నిన్న సాయంకాలం హౌరా స్టేషన్ కి
సుమారు ఐదు గంటలకి వచ్చాను. రాత్రి 8
గంటలకి బయల్దేరే మద్రాస్ మైల్ రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరును అని చింతిస్తూ చెప్పేడు
ఎంక్వయిరీ లో. ఓ ఏజంట్ ని వెతికి వాడు నమ్మకస్తుడే అని పక్కవాళ్ళ ద్వారా
నిర్ధారించుకొని, వాడికి టికెట్, రెండు వందలు ఇచ్చి, వెయిటింగ్ రూం లో సూట్కేస్,
ఎయర్ బాగ్ పెట్టి కుర్చీలో కూర్చున్నాను.
పక్క కుర్చీ లో కూర్చున్న ఓ ముఫై ఏళ్ల
ప్రయాణికుడు అడిగాడు.
ఎక్కడికి వెళుతున్నారు మాష్టారూ?
విజయవాడ వెళ్ళాలండి, రెండు గంటలు లేటుట మద్రాస్ మైల్.
అవునండి, నేనూ దానికే వెళ్ళాలి రాజమండ్రి దాకా. శలవు మీద వెళుతున్నారా?
అవునండి ఓ పదిహేను రోజులు.
ఇలాగే పిచ్చాపాటి ఓ అరగంట మాట్లాడాము. ఏజంట్ ఇంకా రాలేదు. చికాకుగా ఉంది. ఆకలిగా ఉంది.
చెమటలు కారిపోతున్నాయి. సరే స్నానం చేసి, పక్కనే ఉన్న AC రెస్టరెంట్ లో ఓ రెండు
గంటలు కూర్చుని వస్తే కొంచెం హాయిగా ఉంటుందేమో ననిపించింది. సంచి లోంచి తువాలు
తీసి, లాగు చొక్కా విప్పి, సంచిలో పెట్టి, లుంగి కట్టుకొని సబ్బు పెట్టె పట్టుకొని
పక్కాయనతో చెప్పాను.
మాష్టారూ సామాను కొంచెం చూస్తూ ఉండండి. ఏజంటు వస్తే ఉండమనండి.
అలాగే మీరు స్నానం చేసి రండి. నేను ఇక్కడే ఉంటాను.
స్నానం చేసి వచ్చాను. ఆయనా లేడు, నా సూట్కేస్, సంచి కూడా లేవు. నేను లబో దిబో మన్నాను. చుట్టూ జనాలు చేరారు.
సానుభూతి ప్రకటించారు, జాలిపడ్డారు. బుద్ధిలేదా అన్నారు. క్లోక్ రూం ఉన్నదెందుకు
అని కోప్పడ్డారు. ఈ కాలం పిల్లలకి బొత్తిగా లోక జ్ఞానం లేదన్నారు. అయినా అందరిని
అలా నమ్మేయడమేనా అని చివాట్లు పెట్టేరు.
నేనో తెలివి తక్కువ దద్దమ్మ నని తేల్చేసి,
ఎవరి సీట్లలోకి వాళ్ళు వెళ్ళిపోయారు.
ఓ పావుగంటలో నేను కొంచెం తేరుకున్నాను. ఏమి
చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను . ఇంతలో
ఏజంటు వచ్చాడు. నన్ను చూసి, కధ విని, జాలిపడి నాకు తోడుగా దుఃఖించి, టికెట్ నా చేతిలో పెట్టాడు. స్లీపర్ S6 లో
దొరికింది. నా కమిషన్ 75, క్లర్కు
గారికి వంద పోగా మిగిలిన
25 ఇంద అన్నాడు. నా కమిషన్ అసలు
వంద కానీ, మీ కధ కి జాలిపడి పాతిక
తగ్గించాను అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. ఇంకో పాతికేనా తగ్గించుకోమని నేను
ప్రాధేయపడ్డాను. డ్రామా చూస్తున్న చుట్టుపక్కల వాళ్ళు, పాపం ఇంకో పది రూపాయలేనా ఇయ్యి అని సలహా ఇచ్చారు. మీరందరూ చెబుతున్నారు
కాబట్టి ఇంకో ఐదు రూపాయలు ఇస్తాను అని ముఫై రూపాయలు ఇచ్చి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు.
చుట్టు పక్కల వాళ్ళు గప్చుప్ గా వెళ్ళిపోయారు వాళ్ళ నేమైనా అడుగుతానేమో నని భయం
కాబోలు. తువ్వాలు పరుచుకొని కూచుంటే ఓ
పదిరూపాయలు రాలకపోతాయా అని కూడా ఆలోచించాను. కానీ ధైర్యం చేయలేకపోయాను. ముష్టి
అడుక్కోవడానికి కూడా ధైర్యం ఉండాలి అని గ్రహించాను.
ముఫై రూపాయలతో హౌరా నుంచి విజయవాడ వెళ్లడం ఎలా అని ప్లాన్ చెయ్యడం మొదలు
పెట్టాను. మద్యాహ్నం తిన్న తిండి స్టేషన్ కి రాకుండానే అరిగిపోయింది.
ఇప్పుడు భోజనం, రేపు పొద్దున్న కాఫీ,
టిఫిన్, మద్యాహ్నం భోజనం, మళ్ళి కాఫీ టిఫిన్, సాయంకాలం 6-7 గంటలకి కానీ చేరదు విజయవాడ, పైగా రెండు గంటలు లేట్ ఇంకా ఎంత పెరుగుతుందో. అన్నిటికన్నా ముఖ్యం
సిగరెట్లు కదా.
ముందుగా ఒక రోజుకి సరిపడా మూడు సిగరెట్టు పాకెట్స్ కొనేశాను స్టేషన్ బయట. అప్పుడే
తెలిసింది కాలికి చెప్పులు కూడా లేవని. వేసుకున్న బూట్లు జాగ్రత్తగా సంచిలో పెట్టాను కదా మరి. స్టేషన్ బయట చవకగా చెప్పులు కొనేశాను. ప్రయాణం మొదలు కాకుండానే పదిహేను రూపాయలు ఖర్చు
అయిపోయాయి.
మెదడు లో మేధోమధనం జరుగుతుంటే
తలనొప్పి వచ్చింది. తెగించి ఓ బ్రెడ్
దానికి తోడుగా ఓ కాఫీ లాగించేసాను. డబ్బులు
లెఖ్ఖ పెట్టడం మానేయాలని, ఉన్నవి అయిపోయిన తరువాతే నిరాహార
దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాను. అప్పటికి 8–30
అయింది. ఇంకో గంట అటూ ఇటూ తిరుగుతూ , కొత్త చెప్పుల చేత కరిపించుకుంటూ, కాలక్షేపం చేసాను. ఆ తర్వాత రైలు ఎక్కి
కూర్చున్నాను. కింద బెర్త్. పై బెర్త్ వారికి ఈ
కింద బెర్త్ అమ్మివేద్దామా ఓ పది, పదిహేను
రూపాయలకు అని అనుకున్నాను కానీ ఎవరూ అడగలేదు. ఓ అరగంటలో అందరూ పడుకున్నారు.
పన్నెండున్నరకి ఖర్గపూర్ వచ్చింది. పాపం ఎవరో కుర్రాడు వెజ్ బిర్యాని
అమ్ముతున్నాడు. వాడు అరిచిన కొద్దీ నా ఆకలి పెరుగుతోంది. ఓ పదినిముషాలు పెరగనిచ్చి
కొనేశాను. తినేలోపులే బండి బయల్దేరింది. బలాసోర్ లో ఆగినప్పుడు దిగి మంచినీళ్ళు
తాగాను. అప్పుడే ఓ కుర్రాడు టీ సార్ అంటూ వెంటపడ్డాడు. సరే అని తాగాను.
తెల్లారకుండానే
ఏడు గంటలకల్లా లేపేశారు, తోటి ప్రయాణికులు. టీ కాఫీ అంటూ అరుస్తున్నారు
అమ్మేవాళ్ళు . తాగేశాను రెండు మాట్లు. సుమారు పది
గంటలకి పలాస చేరింది. ఓ బ్రెడ్ మరో
టీ లాగించేసాను. చివరగా రొంటిలో మిగిలింది ఏభై పైసల బిళ్ళ. శ్రీకాకుళం రాగానే
ఎలుకలు నిద్ర లేచాయి. విజయనగరం లో జాగింగ్ మొదలు పెట్టాయి. వైజాగ్ వచ్చేటప్పటికి
రన్నింగ్ రేస్ లో పాల్గొంటున్నాయి . వైజాగ్ ప్లాట్ఫారం మీద నా ప్రస్థుత పరిస్థితి అది.
శ్రీకాకుళం లో ఖాళీ అయిన 5 బెర్తులు వైజాగ్ లో నిండాయి. నేను నా
సీటు లో కూర్చోబోతోంటే ఒకాయన
“బాబూ
ఇది రిజర్వుడ్ కంపార్ట్మెంట్” అన్నాడు.
“నాకూ
తెలుసు ఆ కిటికీ సీటు నాదే” అన్నాను.
ఆయన నాకేసి అదోలా చూసాడు. నేనూ నన్ను ఒకమాటు
చూసుకున్నాను. రెండు రోజుల గడ్డం, మాసిన లుంగీ, నలుపులోకి మారుతున్న బనీను, భుజం
మీద ఒక తువాలు, రొంటిలో ఒక సిగరెట్టు
పాకెట్, అగ్గిపెట్టె. ఎవరేనా ఏమనుకుంటారు?
రాజనాల తమ్ముడు అని తప్ప. పాపం అదే అనుకున్నాడు
అని జాలిపడ్డాను. పెద్దాయన, భార్య, బహుశా కొడుకు, కోడలు, అమ్మాయి అని అనుకున్నాను . నేను
నా సీటు లో కూర్చోగానే అర్జంటుగా మగాళ్ళు నాపక్కకి
, ఆడవాళ్ళు ఎదుటి సీట్ల లోకి మారిపోయారు. వాళ్ళలో
వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను బయటకు చూస్తున్నాను. బండి బయల్దేరిన పది
నిముషాలకి అడిగాడు పెద్దాయన.
ఎక్కడికి వెళ్ళుతున్నావు?
విజయవాడ
ఎక్కడినుంచి వస్తున్నావు?
అప్రయత్నంగా నా నోటి నుంచి ఖర్గపూర్ అని వచ్చేసింది.
ఖర్గపూర్ లో ఏం చేస్తుంటావు?
ఒక్క క్షణం ఆలోచించాను. కూలీ నండి,
రైల్వే కూలీ నండి.
రైల్వే కూలీ వా?
అవునండి.
మీకు పాస్ ఉంటుందా?
ఉంటుందండీ (నిజంగా నాకూ తెలియదు)
రోజుకి ఏ మాత్రం సంపాదిస్తావు?
15 - 20 ఉంటుందండీ. అప్పుడప్పుడు ముఫై
దాకా వస్తుందండీ.
నెలకి ఓ ఐదారు వందలు వస్తుందన్నమాట
అవునండి
ఈ మాత్రం మీ ఉళ్ళో దొరకదా, ఇంత దూరం వెళ్ళాలా?
పొలం పనులుకి వెళ్ళితే రోజు కూలి ఇరవై
కన్నా ఎక్కువ ఇవ్వటం లేదండి. కొన్ని రోజులు పనులు దొరకవండి. పొలం పని చాలా కష్టం కదండీ. కామందు అసలు కూర్చోనివ్వడండి. ఈ పనిలో అంతా కలిపి ఓ రెండు
గంటల కన్నా పని ఉండదండి. ఈ ఉద్యోగమైనా మా
ఆడదాని మేనమామ అక్కడ ఉండడం వల్ల వచ్చింది.
నీకు పెళ్ళైందా? ( ఆశ్చర్యంతో కూడిన ప్రశ్న)
ఇద్దరు పిల్లలండి.
మీ ఆవిడ నీతోనే ఉంటుందా ఖర్గపూర్లో?
లేదండి, అది మా ఉళ్ళో ఉంటుందండీ. అది నాల్గు ఇళ్లలో పని చేస్తుందండి. అదీ ఓ
రెండు వందలు సంపాయిస్తుందండి.
నువ్వు ఇప్పుడు పెళ్ళాం దగ్గరికి వెళుతున్నావా?
అవునండి
సామాన్లు ఏమీ కనిపించటం లేదు.
సామాన్లు మా కెందుకండి? లుంగీ బనీను తో ఎక్కేస్తాం . ఇంటిలో బట్టలు ఉంటాయి
కదా.
పిల్లలకి ఏమైనా పట్టుకెళ్ళాలి కదా
అబ్బే, ఆళ్ళమ్మ కొనేస్తుందండి. మనం వెళ్లడం నాల్గురోజులుండడం, తిరిగి వచ్చేయడం. అంతేనండి.
ఇంక ఏం అడగాలో తెలియక ఆయన ఊరుకున్నాడు. పెద్దావిడ మొదలు పెట్టింది.
నీ వయసు ఎంత?
నేను 44 లోనో 45 లోనో పుట్టానుటండి. నాకు 25 నిండా యనుకుంటాను.
అప్పుడే ఇద్దరు పిల్లలా అని ఆశ్చర్యపోయింది కోడలు .
నాకు 19వ ఏట పెళ్ళైంది. 20 కి అబ్బాయి పుట్టాడు 22 కి అమ్మాయి పుట్టింది.
మీ ఆవిడ వయసు ఎంత?
పెద్ద తేడా లేదండి. నాకన్నా మూడు నాలుగు నెలలు చిన్నదండి మా ఆడది.
పంతొమ్మిది ఏళ్లకే పెళ్ళా అని మళ్ళీ ఆశ్చర్యపడింది కోడలు.
అప్పటికి మూడు నాలుగేళ్లగా నేను బలాదూరుగా
తిరుగుతుంటే, పెళ్ళైతే బాగుపడతానని చేసేసాడు మా బాబు.
బలాదూరుగా తిరగడమా ? ఏమీ
చదవలేదా?
అబ్బే చదువుకీ నాకు అసలు కుదరలేదండి. గొడ్లు కాయడమో చదువుకోవడమో ఒకటే
చేస్తానన్నానండి, మా బాబు తో. పసువుల్నే మేపమన్నాడండి. సంతకం పెట్టడం నేర్చుకున్నానండి.
22 ఏళ్ళకి ఇద్దరు పిల్లలు. ఆ తరువాత జాగ్రత్త పడ్డారా? పెద్దావిడ.
ఈ రెండేళ్ళ నుంచి దూరంగా ఉంటున్నాను కదండీ అని నవ్వాను.
ఇప్పుడు వెళుతున్నావు కదా. ఇంకొకరు వస్తారులే అన్నాడు పెద్దాయన.
మధ్యలో ఒక మాటు వచ్చి వెళ్ళానండి. ఇప్పుడు
మీ ఆశీర్వాదం వల్ల అలా జరిగితే మంచిదేనండి. మీపేరు పెట్టుకుంటాను.
ఆయన మాట్లాడలేదు. మొహం తిప్పుకున్నాడు. ఆవిడ కూడా కిటికీ లోంచి బయటకు చూడడం
మొదలు పెట్టింది. అమ్మాయి, కొడుకు, కోడలు
మాట్లాడుకుంటున్నారు. కధ ముదిరి పాకాన పడిందని అర్ధం అయింది కాబట్టి మాట కలపటానికి నేను సాహసించలేదు.
నేను విజయవాడ లో దిగి రాత్రి పదింటికి మా అక్కయ్య గారింటికి వెళ్లాను. రాత్రి కబుర్లు చెప్పుకొని, నిద్ర పొతే, తెల్లారి 9 గంటలకి మెలుకువ వచ్చింది. మా బావగారు
బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. మా అక్క చెప్పింది ఆయనకు,
“మేం పది గంటలకి వెళ్ళి వీడికి నాలుగు జతల బట్టలు అవీ కొనుక్కొస్తాము. మీరు
వెళ్ళి వాళ్లకి చెప్పండి, ఈ కారణం వల్ల
అనుకున్నట్టుగా పదకొండు గంటలకి రాలేము. మద్యాహ్నం మూడు గంటలకి వస్తాం. ప్రోగ్రాం
మారినందుకు సారీ చెప్పండి.”
అల్లాగే అంటూ ఆయన వెళ్లారు.
విజయవాడ వచ్చిన తరువాత తెలిసింది నాకు
పెళ్లి చూపులు ప్రోగ్రాం పెట్టారు ఆ వేళ. మా వాళ్ళు చూసి ఓకే
అనుకున్నారుట. ఇప్పుడు నేను
ఓకే అంటే అంతా ఓకే అన్నమాట. మూడు గంటలకి వాళ్ళ ఇంటికి
వెళ్ళాం నేను, అక్కా, బావా, మా మేనల్లుడు నాల్గేళ్ళ వాడి తో సహా.
వాళ్ళ గుమ్మం లో
అడుగు పెడుతుంటే అప్రయత్నంగా నా నోటి నుండి కేక లాంటి అరుపు వచ్చింది.
అక్కోయ్ రైల్లో నేను నిన్న కధ చెప్పింది వీరికేనే.
కోడలు “మీ ఆడదాన్ని, పిల్లల్ని తీసుకు రాలేదేం ”
నాకు అయోమయం గా ఉంది. అక్క కూడా
ఖంగారుగా చూస్తోంది.
ఈ లోపున పెద్దావిడ చెప్పింది
“మీ
బావగారు పొద్దున్న చెప్పారు మీ సామాను పోయిన సంగతి. మాటల సందర్భంలో మీరు రైల్లో అల్లిన కధ గురించి కూడా. ఆ కధ మాకే చెప్పారు
అని చెప్పాము. మా ప్రభావతి మీ బావగారిని
రిక్వెస్ట్ చేసింది, మీకు మా గురించి
చెప్పవద్దని, ఇక్కడకు రాగానే మీకు కూడా షాక్ తగలాలని.”
మా బావగారు నవ్వుతున్నారు. పెద్దాయన నవ్వుతూ ముందుకు వచ్చాడు.
ఆ తర్వాత ఏం జరింగింది అంటారా.
ప్రద్యుమ్న ప్రభావతీయం మొదలయింది.
నా మాట.... ఇదివరలో రైలు ప్రయాణం లో ఒక కధ అని ఒక టపా వ్రాసాను.
శ్రావ్య V గారు కామెంట్ లో రెండు సలహాలు
ఇచ్చారు. ఆ సలహాకి జవాబుగా ఈ కధ. శ్రావ్య
గారికి ధన్యవాదాలతో.
గమనిక:- ఈ టపా మొదటి మాటు 22/12/2012 న ఈ బ్లాగులో ప్రచురితమైనది.
గమనిక:- ఈ టపా మొదటి మాటు 22/12/2012 న ఈ బ్లాగులో ప్రచురితమైనది.