భగ్న ప్రేమికుడు


తను భగ్నప్రేమికుడనే  విషయం శ్రీనివాసుడుకి   చిన్నప్పుడే తెలిసింది.    

నాల్గైదు ఏళ్ల వయసులో పక్కింట్లో సీగానాపెసునాంబ ఉండేది. దాని నోరు, పళ్ళు ఎప్పుడూ విశ్రాంతిగా ఉండేవి కావు.   ఎప్పుడూ  ఏదో ఒకటి మర ఆడిస్తూనే  ఉండేది. బాల శ్రీనివాసుడికి  కూడా జిహ్వ చాపల్యం ఎక్కువే. సీగానా పెసూనాంబని     ప్రేమించడం మొదలు పెట్టాడు. “నువ్వు ఎంచక్కా ఉన్నావు” అన్నాడు. “నీ బుగ్గలు బూరెల్లా ఉన్నాయి”  అన్నాడు.  “నీ రంగు పనస తొనలా ఉంది” అన్నాడు. పెసూనాంబ నాలుగు ఆకులు  ఎక్కువే చదివింది.   “నువ్వు ఎంత ప్రేమించినా సున్నుండలో చిన్న ముక్క కూడా ఇవ్వను”  అంది.  అది  శ్రీనివాసుడి  మొదటి భగ్నప్రేమ.

కొంచెం వయసు వచ్చిన తరువాత అంటే ఏడో క్లాసులో ఉండగా  క్లాసు మేటు కుసుమని ప్రేమించడం మొదలు పెట్టాడు శ్రీనివాసుడు . వాళ్ళ నాన్నగారికి స్కూలు  దగ్గరలోనే  చిన్న హోటల్ ఉండేది. రెండు మూడు మాట్లు తన గర్ల్ ఫ్రెండ్స్ ని, ఒకరిద్దరు బాయ్ ఫ్రెండ్స్ ని కూడా వాళ్ళ హోటలుకి తీసుకెళ్ళింది.   ఆర్నెల్ల పాటు ఎంత గాఢముగా, ఘోరంగా ప్రేమించినా శ్రీనివాసుడిని మాత్రము  ఎప్పుడూ వాళ్ళ హోటలుకి తీసుకెళ్ళలేదు. విసుగెత్తి   ప్రేమని భగ్నించేసాడు శ్రీనివాసుడు.  

కాలేజిలో చదివేటప్పుడు పుర ప్రముఖుడి కుమార్తె  లీలావతిని ప్రేమించాడు. వాళ్ళ నాన్నకి ఒక సినిమా హాలు, రెండు బట్టల కొట్లు, ఒక నగల దుకాణం ఉన్నాయి.  ఆమె వెనకాల నడవడం మొదలు పెట్టాడు. ఏడు కాదు ఏడు వేల అడుగులు వేసాడు ఆమె వెనకాల. ఆమె తిరిగి చూడలేదు. ముందు నడుస్తూ వెనక్కి తిరిగి చూడడం  మొదలు పెట్టాడు. ఆమె రూటు మార్చేసింది. అయినా ప్రయత్నం మానలేదు శ్రీనివాసుడు. కాలేజిలో ఆమె చుట్టూ తిరగడం మొదలు పెట్టాడు. నాల్గైదు రోజులు ఆమె చుట్టూ తిరగగానే నిర్మోహ మాటంగా, కర్కశంగా  చెప్పేసింది. “ఇంకో మాటు నాకు వంద అడుగుల  లోపుల కనిపిస్తే మా నాన్నకి చెబుతాను” అని.  ప్రేమ మొగ్గ తొడగకుండానే పెద్దలకి తెలుస్తే,  వీపు కాయలు కాస్తుందని శ్రీనివాసుడు ప్రేమను అణుచుకున్నాడు.

యూనివర్సిటీలో చదివేటప్పుడు, ఆపైన ఉద్యోగం చేసేటప్పుడు డజన్ల కొద్ది అమ్మాయిలను ఇష్ట పడ్డాడు.  అందరినీ సమదృష్టితోనే  ప్రేమించాడు. ఎడ తెగకుండా, విరామం లేకుండా,   అప్పుడప్పుడు ఏక కాలంలో నలుగురిని కూడా ప్రేమించేశాడు.  ఎందుకైనా మంచిదని, వాళ్లకి కూడా నాన్నలు, అన్నయ్యలు కూడా ఉంటారు కదా అని,  తన  ప్రేమ ఆ అమ్మాయిలకు కూడా తెలియకుండానే  ప్రేమించేశాడు.  అజ్ఞాత ప్రేమ సార్వభౌముడు అని కూడా అనేవారు మిత్రులు శ్రీనివాసుడిని. 

అష్ట కష్టాలు పడి శ్రీనివాసుడి  నాన్నగారు శ్రీనివాసుడి  పెళ్లి చేశారు పద్మావతితో.  పెళ్లైంది కదా తీరుబడిగా భార్యని తెగ ప్రేమించేద్దామని  తీర్మానించు కున్నాడు.  “నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను” అని చెప్పాడు కాపురానికి వచ్చిన పద్మావతితో.    “పెళ్లి అయిం తరువాత ఇంకా ప్రేమ ఎందుకు?”  అని కొచ్చెను మార్కు పెట్టింది  ఆవిడ. “ప్రేమ అమరం. అజరామరం, డివైన్” అంటూ ఆవేశంగా చెప్పాడు.   “ ఏభై వేలు కట్నం తీసుకున్నప్పుడు ఈ ప్రేమ గుర్తుకు రాలేదా” అని ఘట్టిగానే అడిగింది పద్మావతి.  “అయినా ఓ చంద్రహారం చేయించారా? కంచి పట్టు చీర కొన్నారా? కాశ్మీరు తీసుకెళ్ళారా? ఏం చేశారని మిమ్మల్ని ప్రేమించాలి?”  అని ప్రశ్నల శరపరంపర సంధించింది.  నిరుత్తరుడయ్యాడు  శ్రీనివాసుడు.  ఇందులో తన జీవిత కాలంలో ఏమీ  చేయలేడు  కాబట్టి ఉదాత్త ప్రేమ, ప్రేమాతి ప్రేమ భార్యతో కూడా సాధ్యం కాదని తేలిపోయింది శ్రీనివాసుడికి.

ఏదో సాధారణ భార్యా భర్తల ప్రేమతోనే జీవితం ఇప్పటిదాకా సాగిపోయింది. అయినా అప్పుడప్పుడు సినిమాలలోగానో, నవలల్లోగానో  ప్రేమించుకోవాలని ప్రయత్నం చేశాడు శ్రీనివాసుడు. కానీ,    పద్మావతి కంట్లో నలుసు పడితే శ్రీనివాసుడి  కంట్లో కన్నీరు కారలేదు.  ఒక మాటు తీవ్ర ప్రయత్నం కూడా చేశాడు. ఆవిడ కంట్లో కారం కొట్టాడు. ఆవిడ కన్నీరు మున్నీరుగా నానా శాపనార్ధాలు పెడుతూ విలపించింది. కానీ శ్రీనివాసుడి  కంట్లో కన్నీరు రాలేదు.  శ్రీనివాసుడి  కాలు విరిగితే పద్మావతి  కుంటలేదు.  పద్మావతి చేసిన కూర తింటే  శ్రీనివాసుడి  కంట్లో కన్నీరు ఉబికింది కానీ నోట్లో లాలా జలం స్రవించలేదు.  శ్రీనివాసుడికి జబ్బు చేస్తే  ఆవిడ గుండెలు బాదుకోలేదు.  పరామర్శించడానికి వచ్చే వాళ్లకి భోజనాలు, కాఫీ టిఫిన్లు తయారు చేసి పెట్టి,  తీరుబడి చేసుకునే లోపుగా  రెండో రోజునే  శ్రీనివాసుడు  హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చేశాడు. అందుకని పద్మావతి  శోక తప్త విచార ముఖబింబాన్ని దర్శించే భాగ్యం కూడా శ్రీనివాసుడికి కలగలేదు.  

ఈ విధంగా  తమ భార్యా భర్తల   ప్రేమ  కనీసం కధలలో లాగా పై స్థాయిలో లేదు అని కూడా అర్ధం అయింది శ్రీనివాసుడికి.

ఇలా భగ్న ప్రేమలతో ముఫై  ఏళ్లు నిండిపోయాయి శ్రీనివాసుడికి .  “సఫల ప్రేమ నాకు ఎండ మావియేనా?”  అని విలపిస్తున్నాడు శ్రీనివాసుడు.

అంతే,  అంతే కొన్ని జీవితాలు అంతే.  

(అబ్బే,  ఏం లేదు. క్లుప్తంగా కధలు వ్రాయడం ప్రాక్టీసు చేస్తున్నాను.....దహా.) 

పా – ప్రా. సూ. -3, వంకాయ పప్పు చారు కూర భళా.

పాక శాస్త్రము – ప్రాధమిక సూత్రాలు – 2   ఇక్కడ చెప్పుకున్నాము.

  ఇంట్లో వాళ్ళు మన వంటల మీద అభిప్రాయం వెలిబుచ్చకుండా చేయాలంటే వారి రుచి గ్రంధుల మీద దాడి చెయ్యాలని చదువుకున్నాం.  కానీ ఎలా. తినగ తినగ వేము తీయనుండు. అనగా  చేదు గ్రంధుల మీద దాడి జరిగింది. ఎక్కువ గా తింటే మొహం మొత్తుతుంది అని కూడా అంటాం ఇందుకే. వంటలో పాళ్ళు కుదరకపోయినా ఇంతే జరుగుతుంది. ఏదైనా క్రమ క్రమంగా అలవాటు చెయ్యాలి.

అసలు రుచులు ఎన్ని అంటే షడ్రుచులు అంటారు. చెరుకు పానకం తీపి వేరు హల్వా తీపి వేరు.  మధ్యలో మధురం అని కూడా అంటారు. కొరివి కారం వేరు ఆవకాయ కారం వేరు.  గొడ్డు కారం నషాలానికి అంటుతుంది. అర్ధాత్ ఒకే రుచిలో ఇన్ని తేడాలున్నాయి. "రుచులు దోసంబంచు పోనాడితిన్ తల్లీ"  అన్నాడట కవి సార్వభౌముడు. ఆ ప్రకారం మన ఇంట్లో వాళ్ళచేత అనిపించాలి.  ఇక్కడ రెండు కధలు  చెప్పుకోవాలి.

కొత్తగా కాపురానికి వచ్చిన సుబ్బలక్ష్మి పక్కింటి పిన్నిగారితో   “మా ఆయనకి వంకాయ కూర చాలా ఇష్టమని మా అత్తగారు చెప్పారు కదా అని,  సోమవారం వంకాయ కూర వండాను. అద్భుతంగా ఉందని అన్నారు మా వారు. మంగళవారం వండాను, చాలా బాగుంది అన్నారు. బుధవారం వండాను,  బాగుంది అన్నారు. లక్ష్మివారం వండాను,  మాట్లాడలేదు. ఈ వేళ శుక్రవారం వండితే,  వంకాయ కూర అంటే నాకు అసహ్యం అంటారు,  ఏమిటండీ చోద్యం కాకపొతే”  అని వాపోయిందిట.

కొత్తగా కాపురానికి వచ్చిన కనకాంగి పక్కింటి పిన్నిగారిని అడిగిందిట,  వంకాయ కూర చెయ్యడం ఎలా అని. ఆవిడ చెప్పింది. ఈవిడ వ్రాసుకుంది. చివరగా,  ఉప్పూ,  కారం తగినంత అంటే ఎంతండి అని ఈవిడ అడిగింది. "అదే తెలుస్తే,  మీ బాబయ్యగారు సన్యాసుల్లో ఎందుకు కలిసేవారు"  అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుందిట ఆవిడ.

రుచి గ్రంధులను  ఈ విధంగా కూడా దెబ్బతీయవచ్చు. ఈ పద్ధతిలో  సమయం పడుతుంది. సులువైన పద్ధతులు అవలంబించాలి.  ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క మార్గం అవలంబిస్తుంది.

ఏ పధ్ధతి అయినా రుచి గ్రంధుల మీద దాడే ముఖ్యం.   ఇది ఒక్కరోజులో అయ్యేపని కాదు.  వాళ్ళ రుచి గ్రంధులను నిర్దాక్షణ్యంగా, నిరంకుశంగా, క్రూరంగా నెమ్మది నెమ్మదిగా హత్య చేయాలి.  ఈ హత్యా కార్యక్రమం ఒక వ్రతం లాగ, నియమ నిష్టలతో, శ్రద్ధగా   చెయ్యాలి. సాధ్యమైనంత వరకు ఆదివారం, పండగ, శలవు రోజుల్లో  అందరూ ఇంట్లో ఉండే రోజుల్లో  చేస్తే మంచిది. కొత్తగా పెళ్లి అయి కొత్త కాపురం పెట్టిన రోజుల్లో అయితే మరీ మంచిది. అప్పుడు ఏ రోజైనా ఒకటే.

ఈ వ్రతం శాస్త్రోక్తంగా చేయాలి.  ముందు రోజు సంకల్పం చెప్పుకోవాలి. “భలానా కూర రేపు చేయ బోతున్నాను. నేను భగవంతుని చేతిలో కీలుబొమ్మని. ఆయన ఆడించినట్టు ఆడడమే నా ధర్మం. ఈ కూర నా ద్వారా చేయించటానికి ఆయన సంకల్పించాడు. ఆయన ఆజ్ఞానుసారం మాత్రమే నేను చేస్తున్నాను. జరిగే కష్ట నిష్టురాలకు ఆయనదే బాధ్యత. నేను నిమిత్తరాలుని మాత్రమే”. 
    
సంకల్పం  చెప్పుకున్న తరువాత ఇష్టదేవతా ప్రార్ధన చేసుకోవాలి. “ఓ నా ప్రియ దైవమా,  మా ఇంట్లోవారి రుచిగ్రంధుల  సామర్ద్యాన్ని తగ్గించటానికి ఈ సాహసం చేస్తున్నాను. వారికి ఇంకేమి ఆపద రాకుండా చూచే బాధ్యత నీదే”. 

ఆ తరువాత ధన్వంతరిని, అశ్వని దేవతలని పూజించండి, మీ ఇంటివారి ఆరోగ్యానికి ఢోకా లేకుండా.   

మీ ఇంటివారి క్షేమం కోరి,  లయ కారకుడైన శివుడిని సేవించండి, యమధర్మ రాజు కి ఒక మెమో పంపమని,  యమదూత లెవరూ మీ ఇంటి దరిదాపులకు రాకుండా. 

మీ ధర్మం మీరు నెరవేర్చారు. మీ జాగ్రత్తలు మీరు తీసుకున్నారు కాబట్టి  మీరు నిర్భయంగా, నిస్సందేహంగా, నిరంకుశంగా, నిరాపేక్షగా, నిర్దయగా మీ వ్రతాన్ని మర్నాడు  మొదలు పెట్టవచ్చు. 

మీరు మీ వ్యక్తి గతంగా ఇంకొక జాగ్రత్త తీసుకోవాలి. రేపటి నుంచి  రెండు రోజులు అభోజనం ఉండాల్సి వచ్చినా, నీరసం రాకుండా ఉండేటట్టు తగినన్ని పిండి పదార్ధాలు, మాంసకృత్తులు, ప్రోటీన్లు, ఖనిజాలు, లవణాలు, విటమిన్లు మొదలైనవి కల మృష్టాన్నం తగు మోతాదుకు మించినది ముందు రాత్రి సుష్టుగా భోజనం చెయ్యండి.

మొదటి భాగం పూర్తైంది. వ్రతంలో రెండవ భాగం వంట చెయ్యడం. వంకాయ పప్పు చారు కూర భళా చేయాలనుకున్నాము కదా.  పేరు మీఇష్టం.  చివరన భళా అని ఉంటే సరిపోతుంది. ఏ కూరగాయ ఉపయోగిస్తే ఆ కూర వంకాయ బదులు పెట్టండి. పప్పు ముందు,  వంకాయ తరువాత ఉన్నా ఫరవాలేదు. పేరులో పెన్నిధి ఉండదు. 

వంకాయ రకరకాలుగా వండుతారు. కారం పెట్టి, అల్లం కొత్తిమీర పచ్చిమిర్చి పెట్టి, వేపుడు, పెరుగు పచ్చడి,  బండ పచ్చడి, పులుసు పచ్చడి, బజ్జీలు  ఇత్యాదులు చాలానే ఉన్నాయి. అదికాక వాంగీబాత్ అని కూడా చేస్తారు. ఏదో ఒక రకం అందరూ ఇష్టంగానే తింటారు. ఒకవేళ,  మా ఇంట్లో వంకాయ తినరు అంటే మరో కూర,  బెండకాయ, అరటికాయ, బంగాళాదుంప కాయ, టమాటో కాయ, కేరట్ కాయ ఏదైనా సరే, ఆకు కూర లైనా  ఫరవాలేదు. చేసే విధానం ముఖ్యం. ఈ విధానం ఆల్ ఇన్ వన్ టైపు. 

అన్నట్టు దుంప కాయలైతే మరీ మంచిది. శరీరంలో చక్కెర పండించడానికి శ్రేష్టం కూడాను. చక్కెర పండడం మొదలైతే జిహ్వ చాపల్యం బాగా తగ్గుతుంది కూడా. ఇవే కాక కొలెస్ట్రాల్ పెంచేవి, మిగతా రోగాలు తెప్పించేవి కూడా వాడవచ్చు. కాంబినేషన్ కూరలు కూడా వాడ వచ్చును.   

వ్యాధులు మొదట్లోనే కనిపెట్టేసి మందులు వాడాలి, ప్రాణాంతకం కాకూడదు. వ్యాధులు మొదలైతే తిండిలో నియమాలు వచ్చేస్తాయి. ఉప్పు నిషిద్ధం, కారం కూడదు, తీపి అసలు పనికి రాదు అంటూ బోల్డు కట్టుబాట్లు పాటిస్తారు. కాగల కార్యం గంధర్వులే తీర్చారన్న మాట.  గ్రంధుల మీద దాడి మనం మానెయ్యవచ్చు కూడాను.

నేను వంకాయను ఎందుకు ఎన్నుకున్నానంటే వంకాయతో వెయ్యి రకాల వంటలు చేయవచ్చుట. వంకాయల్లో అనేక రకాలు ఉన్నాయి,  పొడుగువి, సన్నవి, లావువి, తెల్లవి,నల్లనివి, అంటూ అనేక రకాలు.  ‘వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్యామణి’  అంటూ ఏదో పద్యం కూడా ఉంది. ఇందులో బోలెడు పోషక పదార్ధాలు కూడా ఉంటాయంటారు. ఎక్కువుగా తింటే దురద, ఎలర్జీ కూడా కలిగిస్తుందని కొంతమంది అంటారు. ఈ కారణాల వల్ల వంకాయే భేషైన వంటకం అని అనుకున్నాను. 

వంకాయ పప్పుచారు కూర భళా ఎందుకు అంటే దానికీ కారణం ఉంది. మాములుగా ఇంట్లో ఒక  పప్పు,  ఒక కూర, పచ్చడి, రసమో  పులుసో చేసుకుంటాము. ఇన్ని రకాలు ఉంటే కానీ తినే వాళ్లకి సంతృప్తి కలుగదు. ఇన్ని పదార్ధాలు చేయడం అంటే గృహిణికి ఎంత కష్టం. అందుకని అన్నీ కలగలపి ఒకే వంటకం చేయడం సులువు గదా. బహుళార్ధ సాధక వంట అన్నమాట. ఇది కూరగా, పచ్చడిగా, పులుసుగా , పప్పుగా ఇలా అన్ని రకాలుగానూ చెప్పవచ్చు. అన్ని  రుచులు ఎంతోకొంత ఉంటాయి.  

కావలిసిన పదార్ధాలు :  వంకాయలు, (ఏవైనా ఫరవాలేదు, సన్నవైతే శ్రేష్టం),  కందిపప్పు,(పెసరపప్పు, సెనగ పప్పు అయినా ఫరవాలేదు),   ఉల్లిపాయలు, కొత్తిమీర, కొబ్బరి కోరు, బఠానీలు,  అల్లం  వెల్లుల్లి పేస్టు, నూనె, పచ్చిమిర్చి,   పసుపు, కారం పొడి, ఉప్పు, బెల్లం, చింత పండు,   మసాలా పౌడరు.  లేనివి వదిలేయ వచ్చు. పాళ్ళు ఉజ్జాయింపుగా మీ ఇంట్లోవాళ్ళ రుచిని  కొద్దిగా చెడగొట్టేటట్టు.

తయారు చేయు విధానం : స్టవ్ వెలిగించి వంకాయలను కాల్చండి. తొక్కు తీసి గుజ్జుగా చేసుకోండి. రెండు  వంకాయలను తరిగి ముక్కలుగా కూడా చేసుకోండి. స్టవ్ మీద మూకుడు పెట్టండి. నూనె వేసి కాచండి. ఉల్లిపాయ ముక్కలు వేసి వేపండి. వంకాయ ముక్కలు వేయండి. నానేసిన బఠానీలు వేయండి. పచ్చి మిర్చి ముక్కలు కూడా వేయండి. పప్పు వేయండి. (ఇది ముందు అది వెనక్కాల వేసినా నష్టం లేదు.) కొద్దిగా ఉడకనీయండి. ఇంత చింత పండు రసం పొయ్యండి. ఉడక నివ్వండి. (ఎంతసేపు అన్నది మీ ఓపిక,  తీరుబడిని  బట్టి.) ఇప్పుడు మిగతా వన్ని పోసేయండి. మరగనీయండి. అవసరమైతే నీళ్ళు పొయ్యండి. మరిగించండి. నీళ్ళు పొయ్యండి.   ఇంకా మరిగించండి. చివరగా పోపు పెట్టి దింపేయండి.

ఇన్ని వేసిన తరువాత ఏదో ఒక  ఘుమ ఘుమ వాసన వస్తుంది. రాకపోతే వడ్డించేటప్పుడు మీరే “ఘుమ ఘుమ” అంటూ వడ్డించండి.   

రెండు ముద్దలు తినగానే ఉప్పు తక్కువయిందేమో అనుకుంటాడు. ఇంకో రెండు ముద్దల తరువాత  పులుపు ఎక్కువ అంటాడు.  అబ్బే కారమే తక్కువయింది అనుకుంటాడు. తీపి ఎక్కువ అయిందా అని సందేహపడతాడు. చివరగా చిరు చేదు వల్లే రుచిలో భ్రమ కలుగుతోందేమో నని అనుమానపడతాడు. తానొకడైనా  తలకొక రూపై అన్న చందాన ఒకే కూర బహురుచులను తెస్తుంది. ఏ రుచి గ్రంధీ నిర్ధారణగా సంకేతం ఇవ్వలేక పోయింది అన్నమాట. అంటే మీరు కృత కృత్యుల య్యారన్న మాట. ప్రధమ విజయం. 

వారానికి మూడు మాట్లు రకరకాల కూరలతో  ఇలా వండిపెట్టండి. రుచి గ్రంధులు కన్ఫ్యూజ్ అయిపోతాయి.  బండబారిపోతాయి. పని చెయ్యడం మానేస్తాయి. అంతిమ విజయం కూడా మీదే.

మీరు ఎటువంటి వంటల ప్రయోగాలు చేసినా గురుడు నోరు మెదపడు. హాయిగా వంటల రిసెర్చ్ చేసుకుంటూ పేపర్స్ పబ్లిష్ చేసుకుంటూ పేరు ప్రఖ్యాతులు గడించెయ్యవచ్చు. 

పాక శాస్త్రం సమాప్తం.

నా 25567వ సూర్య దర్శనం

ఉదయమే ఏడున్నర గంటలకల్లా ఇంట్లోంచి బయటకు వచ్చి,  ఎదురింటి పెరట్లో ఉన్న మామిడి చెట్టు కొమ్మల సందులో నుంచి సూర్య దర్శనం చేసుకున్నాను. రోజూ ఈ టైములో చేసుకోను. ఉదయం పది, పదిన్నర మధ్య పక్కింటాయనతో బాతాఖానీ చేసేటప్పుడు మాత్రమే ఆ రోజుకి ప్రధమ సూర్యదర్శనం చేసుకుంటాను. కానీ ఈ రోజు నాకు  ముఖ్యమైన రోజు కాబట్టి ముందుగానే చేసుకున్నాను. అల్లాగని ప్రతీ ముఖ్యమైన రోజూ ఇంత తొందరగా దర్శించుకోను. అయినా నా బతుక్కి ముఖ్యమైన రోజులు అంటూ ఏముంటాయి లెండి. అన్ని రోజులు  ఒకేలా ఉంటాయి. రోజూ సుమారు ఏడు గంటలకి లేవడం, కాఫీ అని అరవడం, వస్తున్నా అని ఆవిడ అనడం, అన్న పావుగంటకి ఆమె తేవడం, ఈ లోపున నేను రెండు సిగరెట్లు తగలేయడం, తాగిన తరువాత మరొకటి కాల్చేయడం, (హెచ్చెరిక :- సిగరెట్టు తాగుట మీ శరీరమునకు హానికరము. కాన్సరు కలిగించును. ఊపిరితిత్తులను నాశనము చేయును. ఎదుట, పక్కన ఉన్నవారికి కూడా హాని చేయును.), ఆ తరువాత పేపరు పఠించడం, కాలకృత్యాదులు, ముఖ ప్రక్షాళన తరువాత అల్పాహారం మెక్కడం (అదేమిటో,  మా ఆవిడ మెక్కడానికి దయచేయండి అని బహు గౌరవంగా పిలుస్తుంది.), ఇత్యాదులన్నీ క్రమం తప్పకుండా ఒక అరగంట అటూ ఇటూలలో జరిగిపోతాయి ప్రతీరోజూ.

మరి ఈ రోజు ప్రాముఖ్యత ఏమిటి అంటే, నిజంగా ఏమీ లేదు. నిన్నరాత్రి నిద్ర పట్టక, చేయటానికి ఏమీ లేక ఒక నిర్ణయం తీసుకున్నాను. “రేపటి నుంచి జీవితాన్ని పునరావలోకన చేసుకోవాలని”.  రేపే ఎందుకు అని ఎవరైనా అడిగితే,  25567 వ సూర్య దర్శనం అని చెప్పుకోవటానికి అన్నమాట.  బ్లాగుల్లో నా 239వ దినం (ఇక్కడ)  తరువాత మరే పవిత్ర దినము దొరక్క కూడా.   ఈ అంకె కూడా నిన్న రాత్రే లెఖ్ఖించాను. అరగంట పైన పట్టింది. లీపు సంవత్సరాలు కూడా లెఖ్ఖకట్టి మరీ తేల్చాను ఈ అంకె. నా జన్మ సమయం రాత్రి 11-49   నిముషాలు అవటం వల్ల ఒక రోజు కలపాలా వద్దా అని తీవ్రంగా చింతించాను. ఈ టైం కూడా ఎంత కరెక్టో కూడా తెలియదు. నేను ఈ లోకోద్ధరణ కోసమై అవతరించిన సమయం,   మా నాన్నగారి  జేబు  గడియారం  12-11 అంటే,   మా తాతగారి గోడ గడియారం 11-57   చూపించింది,   మంత్రసాని నడుముకి కట్టుకున్న  గడియారం 11-49  అంటే,   FA చదువుతున్న మా మేనమామ కొడుకు చేతి గడియారం  12-02  చూపించింది.  ఇన్ని గడియారాలు వాటి వాటి సమయాలు అవి చూపిస్తే,  మా ఇంటి సిద్ధాంతి, అన్నిటికి లెఖ్ఖలు కట్టి  11-49 జాతకానికి అన్నిటికన్నా బాగుంది అనడంతో అదే నిర్ణయించారు.  మా పితామహులు,  భూత,  ప్రేత పిశాచాలు  తిరిగే వేళ పుట్టిన వాడికి ఏ టైము అయితే ఏమిటి? అని వాకృచ్చారని  మా మాతావహులు నొచ్చుకున్నారని మా అమ్మగారు చింతించారని మా మేనత్త గారు నాకు చెప్పారు కూడా. అందుకని ఒక రోజు తగ్గించాను.   

అందరూ పూర్ణ చంద్ర దర్శనం లెఖ్ఖలు వేస్తారు కదా, మీరేమిటి సూర్య లెఖ్ఖలు వేశారు అనే సందేహం మీకు రావచ్చు. సూర్యుడు నాకు మల్లె కష్టజీవి. రోజూ వస్తాడు. తన పని తను చేసుకుపోతాడు. చంద్రుడు నెలకి ఒక రోజు శలవు పెడతాడు. కొన్ని రోజులు ఆలశ్యంగా డ్యూటీకి వస్తాడు. కొన్ని రోజులు పెందరాళే వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు ఇలా వచ్చి సంతకం పెట్టి అలా వెళ్ళిపోతాడు.  వచ్చిన వాడు తన పని చేసుకోకుండా చుక్కలతోటి సరాగాలాడతాడు. నేను కూడా సూర్యుడికి మల్లె శలవులు పెట్టకుండా డ్యూటికి వెళ్ళేవాడిని. శని, ఆదివారాలైనా ఆఫీసులోనే గడిపేవాడిని. ఇంటి కన్నా ఆఫీసే పదిలం, క్షేమకరం అనుకునే వాడిని. అందుకనే సూర్యుడే నాకు మార్గదర్శి. 

సూర్య దర్శనానంతరం జీవితం లోకి వెనక్కి టైం ట్రావెల్ చేశాను.  మరీ ఆరేడు సంవత్సరాల వయసుకి వెళ్ళిపోయాను కాబట్టి ఏమీ గుర్తుకు రాలేదు. నాకు మతిమరుపు ఎక్కువ. అందులోనూ చిన్నప్పటి విషయాలు అసలు గుర్తుకు రావు. అయినా చిన్నప్పుడు ఏమున్నాయి కనక గుర్తుకు తెచ్చుకోవటానికి.  కరెంటు, రేడియో, లాంటివి లేవు. క్రికెట్ లాంటి ఆటలు లేవు. ఎప్పుడైనా నెలకి ఒక సినిమా.  మా ఇంటి దగ్గర వీరమ్మ చెరువు, అక్కడ ఆడిన చెడుగుడు, బచ్చాలాట తప్ప మరేమి లేవు. చొక్కాలు చింపుకోవడం, ఇంటికి వచ్చి తన్నులు తినడం లీలగా గుర్తుకు వచ్చాయి. ఆలోచించగా ఒక విషయం గుర్తుకు వచ్చింది. ఆ వయసులో తరుచుగా నన్ను ఒక ప్రశ్న వేసేవారు పెద్దవాళ్ళు. “పెద్దైన తరువాత ఏ ఉద్యోగం చేస్తావురా?” తడుము కోకుండా చెప్పేవాడిని. “లారీ డ్రైవర్” అని. వాళ్ళు నవ్వేవారు. అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడిగేవారు. నేను అదే సమాధానం చెప్పేవాడిని. వాళ్ళు మళ్ళీ మళ్ళీ నవ్వుకునేవారు. మా ఇంటి పక్కన ఒక లారీ యజమాని ఉండేవాడు. రెండు మూడు రోజులకొకమాటు లారీ తీసుకొని డ్రైవర్ వచ్చేవాడు. వాడు లారీ ఎక్కడం నాకు మహా గొప్పగా అనిపించేది. ఒక కాలు చక్రం మీద వేసి,  ఒక చేతితో తలుపు పట్టుకొని సీట్లోకి జంపు చేసేవాడు రెండో చేతిలో బీడితో, బీడి నుసి కూడా రాలకుండా.  నాకది సర్కసు ఫీటులా అనిపించేది. ఆ ఫీటు చెయ్యడానికే నేను లారీ డ్రైవరు నవ్వాలని కోరుకునే వాడిని.

నాల్గైదు ఏళ్ల తరువాత సినిమా ఆపరేటర్ కానీ సినిమా హాల్లో గేటు దగ్గర టికెట్ చింపే ఉద్యోగం కానీ చెయ్యాలనుకునే వాడిని. ఆ రోజుల్లో  సినిమాలు బ్రహ్మండంగా విడుదల అయ్యేవి. త్వరపడండి,  నేడే చూడండి అని రోజూ  అనేవారు రిక్షాలో కరపత్రాలు పంచుతూ. నెలకో,  నెలా పదిహేను రోజులకో మేము సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఈ లోపున సినిమాలు మారిపోయేవి. మా భీమవరంలో   మూడు హాళ్ళు,   మారుతి, స్వామిజీ, వెల్కం ఉండేవి.  సినిమాలు తరుచుగా చూడాలనే కోరికతో ఆ ఉద్యోగాలు చేయాలనుకునే వాడిని.

ఇంకో రెండేళ్ళ తరువాత మా ఇంట్లో నా మీద ఆశలు పెంచేసుకున్నారు మా వాళ్ళు. మా నాన్న నేను ఇంజనీరు కావాలనుకునే వారు. మా అమ్మ డాక్టరు నవ్వాలని చెప్పేది. మా బామ్మ కలెక్టరు కావాలని అనేది. మా అక్కయ్య దగ్గర డబ్బులు కొట్టేసి దొరికిపోయినప్పుడు “అడుక్కు తింటావురా వెధవా” అని దీవించేది.  వీటిలో ఏ ఉద్యోగం చెయ్యాలా అని తీవ్రంగా ఆలోచించేవాడిని.  చివరిదే నీకు సూటవుతుందనే వారు మిత్రులు, తెచ్చుకున్న తాయిలాలు నాకు కనిపించకుండా దాచేసుకొని.   

ఇంకో రెండేళ్ళ తరువాత నాకు కొద్దిగా బుద్ధి,  జ్ఞానం వచ్చే సమయానికి, హైస్కూల్ వదిలి కాలేజికి రావడం, ఆ పై ఏడాది యూనివర్సిటీలో అడుగు పెట్టడం జరిగిపోయింది. యూనివర్సిటీ లోకి అడుగు పెట్టగానే చెయ్యాల్సిన  రెండు ఉద్యోగాలు మాయమైపోయాయి,  ఇంజనీరు, డాక్టరు. ఆప్షన్లు   కలెక్టరు, అడుక్కు తినేవాడు మిగిలాయి. కొత్తగా లెక్చరర్ జేరింది, కెమిస్ట్రీ ఆనర్స్  లో చేరిన తరువాత.  ఫైనల్ ఆనర్స్ లో ఉండగా నలుగైదురు మిత్రులం సివిల్స్ కి తయారు కావాలనుకున్నాం. పుస్తకాలు, గైడ్స్ అవీ తెప్పించాము.  అవన్నీ చూసిన తరువాత నేనూ,  మరో ఇద్దరూ రంగం లోంచి తప్పుకున్నాం.  ఆ విధంగా కలక్టరు ఉద్యోగం కూడా నా లిస్టు లోంచి మాయమయ్యింది. లెక్చరరు, అడుక్కు తినే  ఉద్యోగం మిగిలాయి.

ఎమ్మెస్సీ అయిన తరువాత మూడు ఉద్యోగ ఆఫర్స్ వచ్చాయి లెక్చరరుగా. ఒకటి భీమవరం కాలేజి, ఇంకోటి కాకినాడ కాలేజి, మరొకటి వరంగల్లు మెడికల్ కాలేజి. భీమవరంలో మా నాన్న గారు, కాకినాడలో చాల దగ్గర  బంధువులు ఉన్నారు. ఉద్యోగం వచ్చినా,  స్వతంత్రం ఉండదని అక్కడ జేరకుండా  వరంగల్లు మెడికల్ కాలేజిలో జేరాను. ఆ విధంగా అడుక్కు తినే ఉద్యోగం కూడా మాయమయ్యింది. 

వరంగల్ కాలేజిలో ఇప్పుడు సరిగ్గా గుర్తు లేదు కానీ 280 రూపాయలు జీతం వచ్చేది. ఒక ఆరేడు నెలలు పని చేసిన తరువాత Regional Research Laboratory,  హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది. జీతం సుమారు నాల్గు వందలు. ఎగిరి గంతేసి జేరిపోయాను. లెక్చరరు ఉద్యోగం మాయమై  రిసెర్చ్ లో పడ్డాను. ఇంకో ఏడాది పైన రెండు నెలల తరువాత  Regional Research Laboratory, జోర్హాట్ లో ఉద్యోగం వచ్చింది. జీతం సుమారు ఏడు వందలు 1966లో.  ఈ మాటు ఎగిరి, లంఘించి,  రెండు రాష్ట్రాలు దాటి అస్సాం వెళ్లాను. మా వాళ్ళకెవరికి ఇష్టం లేదు. మా ఆమ్మగారు  రెండు రోజులు సత్యాగ్రహం చేశారు. మా నాన్నగారు బతిమాలారు, మిత్రులతో చెప్పించారు.  అయినా నేనూ వినలేదు.  ఒక ఏడాదిలో I fell in love with Assam. వాతావరణం, ప్రజలు, మంచి మిత్రులు, మంచి బాసులు, అస్సాం వదిలి వెళ్ళాలనిపించలేదు.

మొదట్లో జీతం కోసమే ఉద్యోగం చేసేవాడిని.  సిన్సియర్ లవర్ ఆఫ్ మై పే అన్నమాట.   క్రమ క్రమంగా ఉద్యోగం మీద ఇష్టం పెరిగింది.  ఉద్యోగంలో ఎత్తుపల్లాలు సహజం. నాకూ ఉన్నాయి,  ముఖ్యంగా పెట్రోలియం డివిజను హెడ్ అయిన తరువాత. అవన్నీ చెప్పుకోవాలంటే ఒక గ్రంధం అవుతుంది. ఇక్కడ అప్రస్థుతం.  95 మార్చిలో నేను వాలంటరీ రిటర్మెంట్ కి పెట్టాను. జూలైలో రిలీవ్ చేశారు.

ఆగస్ట్ లో వైజాగ్ లో ఒక పెట్రోకెమికల్ కంపనీలో జేరాను.  97లో హైదరాబాదులో ఒక కంపనీలో GMగా జేరాను. ఆ తరువాత ఒక ఏడాది తరువాత  టెక్నికల్ డైరక్టరు నయ్యాను. 2001లో విబేదాల వల్ల రిజైన్ చేశాను.  ఇంకో ఆరు  ఏళ్లు కన్సల్టంట్ గా కొన్ని కంపనీలకు (రిజైన్ చేసిన కంపనీకి కూడా ఏడాది పైగా) చేశాను. విసుగొచ్చి మానేశాను. ఒక మిత్రుడి కంపనీలో   డైరక్టరుగా(ఆనరరి గానే)  ఉండేవాడిని.  ఏలూరు వెళ్ళే ముందు,  అది కూడా 2011లో వదిలేశాను.  

ఇన్ని ఉద్యోగాలు చేశాను. చిన్నప్పుడు అనుకోని సైంటిస్ట్ ఉద్యోగంలో నా జీవితంలో సహభాగం పైగా  గడిపాను.  కానీ  ఎప్పుడూ కధా  రచయిత నవుతానని అనుకోలేదు. నేను  తెలుగులో కధలు వ్రాయగలనని అంతకు ముందు ఎప్పుడూ అనుకోలేదు. 2007 నుంచి మిత్రుల ప్రోత్సాహంతో  వ్రాసిన నాలుగైదు కధలు వెయ్యడానికే  బ్లాగుల్లోకి 2010  జూన్ లో వచ్చాను.  నా కధలు కనీసం కొంతమందైనా చదివారు అనే నమ్మకం కలిగింది.  బహుశా అది మరి కొన్ని వ్రాయడానికి ప్రేరేపించింది.  గత నాలుగు ఏళ్లకి  పైగా బ్లాగుల్లో ఉన్నాను. బ్లాగుల్లోకి వచ్చిన కొత్తలో ఇంతకాలం ఉంటానని అనుకోలేదు.  ఇన్ని కధలు వ్రాయగలనని అనుకోలేదు.   ఇప్పటికి 69 టపాలు వేశాను. ఒక్కొక్క టపా సగటున 1200  మందికి పైగా చదివారు. జాల పత్రికలు  ‘ఈ మాట’,  ‘మాలిక’  లకు  కధలు వ్రాశాను. మీ అందరి ఆదరాభిమానాలు పొందాను. గురువుగారూ అని ఆప్యాయంగా పిలిచే శిష్యులు దొరికారు. ఈ నాలుగున్నర ఏళ్లు నాకు పూర్తి సంతృప్తి కలిగింది.  ఇప్పుడు కూడా నేను ఒక కధా రచయిత నని అనుకోవటం లేదు. నేను వ్రాసినవి,  చదివి వీలైతే నవ్వుకొని ఆ పై మర్చిపోయేవే. నలుగురు గుర్తు పెట్టుకునే కధలు నేను వ్రాయలేదు. ప్రయత్నమూ చేయలేదు.  బహుశా చేత కాదు.   అయినా,  నా అంచనాలకు మించి మీరందరు అభిమానించారు. అదే నాకు  సంపూర్ణ  సంతృప్తి కలిగించింది.     

అన్నట్టు,  ఆగస్టు 2014లో నా కధల సంకలనం, “బులుసు సుబ్రహ్మణ్యం కధలు”   ఒకటి  పబ్లిష్ చేశాను. ఈ పుస్తకం నవోదయా బుక్ హౌస్,  కాచిగూడ, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ లలోను దొరుకుతుంది. అంతర్జాలంలో kinige.com  లోనూ దొరుకుతుంది, (ebook,  ప్రింటు  బుక్కు కూడా). 

ఇంత సోది చెప్పిన తరువాత అసలు సంగతి కూడా చెపుతాను. ఈ వేళ ఈ టపా వేయడానికి ముఖ్య కారణం,  ఈ రోజున (నవంబరు, 4)  నాకు డెబ్భై ఏళ్లు నిండాయి.  ఇంకెంత కాలం ఉంటానో తెలియదు. ఇప్పటికే నాలుగు స్టెంట్లు నా శరీరం లో అమరాయి. షుగరు, బి.పి. లు స్థిర నివాసం ఏర్పరుచుకున్నాయి.  సిగరెట్లు వదలటం లేదు. “ఏ నిముషానికి ఏమి  జరుగునో” అనే పాట మైండ్లో రింగు మంటోంది. దీపం ఉండగానే మీ అందరికీ కృతజ్ఞతలు,  ధన్యవాదాలు చెప్పుకోటానికి ఈ టపా.
  
(పుట్టిన రోజు అని చెప్పటానికి ఇన్ని పేజీలు  అవసరమయ్యాయా ?  అని తిట్టుకోకండి . . . . .  ద హా) 

 నన్ను ఆదరించి, అభిమానించిన అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు పేరు పేరునా  చెప్పుకుంటున్నాను.