ప్రద్యుమ్నుడు - రామకుమారి

ప్రద్యుమ్నుడు చిన్నప్పటినుంచి కూడా నచ్చిన అమ్మాయినల్లా ప్రేమించేసేవాడు. హై స్కూల్ లో మంగ తాయారు, కృష్ణవేణి, భీమవరం కాలేజీ లో లీలావతి, యూనివర్సిటిలో అరుణ, ధనలక్ష్మి, కమల, కనకదుర్గ ఇత్యాదులు నెల కొకరి చొప్పున ప్రేమించాడు. కానీ ఎవరికీ చెప్పే సాహసం చెయ్యలేక పోయాడు. అయినా ప్రేమించడం మానలేదు.

పెళ్లి అయిన తరువాత ఇటువంటి ప్రేమలకు అడ్డుకట్ట వేసేసింది ప్రభావతి. “ నీవే తప్ప ఇతః పరం బెరుగ మన్నింపన్  దగున్ దీనునిన్” అనేటట్టు చేసింది. ఏ మాయ చేసిందో అని ఇప్పటికీ కూడా ఆశ్చర్య పడిపోతుంటాడు ప్రద్యుమ్నుడు.

ప్రేమించడమే కాదు కొంతమంది ఆడపిల్లల మీద కోపం కూడా ఉండేది ప్రద్యుమ్నుడికి. అటువంటి వారిలో అగ్ర తాంబూలం రామకుమారిదే.          

 చిన్నప్పుడు హై స్కూల్ లో చిన్న తరగతులలో ఉండగా ప్రద్యుమ్నుడి మాష్టార్లు ప్రతినెలా ఒక పరీక్ష పెట్టేవారు ముఖ్యంగా లెఖ్ఖల మాష్టార్లు. సాధారణంగా రెండు రోజుల్లో దిద్ది మార్కులు చెప్పేవారు.

ప్రద్యుమ్నుడి  క్లాసులో ప్రద్యుమ్నుడి  అక్కయ్య,  వాళ్ళ పక్కింటి ఎదురింటిలో ఉండే రామకుమారి కూడా ఉండేవారు

లెఖ్ఖల పరీక్ష వ్రాసిన మరుసటి  రోజు నుంచి స్కూల్ కి వెళ్ళేటప్పుడు, ప్రద్యుమ్నుడు  భీమేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆయనకి భక్తిగా మొక్కి స్కూల్ కి వెళ్ళేవాడు. ఇప్పుడు పాపం మరిచిపోయాడు  కానీ అప్పట్లో  రెండు మూడు శ్లోకాలు, పద్యాలు కూడా చదివి మరీ దండం పెట్టేవాడు.

స్వామీ భీమేశ్వరా నాకు ఎన్ని మార్కులు వచ్చినా ఫరవాలేదు కానీ రామకుమారికి నాకన్నా కనీసం రెండు మూడు మార్కులు తక్కువ వచ్చేటట్టు చూడు. ఎప్పుడైనా ఐస్ క్రీం కొనుక్కుంటే, ముందు నీకు నైవేద్యం సమర్పయామి అన్న తరువాతే నేను తింటానుఅని లంచం కూడా ఇచ్చే ప్రయత్నం చేసేవాడు ప్రద్యుమ్నుడు.

ప్రద్యుమ్నుడి  అక్కయ్య కన్నా అన్ని సబ్జెక్ట్ ల్లోనూ ప్రద్యుమ్నుడికే  ఎక్కువ మార్కులు వచ్చేవి. మిగతా అన్ని సబ్జెక్ట్ ల లోనూ రామకుమారికన్నా సాధారణంగా ప్రద్యుమ్నుడికే  ఎక్కువ మార్కులు వచ్చేవి ఒక్క లెఖ్ఖలు తప్పఆమె తండ్రి గారు వాళ్ళ  స్కూల్ లోనే లెఖ్ఖల మేష్టారు, పై క్లాసులకి.

లెఖ్ఖల్లో రామకుమారికి ఎక్కువ వస్తే ప్రద్యుమ్నుడికి నష్టం ఏమిటీ? అంటే

మిగతా పరీక్షల మార్కులు ప్రద్యుమ్నుడి  అక్కయ్య ఇంట్లో చెప్పేది కాదు కానీ లెఖ్ఖల మార్కులు  అమ్మగారికి చెప్పేది. “చూశావా అమ్మా,  ఈ వెధవ కన్నా రామకుమారికి ఆరు మార్కులు ఎక్కువ వచ్చాయిఅని. ప్రద్యుమ్నుడి  అమ్మగారు విని ఊరుకునే వారు.  అక్కయ్య మళ్ళీ మళ్ళీ చెప్పేది ప్రద్యుమ్నుడి  అమ్మగారికి కోపం వచ్చేదాకా.

ప్రద్యుమ్నుడి తల్లి గారికి కోపం వచ్చిందంటే మొదట ప్రద్యుమ్నుడిని ఆశీర్వదించేవారు. “ వెధవా, శుంఠా, సిగ్గు లేదురా? పని మనిషి రాకపోతే పాపం రామకుమారి 8 – 9 ఏళ్ల పిల్ల,  ఇంట్లో పని అంతా చేస్తుంది. అవసరమైతే చెరువు నుంచి మడిగా చిన్న బిందె తో మంచి నీళ్ళు తెచ్చి పెద్ద బిందె నింపుతుంది. ఇంత పనీ చేసి శ్రద్ధగా చదువుకుంటుంది. నువ్వూ ఉన్నావు, ఎందుకు, చదువుకోరా అంటే వినకుండా అడ్డ గాడిద లాగా ఊరంతా తిరిగి చెరువు గట్టున ఆటలు ఆడి   వస్తావు. చదువు లేదు. రామకుమారి కన్నా తక్కువ మార్కులు వస్తాయి. సిగ్గూ శరము లేని వెధవా ”   అని దీవించి ఆయాసం తీర్చుకోవడానికి ఆగుతారు.

ఇక్కడ ప్రద్యుమ్నుడి అక్క ఇంకో పుల్ల వేస్తుంది అమ్మగారి కోపాగ్ని చల్లారకుండా,

“మొన్న ఆటల్లో  కొత్తది గళ్ళ చొక్కా చింపుకు వచ్చాడు కాదే అమ్మా?” అంటుంది. అంతే అమ్మ గారి కోపం ఇంకో మెట్టు ఎక్కేస్తుంది.

“ వెధవా నువ్వు ఇలా చొక్కాలు చింపుకు వస్తే, రోజుకో  చొక్కా కుట్టించడానికి మీ నాన్నేమైనా జమీందారా?” అంటూ ఆవేశంగా చేతికందిన చీపురో, కర్రో మరేదో తో ప్రద్యుమ్నుడి శరీరం మీద నాట్యమాడించేస్తారు.

ప్రద్యుమ్నుడు పారిపోకుండా అక్క గుమ్మం దగ్గర కాపలా కాస్తుంది.

అక్క గారికి తమ్ముడి మీద ఇంత కోపమెందుకు  అంటే ప్రతీకారం. అక్క గారు పోపుల పెట్టి లోంచో, తండ్రి గారి లాల్చీ జేబు లోంచో కానీ యో అర్ధణాయో దొంగిలించి దాచుకుంటుంది. అక్కయ్య ఆ డబ్బు ఖర్చు పెట్టే లోపులే ప్రద్యుమ్నుడు ఆ డబ్బు కొట్టేసి ఖర్చు చేసేస్తాడు. ఆ కోపం అక్కగారు ఇలా తీర్చుకుంటారు.

రామకుమారికి ఎక్కువ మార్కులు వస్తే ప్రద్యుమ్నుడికి  ఇంతటి  కష్టాలు వస్తాయి.               

అందుచేత  లెఖ్ఖల మార్కులు తెలిసిన రోజున స్కూల్ నుంఛి ఇంటికి వచ్చేటప్పుడు భీమేశ్వరాన్ని కోప్పడేవాడు ప్రద్యుమ్నుడు.

భీమేశ్వరా,  ఆన్ని శ్లోకాలు, పద్యాలు చదివి ప్రార్ధించానే, ఐస్ క్రీం సమర్పయామి అన్నానే  కానీ నువ్వు కనికరించలేదు గదా. ఆన్ని దండాలు మా లెఖ్ఖల మేష్టారుకే పెట్టి ఉంటే, ఐస్ క్రీం ఆయనకే సమర్పించి ఉంటే, నాలుగు మార్కులు ఎక్కువ వేసుండేవారేమో  ఆయన.´ అని.

కానీ షరా మామూలే. మళ్ళీ లెఖ్ఖల  పరీక్ష తరువాత ఈ కధ మళ్ళీ మొదలు.  

ప్రద్యుమ్నుడి  కన్నా, రామకుమారి కన్నా ప్రద్యుమ్నుడి  అక్కయ్యకు తక్కువ మార్కులు వచ్చినా  అక్కయ్యను ఏమీ అనేవారు కాదు ప్రద్యుమ్నుడి  అమ్మగారు.

ఎప్పుడైనా ఉక్రోషం కొద్దీ ప్రద్యుమ్నుడు  అడిగినా, 

 ఇంకో ఆరేడు  ఏళ్లలో దానికి పెళ్లి చేసి పంపేస్తాం. మొగుడికి వండి పెట్టుకుంటే చాలు. ఈ మార్కులు ఏం చేస్తాయి.“ అని అనే వారు ప్రద్యుమ్నుడి  అమ్మగారు.

ఉండబట్టలేక ఒక రోజున అడిగేశాడు ప్రద్యుమ్నుడు  అమ్మగారిని,

నా క్కూడా పెళ్లి చేసి పంపించెయ్యండి మా ఆవిడకి వండి పెడుతూ బతికేస్తానుఅని.

అంతే, కాళికావతారం ఎత్తి, కట్టెపేడు పుచ్చుకుని ప్రద్యుమ్నుడి  వెనకాల పడ్డారు  అమ్మగారు.

ప్రద్యుమ్నుడు  దొరుకుతాడా? అందునా కట్టెపేడు  అమ్మ గారి చేతిలో ఉంటే.  

సాక్షాత్తూ భీమేశ్వరుడే ప్రద్యుమ్నుడి  వెనకాల పరిగెత్తినా దొరికి ఉండేవాడు  కాదేమో.