకు వచ్చిన తరువాత కలం అటకాయించింది. నాకు గుర్తు ఉన్నంతవరకు కాకపోయినా, నేను మా ఇంట్లో నా గురించి మా పెద్దలు మాట్లాడుకోగా విన్నది అంతా వ్రాసాను. కానీ నా బాల్యం ఇంతేనా అని అనుమానం వచ్చింది. నేనేమీ ఘనకార్యాలు చేయలేదా? అనే సందేహం వచ్చింది. ఏ ఆత్మ కధ చదివినా పూవు పుట్టగానే పరిమళిస్తుంది అన్న విధం గా చిన్నప్పుడే అనేక ఘన కార్యాలు చేశామని వ్రాసుకుంటారు. ఘనకార్యాలు లేకపోతే నా ఆత్మకధ చిన్నబుచ్చుకుంటుంది .
ఆఖరికి బ్లాగుల్లోనూ, బజ్జుల్లోనూ, + ల్లోనూ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఒకటవ ఏడు రాకుండానే పరిగెత్తేశాను, పరుగు పందెంలో మొదటి బహుమతి వచ్చింది, అని చెప్పే వాళ్లని చూశాను. 3 వ ఏటే నేను భగవద్గీత కంఠతా పట్టేశాను అని ఒకరంటే 6వ. ఏట Gone with the wind చదివేశా, 7వ. ఏట Old man and the sea గురించి ఉపన్యాసాలు ఇచ్చాను అని ఇంకొకరు చెపుతున్నారు. ఇంకో ఆవిడ అయితే, ఇంకా నడక రాకుండానే భరత నాట్యం నేర్చుకోవడం మొదలు పెట్టేసిందట, 4వ ఏట ఆరంగేట్రం చేసి 6వ ఏట కల్లా ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించిదిట. ఒక భజగోవిందం గారు 4వ ఏటికల్లా గీత గోవిందం కంఠతా పట్టేసి గుళ్ళో పాడే వాడట. ఆవిడ ఎవరో 4 వ ఏట గోదారి గట్టున ఆల్చిప్పలు, శంఖాలు, గవ్వలు రకరకాలు రకరకాల రంగులవి, ఏరేసుకుంది ట. ఏరంగు వి ఎన్నో, ఏ ఆకారానివి ఎన్నో కూడా గుర్తు పెట్టేసుకుందిట.
మరి ఇదేమిటి నేను 6 వ ఏట కాకపోయినా 10 ఏళ్ల దాకా కూడా ఏమి చేయలేదా. 10 ఏళ్ల దాకా భోంచేసి బజ్జోడం తప్ప ఏమి లేదా నా జీవితం లో. ఒఖ్ఖటంటే ఒఖ్ఖ చెప్పుకోదగ్గ సంఘటన ఏమీ జరగలేదా? లేక నాకు గుర్తుకు రావటం లేదా. రింగులు రింగులు తెప్పించుకొని వాటిలో చూసినా, శూన్యం లోకి చూసి కడు దీర్ఘంగా నిట్టూర్చినా ఏమి గుర్తు రాలేదు. ఏంచెయ్యాలో తోచక శీర్షాసనం వేసి కూడా చింతించాను. అబ్బే ఫలితం లేకపోయింది. ఏమి ఈ వైపరీత్యము. నాకేల గుర్తు రాకుండే అని గ్రాంధికం లో కూడా విచారించాను.
చివరి ప్రయత్నంగా ఒక సుత్తి తీసుకొని నా నెత్తి మీద నేనే ఒకటి ఇచ్చుకున్నాను. అదేమిటో సుత్తి తో ఒకటుచ్చుకొంటె తప్ప నా బుఱ్ఱ లో దీపం వెలగదు. యధా శక్తి తధా బల్బు అన్న మాట. అంటే ప్రయోగించే ప్రహారాన్ని బట్టి 10 W నించి 100 W దాకా బల్బు వెలుగుతుంది. నేను మూడు ప్రయత్నాలు చేశాను. హాస్పిటలు కెళ్ళి కట్టు కట్టించుకోవడం తప్ప మరే ప్రయోజనం కలగలేదు. పదిరోజుల్లో రెండు మాట్లు వచ్చాడు కట్టు కట్టించుకుందుకు పాపం అని వైద్య శిఖామణి గారు జాలి పడ్డారు.
అప్పడాల కఱ్ఱ ఉపయోగించు విధి విధానములు నేర్చు కొనేందుకు మా అపార్టుమెంటు లేడీసు మా ఆవిడ దగ్గర క్యూ కట్టారు కానీ విషయం తెలిసి విచారించి వెళ్ళిపోయారు.
ఆపైన మా ఆవిడ సలహా తో మా సోదరీమణులను, సోదరుడిని అడిగాను నా బాల్యం గురించి వారికి ఏమైనా గుర్తుకొస్తే చెప్పమని. వారు కూడా తమ అశక్తత వెలిబుచ్చారు. తరచి తరచి అడగగా మా అగ్రజుడు దీర్ఘం గా నిట్టూర్చి,
ఏమోరా చిన్నప్పుడు నువ్వు మోకాళ్ళకిందకు చొక్కావేసుకొని ఓ చేత్తో తాళ్ళ లాగు పైకి లాక్కుంటూ, రెండో చేత్తో ముక్కు తుడుచుకుంటూ తిరుగుతున్న రూపమే గుర్తుకొస్తోంది తప్ప మరేమీ జ్ఞాపకం రావటం లేదు, అని అన్నాడు.
మా చిన్నతనం లో లాగులు అంటే నిక్కర్లు అలానే ఉండేవి. నో బొత్తామ్స్ ఆర్ నో జిప్స్ అన్నమాట. నిక్కరుకు నడుం దగ్గర రెండు వైపులా మూడు నాలుగు అంగుళాల తాళ్ళు ఉండేవి. కిందనించి నిక్కరు పైకి లాక్కొని రెండు తాళ్ళు వెనకాల కి ముడివేసేవారం. అది జారిపోకుండా మళ్ళీ మళ్ళీ బిగించడం, పైకి లాక్కోవడం ఇవన్నీ సాధారణంగా నే ఉండేవి ఆ కాలం లో. మోకాళ్ళ కిందకు కుట్టించిన చొక్కా పొట్టమీదకు వెళ్ళినా చిరిగేదికాదు. బలవంతాన చింపుకొని తన్నులు తినేవారం. కొత్త చొక్కా కుట్టించుకుంటే వేసుకున్న లాగు కనిపించేది కాదు.
అదేమిటో ఆకాలంలో 10 ఏళ్ళు వచ్చేదాకా అంతా కుఱ్ఱ కుంకల కిందే లెఖ్ఖ. స్వతంత్రంగా ఏమి చెయ్యనిచ్చేవారు కాదు. ఎండలో ఆడితే మొట్టికాయలు, మొండికేస్తే చెంప దెబ్బలు విరివిగా దొరికేవి. మా మనోభావాలు దెబ్బతింటాయేమో నని ఆలోచించేవారు కాదు. మనోభావాలు ఉంటాయని కూడా గుర్తించేవారు కాదు. ఎంతసేపు దొంగా పోలీసు, చెడుగుడు, గోటిబిళ్ళ, బచ్చాల ఆట, బొంగరాలు తప్పితే మరో ఆటకూడ ఉండేదికాదు. నీకేం కావాలి అని కూడా ఎవరూ ఎప్పుడూ అడిగిన గుర్తు లేదు. 10 ఏళ్ళు వచ్చేదాకా కూడా ఎప్పుడైనా సినిమా కెళ్ళితే ఆడ మలయాళం తోనే వెళ్లాల్సివచ్చేది. మగ పిల్లలం అని కూడా గుర్తించేవారు కాదు. దిస్సమొలల తో టింగురంగా అని కూడా తిరిగేసే వారం. నూతి దగ్గర గోచికూడా లేకుండా విశృంఖలంగా స్నానాలు చేసేసే వాళ్ళం. ఇవన్నీ గుర్తు వస్తున్నాయి కానీ చేసిన ఘనకార్యాలు ఏమి గుర్తు రావటం లేదు.
అయినా ఇల్లాంటివి ఆత్మ కధలో వ్రాసుకుంటే బాగుండదు కదా. అందుకని పైన వ్రాసింది మీరు చదవకండి. చదివితే నా ఆత్మ కధ మీద ఒట్టే. ఒకవేళ పొరపాటున చదివినా వెంటనే మరచిపొండి.
అందువల్ల ఓ నా ప్రియ పాఠకుల్లారా నా బాల్య అధ్యాయం ఇంతటితో ఇక్కడ ఆపేస్తున్నాను. మీరు నాకేమైనా సలహాలు ఇవ్వగలరా? మీ బాల్యం లో మీరేమైనా ఘనకార్యాలు చేస్తే నా చెవిలో చెప్పండి. మీ బాల్యకధలు చౌర్యం చేసి నేను వ్రాసేసుకుంటాను. లేకపోతే బాల్యం మరిచి పోయిన ప్రద్యుమ్నుడు అని మీరంతా వేళాకోళం చేసే అవకాశం ఉంది. ప్రతిఫలాపేక్ష లేకుండా, మీరు నా జీవిత కధ కొనసాగించడానికి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను.