జ్ఞానసముపార్జన

ఈ మధ్యన తెగ జ్ఞానం సంపాదించేస్తున్నానేమోనని అనుమానం డౌటు కలిగింది. ఎడా పెడా, కుడీ ఎడమా, రెండు చేతుల తోటీ జ్ఞానం అర్జించేస్తున్నానని నమ్మకం కూడా కలిగిపోతోంది. గత మూడేళ్ళుగా రిటైరయ్యి ఇంట్లో కూర్చున్నప్పటినించీ నేను ఇల్లా జ్ఞాని నయిపోతున్నానన్నమాట. పాపం మాబాసుగారు అనేవాడు “బొత్తిగా జ్ఞానం లేదోమిటోయి నీకు” అని. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అయన కూడా సంతోషిస్తాడను కుంటాను. రిటైరయినప్పటి నించీ పేపరు క్షుణ్ణంగా కంఠతా పట్టేయడం, టీ.వి చూడడం బాగా అలవాటు అయిపోయింది. ముఖ్ఖ్యంగా టీ.వి ద్వారా చాలా విషయాలలో చాలా జ్ఞానం గడించేసాను. మీకు అనుమానంగా ఉందా? మీరు కూర్చుని ఎవరితోటో మాట్లాడు తున్నప్పుడు, కడుపులో కలుక్కుమంటే అది ఏరోగానికి సంకేతం? మీకు తెలుసా? నాకు తెలుసు. వంకాయని ముచిక నించి నాలుగు భాగాలుగా కోసి, అందులో బంగాళాదుంప కూర దట్టించి, బెండకాయతో బిగించి చేసే కూర నేమని పిలుస్తారో మీకు తెలుసా? నాకు తెలుసు. మొన్న సల్మానుఖానుడు ఎవరికి టెలిఫోను చేసాడో కూడా నాకు తెలుసు. ఒబామాగారూ, ఆయనెవరూ, పేరు మర్చిపోయాను, బ్రిటిష్ ప్రదాని, వాళ్ళిద్దరూ ఏంమాట్లాడుకున్నారో కూడా నాకు తెలిసిపోయింది. చూసారా మతిమరపు కూడా జ్ఞాని లక్షణం అంటారు. అది కూడా నాకు వచ్చేసింది. ఇంతేనా అంటారా? మొన్న ఆయనెవరో పంచె కట్టుకొని, కండువా వేసుకొని, విభూతి రాసేసుకొని, కుంకం బొట్టుపెట్టేసుకొని, ముందుకూ వెనకకూ ఊగుతూ చెప్పింది విని ఎన్నోరకాల కృష్ణులున్నారని కనిపెట్టేసాను. భారత కృష్ణుడు, భాగవత కృష్ణుడు, గోలోక కృష్ణుడు, విష్ణు కృష్ణుడు, పరవాసుదేవుడు అని. ఇదంతా జ్ఞాన సముపార్జన కాక మరేమిటండీ. వంటల శాస్త్రం, రోగశాస్త్రం, సిన్మాశాస్త్రం, రాజకీయ శాస్త్రాలే కాక ఆధ్యాత్మిక శాస్త్రంలో కూడా పట్టు దొరికి పోతోందన్న మాట.

ఇంత జ్ఞానం ఇల్లా సంపాయించేస్తుంటే బ్రహ్మజ్ఞానిని అయిపోతున్నానేమోనని అనుమానం వచ్చేస్తోంది. మొన్నోకల కూడా వచ్చింది. బాసింపట్టు వేసుకొని, కళ్ళు తెరిచి నేను తపస్సు చేసుకుంటున్నాను. రెండు కళ్ళకి ఎదురుగా రెండు టీ.వీ లు, చెరోపక్కా రెండు చెవులకి ఇంకో రెండు టీ.వీ లు (చెవులకి టీవీ లు ఎందుకు? రేడియో చాలదా అని ప్రశ్నలు వేయకండి. నా కల, నా ఇష్టం) ఏకాగ్రతతో వింటున్నాను, కంటున్నాను (తప్పుడర్ధాలు తీయకండి) నాచుట్టూ బుల్లి టీవీలు, చిన్నటీవీలు, పెద్దటీవీలు గుట్టలు గుట్టలు గా పేరుకుపోతున్నాయి. మధ్యలో మొబైల్స్ కూడా దూరిపోతున్నాయి. శిరస్సు పై దాకా గుట్టలు పేరుకు పోయాయి. ఎంత కలైనా, కనీస జాగ్రత్త తప్పదని, గుట్టల మధ్య నించి ముక్కు బయటకు పెట్టి, ఈ ఛానలాయనమః, ఆఛానలాయనమః అంటూ ఇంకా ఘట్టిగా తపస్యించేసాను. సీను కట్ చేస్తే అచట ఇంద్రుడి కి మంట పుట్టు కొచ్చింది. బహుశా ఆయన కూడా నా ‘మౌన నిరశన వ్రతం’ చదివేడేమో, డైరక్టుగా ఘృతాచి ని పంపించేసాడు. ఆవిడ రావడం తోటే, నా చుట్టూ ఉన్న గుట్టలు ఎగిరిపోవడం మొదలుపెట్టాయి. నాకు ఖంగారు పుట్టింది. ఒక మంచి LCD, Plasma TV పట్టుకుందామని ప్రయత్నిస్తున్నాను. అవి దొరకడం లేదు. ఈలోపు ఘృతాచి పాట పాడేసి, డాన్సాడేసి వెళ్ళిపోయింది. మెలకువ వచ్చేసింది. టీవీ దేవుడు ప్రత్యక్ష మయ్యేదాకా తపస్సూ సాగలేదు, టీవీ లూ దొరకలేదు, వచ్చిన ఘృతాచి కాస్తా మాట్లాడ కుండానే వెళ్ళిపోయింది. కలలో కూడా నాజాతకం ఇంతేనా అని దుఃఖించాను. (మొన్నామధ్యన ఎవరో ఘృతాచి ఎడ్రస్సు కావాలన్నారు, బహుశా నాకు తెలియకుండా నాకలలోకి ఆయన వచ్చి ఘృతాచిని లేవతీసుకు పొయేరేమో అని నా అనుమానం)

ఈ కల కూడా వచ్చింది కాబట్టి జ్ఞాని నయిపోతున్నానన్న నా నమ్మకం ఇంకా పెరిగింది. కానీ ఎప్పటి లాగానే మాఆవిడ నా ఆశలమీద నీళ్ళు చల్లేసింది. నాలుగు రోజులక్రితం ఓమిత్రుడి దగ్గరకు వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చాను. ఆకలి దంచేస్తోంది. డైనింగు టేబులు దగ్గర కూర్చున్నాను. శ్రీమతిగారు టేబులు మీద ఒక పీట పెట్టింది. ఆ పీట మీద పళ్ళెం, పళ్ళెం చుట్టూ ఆనపకాయ ముక్కలు, గుమ్మడి కాయ ముక్కలూ ఉన్నాయి. పళ్ళెం అంచులనించి మధ్యదాకా, టమాటా, ఉల్లిపాయల చక్రాలు, కేరట్టు,దోసకాయ ముక్కలు, పచ్చి,ఎండు మిరపకాయలు, మధ్యదాకా విస్తరించి ఉన్నాయి. మధ్యలో ఓ కాబేజి ఆకు ఉంది. దానికింద ఎత్తుగా ఉంది. పైన వేయించిన జీడిపప్పు, కిస్మిస్సు, బాదాము పప్పులు ఉన్నాయి. జీడిపప్పు తీసుకొని నోట్లో వేసుకుందామని ప్రయత్నించాను. గరిటతో నాచేతి మీద ఒఖ్ఖటుచ్చుకుంది. ఇది వాసన చూసి ఏంకూరో చెపితే, ’వంకాయ బెంగుళూరు మిర్చి మసాలా ఢాం చేసి పెడ్తానంది. ఢాం కాదు దం అన్నాను నేను. మొన్ననే చూసాం ఓఛానలులో. తెల్లబట్టలు వేసుకొని, పొడుగాటి తెల్లటోపీ పెట్టుకొని, తెల్లగ్లవుజ్స్ తొడుక్కొని ఇంగ్లీషులో మాట్లాడుతూ, తెలుగులో నవ్వుతూ, ఒకాయన, బెంగుళూరు మిర్చి వంకాయ మసాలా దం, చేయడం ఎల్లాగో నేర్పించేసాడు. అది తిన్న ఆ యాంకరమ్మ కళ్ళు చక్రాల్లా తిప్పుతూ, అయ్య బాబోయ్ హింత బాగుందేమిటీ అంటూ కింద పడబోయింది. సందు దొరికింది గదాని, తెల్లబట్టలాయన పట్టేసుకున్నాడు. అది చేసిపెట్టమని అడిగాను మాఆవిడను. ఇప్పుడు ఇది అది కాదని తేలిపోయింది. కానీ ఏమిటో తెలియడం లేదు. ఆకలి దంచేస్తోంది కాబట్టి ఓటమి ఒప్పేసుకొన్నాను. కాబేజీ ఆకు తీస్తే దానికింద అరటికాయ ఉప్మాకూర ఉంది. దీనికింత బిల్డప్పా అని ఆశ్చర్యపోయాను. ఏంవండాం, ఎంత రుచిగా వండాం అన్నది కాదు ప్రశ్న, ఎంత అందంగా అలంకరించాం అన్నది జవాబు అని శెలవిచ్చింది.

ఇప్పుడు మీరే చెప్పండి, నాకు జ్ఞానం అబ్బిందా? లేదా? తెలిసి జవాబు చెప్పక పోయారో నేను చెప్పను కాని, భేతాళ కధలు గుర్తు చేసుకోమని మనవి.