కవిత్వం ఎలా వ్రాయాలి

కవిత్వం ఎందుకు వ్రాయాలి అని  సాధారణంగా ఎవరూ అడగరు.  
ఎందుకంటే కవిత్వం దురద  ఎప్పుడో ఒకప్పుడు అందరికి పుట్టుతుంది కనుక. 

పుట్టిన వెంటనే అదేనండీ దురద, మన  చేతిలో బ్లాగు ఉంది కనుక  వెంటనే గోకేసుకుంటాము. 

మన గీకుడు భరించలేక కొంతమంది పాఠకులు కెవ్వు మంటారు. నిశ్శబ్దంగా కుయ్యో మొర్రో అని కూడా దుఃఖిస్తారు. 
 కానీ సహృదయులు కాబట్టి, జాలిగుండె కలవారు కాబట్టి, 
"ఎంతైనా తోటి బ్లాగరు,  పాపం, దురద భరించలేకే గోక్కున్నాడు" అని సమాధాన పర్చుకుంటారు. 

మరి కొంత మంది జాలితో ద్రవించిన హృదయం కలవారై,  తోటి బ్లాగరును ప్రోత్సహిద్దామనే భావనతో కామెంటుతారు. కేక అంటారు, కత్తి, గునపం, గడ్డపారా అని కూడా అంటారు. 

"బాగుంది,  సూపరూ, ఇహ నీకు ఎదురులేదు, కుమ్మెయ్యి,  గోకెయ్యి, బుఱ్ఱలు  తినెయ్యి"  అని ఉత్సాహ పరుస్తారు. 

ఇవన్నీ చూసిన తరువాత అప్పటిదాకా దురద లేనివాళ్లు  కూడా కావాలని సరదాగా దురద పుట్టించుకుంటారు. అదండి సంగతి నాకూ దురద పుట్టింది. కవిత్వం వ్రాయాలని.


కప్పుకి లిప్పు కి బోలెడు దూరం అని అంటుంటారు. నాకూ అనుభవం లోకి వచ్చింది. 

దురద పుట్టిన వెంటనే  ఏదో నాలుగు లైనులు బరికేసి పబ్లిష్ నొక్కెస్తే నా దురద తీరిపోయేది. ఏ    బాధా లేకపోయేది. 

పబ్లిష్ నొక్కిన వెంటనే నా బాధ మీకు ట్రాన్స్ఫర్ అయిపోయేది. మీ బాధలు మీరు ఆరున్నొక్క రాగం లో  పాడేవారు.  నేను మనసారా ఆలకించి ఆనందించే వాడిని. 

కానీ నిన్న,  కొత్తావకాయ లో అంత వెన్న కలపి, పంచదార కలశల రసం జుర్రుకుంటూ  అలౌకికానందం  లోకి జారిపోయి  

“మనసు పరవశించెనే  పొట్ట బరువు ఎక్కెనే” అని పాడుకుంటూ, 


“దేవి, ఆర్యపుత్రీ,  ప్రభావతీ, నేను కూడా కవిత్వం వ్రాయాలని నిశ్చయించుకున్నాను”

అని  అంటిని. అంతే  శ్రీమతి ప్రభావతి దిగ్గున లేచి తన చెయ్యి నా కంచం లో కడుక్కొని,  


“హెమంటి వేమంటివి, నువ్వు కవిత్వం వ్రాయుదువా, 

"హే తెలుగు తల్లీ నీకెంత కష్టము దాపురించనున్నది. దీని నరికట్టు వారెవరూ లేరా? ఏదో నాలుగు కధలు,  కాకరకాయలు రచించినంత మాత్రాన కవి యైతినని గర్వించుచున్నావా.   ఓరోరి బ్లాగుడా, నీ   ధూర్త ప్రవర్తన మానుకొమ్ము. లేనిచో నీ బ్లాగునూ, ఆ దుష్ట లాప్ టాపు నూ. ఆ BSNL మోడెమ్ నూ  మదీయ తీవ్ర వీక్షణాగ్ని కిరణముల దగ్దము చేసెద”  

నని క్రోధ సముద్రముప్పొంగ నుటంకించెను. నేను భయ విహ్వలుడనై, మనంబున శాంతం భోషాణం అని స్మరించుచు ఆమె క్రోధము తగ్గువరకు శాంతము వహించితిని.  ఆమె శాంతమతి యై, దయార్ద్ర చిత్తయై,

“ఆర్య పుత్రా, పతిదేవా ప్రద్యుమ్నా, ఛందోబద్ధమై అలరుచు,  చదివినంతనే, వినినంతనె అలరించుచూ, ఆనందింప చేయుచూ, తెలుగు వారికే స్వంతమైన పద్యమును కలుషితము చేయనేల సాహసించ దలచితివి.”   అని వివరణ కోరెను.  

“దేవీ ప్రభావతీ నేను పద్యము లిఖించ దలచలేదు. ఏదో సామాన్యమైన గేయరచనకు పూనుకొంటిని.”

అని విన్నవించుకొంటిని. భావ కవిత్వమా అని ఆమె పృచ్చించెను. అవును అన్నట్టుగా నేను తల నూచితిని. 

"అసలు కవిత్వం వ్రాయడం ఎలాగో తెలుసునా శ్రీనాధా" అని మళ్ళీ  మదీయ పత్ని నన్నడిగెను.  

"నీకు తెలుసునా" అని నేను ఎదురు ప్రశ్న వేసితిని.  


దోసెడు పారిజాతములతో హృదయేశ్వరి
మెల్ల మెల్లగా డాసిన భంగి
మేలిమి కడాని వరాల కరాలు వచ్చి
కన్మూసిన భంగి
కన్నె నగుమోము పయిన్  నును సిగ్గు మొగ్గ
కైసేసిన భంగి
అందముల్ చిందెడి నందన వాటి వెన్నెలల్
కాసిన భంగి
జానపద కాంతలు రాట్నము మీద దారముల్
తీసిన భంగి
క్రొవ్వలపులేఖ  తలోదరి తామరాకు పై
వ్రాసిన భంగి
పెండ్లి తలంబ్రాల్ జవరాలు రవంత నిక్కి
పై బోసిన భంగి

పొంగు వలపుల్, తలపుల్, సొలపుల్
ప్రసన్నతల్, భాసురతల్, మనోఙ్ఙతల్
ప్రౌఢిమముల్, రసభావముల్, కడు భాసిలు నట్టు


"చెప్పాలిట కవిత్వం. ముఖ్యం గా తెల్గు కైత. ఎంత అద్భుతంగా చెప్పారో  కరుణశ్రీ  జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. అంతకన్నా అందంగా చెప్పిన వారు నాకు కనిపించలేదు" అంది ప్రభావతి. 

నేను కూడా వెంటనే ఒప్పేసుకున్నాను. 

"యెస్ ఐ ఆల్సో నో సీ" అని కూడా అన్నాను.  

"ఆగ్లం లో శ్రీ హెన్రీ వర్డ్స్ వర్త్  ఆర్తి తో తన ప్రేయసి తో ఏమన్నాడో విన్నావా పతీ పరమేశ్వరా"  అని అడిగి సమాధానం కోసం చూడకుండా చెప్పేసింది.  


ఏదీ వినిపించు
ఏదో ఒక కవితను
నిసర్గ సుందర మధుర గీతికను
అహమంతా ముసిరిన
ఆలోచనల నవతలకి నెట్టి
మనసున శాంతి సమీరాలు వీచే పాటను


"అల్లా వ్రాయగలవా నువ్వు" అని అడిగింది. 

"అంత బాగా వ్రాయలేను కానీ ఒక మాదిరిగా వ్రాద్దామని ప్రయత్నం చేస్తాను. నా కవిత విను నా శ్రీరంజనీ" అని విసిరాను నా కవిత.


పడుతోంది వేడి వేడి వర్షం
చల చల్లటి   మేఘాల్లోంచి
నల్లటి కారు బొగ్గు లాంటి
వర్షం   వర్షం పడుతోంది
వాతావరణం లోకి మెల్లిగా


సతీ సావిత్రి  నా కేసి చూసి "ఇదేమిటి నా రేలంగీ. దీనిభావ మేమి" అని అడిగింది. 

"హూహూ  దీన్ని అతివాస్తవిక రచన అందురు. దీంట్లో మనం సరైన అర్ధం వెతుక్కోవాలి" అని ఐ సెడ్డు.   

" How is that my dear" అని అంది. పైగా ఒక ? కూడా పెట్టింది.  

నేను హహ అన్నాను, సందు దొరికింది గదా అని హహ్హాహాఃహ  యని కూడా అన్నాను. 
 

"నవ్వడం  కాదు నా  చిత్తూరు నాగయ్యా  అర్ధం  చెప్పు  పై రాతకి"   అని శ్రీమతి కన్నాంబ  అడిగింది. 

ఈ మాటు నేను హిహి అని చిరునవ్వు నవ్వాను.

"ఇది ఒక పజిల్ కవిత్వం. పదాలు వెతికి సరైన చోట పెట్టాలి. నువ్వు ఎప్పుడైనా మాడ్రన్ ఆర్ట్ చూశావా మై డియర్ సూర్యాకాంతం. మాడ్రన్ ఆర్ట్ లో ముక్కు ఎక్కడుందో  ఎలా తెలుసుకుంటాం? పెయింటింగ్ మీద మన ఎడం చేతి వేలితో తడుముతాం. మన చేతికి ఎక్కడ జిగురు అంటుకుంటుందో అక్కడ ముక్కు ఉన్నట్టు లెఖ్ఖ. అదే విధం గా నా రచన అర్ధం చేసుకోవాలి. మెదడు ఉపయోగించి పదాలు సరిచూడాలి. చదివేసి  ఆలోచించకుండా వెంటనే సూపరూ అనేయడం కాదు. అర్ధం చేసుకో" , 


పడుతోంది పడుతోంది   
నల్లటి కారు బొగ్గులాంటి మేఘాల్లోంచి
వర్షం  వర్షం  చల చల్లటి వర్షం  మెల్లిగా
వేడి వేడి  వాతావరణంలోకి  వేడిగా  


దీన్ని రుబ్బురోలు కవిత్వం అని కూడా అందురు అని  విశదీకరించాను. అనగనేమీ యని మరల వివరణ కోరెను నా కనక దుర్గ.

"ఇది కవిత్వములో కొత్త ప్రయోగము. రెండు వాక్యములు వ్రాసి రుబ్బురోలు లో  వేసి రుబ్బవలెను. ఖండ ఖండము లైన వాటిని నీకు తోచినట్టు అరడజను లైన్లలో సర్దవలెను. అదియే నేటి ప్రజాదరణ పొందిన కవిత్వము"  అని గంభీర గంభీరముగా నుద్ఘాటించితిని.

"ఓరోరి రాజనాలా  నిన్ను తిట్టుటకు నాలుక తొందర పడుచున్ననూ, పాతివ్రత్య కారణముల వల్ల మనసు ఇచ్చగించుట లేదు. కవిత్వానికి పరమార్ధం తెలుసునా నీకు"     ఇది విను అంది ప్రభావతి మళ్ళీ.


గ్రీష్మ మేఘం వాన జల్లులు కురిపించి నట్లు
కనుకొలకుల నుండి భాష్పాలు జాలు వారినట్లు
గుండె లోతుల నుండి గీతాలు పెల్లుబకాలి  ఎందుకు
సేద తీర్చటం కోసం, హాయి కలిగించడం కోసం 


"అని ఒక భావ కవి ప్రశ్న వేసుకొని, తానే సమాధానం చెప్పుకున్నాడు. అర్ధం అయిందా. కవిత్వం వ్రాయాలంటే  ఊహ ఉండాలి,   కల్పన  చేయగలగాలి,  భావం తెలియాలి ఇవి మధురంగా ప్రకటించటానికి భాష కావాలి. ఇవన్నీ నీకు తెలుసునా" అని ఘట్టిగా అడిగెను. 

"నువ్వు అల్లా వ్రాయగలవా" అని కూడా ప్రశ్నించెను. 

"నహి నహీ నేను వాళ్ళకి మల్లె నహీ లిఖ్ సక్తా హూ  హూ" అని అంటిని. 

"లేకిన్  ప్రియే ధర్మపత్నీ వాళ్ళు పెద్ద మరియూ మహా కవులు వారి వలే నేనెట్లు వ్రాయగలను. నేను ఏదో థోడా థోడా కవిత్వం లిఖూంగా ఛోటా ఛోటా లోగోం కేలియే అని వ్రాక్కుచ్చితిని. 

"క్యారే తూ క్యా సంఝారే? ముఝె భీ హిందీ మాలూం.  సునో"


సఫేదీ హై  సియాహీ హై  షఫక్ హై  అబ్రెబారా హై
మజా బర్సాత్ కా చాహేతో ఇన్ ఆంఖోమ్మే ఆ బైఠో


అంటే అర్ధం తెలుసా ప్రాణనాయకా అంది.  

మాలూం నహీ అన్నాను.  అయితే వినుకో అంది

ఒక నవ యువ జంట చాటుగా కలుసుకున్నారు. 
వర్షం పడుతోంది. వర్షం లో తడిసి ఆనందిద్దామా అని అడిగాడు యువకుడు. 
మగాడు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. 
ఆడది ఆలోచిస్తుంది. తన భద్రత చూసుకుంటుంది. 
బయటికి వెళ్ళి ఎవరి కంట్లో నైనా పడితే ఎల్లా. 

అందుకే చెప్పింది ఇలా.  

"ఓ నా ప్రాణమా,  నా కళ్ళల్లోకి చూడు, అక్కడ తెలుపు ఉంది, నలుపు ఉంది, అరుణిమ ఉంది, శ్రావణ మేఘం ఉంది, నిన్ను కలుసుకున్న ఆనందంలో కురిసే భాష్పాలు ఉన్నాయి. వర్షంలో తడిసే ఆనందం కావాలంటే , రా , నా కళ్ళల్లో కాపురం పెట్టు"

"మహా కవి దాశరధి  తన రచనలలో ఒక చోట చిత్రీకరించిన మధుర కమనీయ రమణీయ భావం ఇది. వీటిలో పదోవంతైనా నువ్వు పలికించగలవా నాధ్" అని అడిగింది నా ప్రియసఖి. 

నేనున్నూ కృద్ధుడనైతిని.

“కవిత్వమంటే  ప్రేమా, మేఘాలు, పెళ్లికూతురు,  తలంబ్రాలు, నిసర్గ సుందర గీతికలే కాదు. ఆకలి, దరిద్రం, బాధ, సమాజం ఇవికూడా ఉన్నాయి అని గ్రహించు.  

అని వచించితిని. అయితే ఇది విను  కాబోయే కవి సత్తమా అంటూ మళ్ళీ సంధించింది  ఇంకో బాణం,


కదిలేదీ, కదిలించేదీ
మారేదీ  మార్పించేదీ
పాడేదీ  పాడించేదీ
పెను నిద్దర వదిలించేదీ,
మునుముందుకు సాగించేదీ
పరిపూర్ణపు బ్రతుకిచ్చేదీ... ..... కవిత్వం


అన్నారు మహాకవి శ్రీ శ్రీ . 

"అంతటి ఉత్సాహం,  ఆవేశం నింపగలవా కనీసం ఇరవైయో వంతైనా నీ కవిత్వం లో" అని నొక్కి నొక్కి మరీ ప్రశ్నించెను నా చండీ రాణి.

"ఆహా విధి వక్రించుట యనగా నిదియే కదా. కవిత్వము వ్రాయవలెనని నాకేల దుర్భుద్ధి పుట్టవలె, నేనేల ఉ. భా. ప్ర.  ప్రభావతీ దేవీ కేల తెలుపవలె , పతి నని కూడా ఇసుమంత కనికారము లేక ఆమె నన్నిట్లు ఏల ఝాడించ వలె"  అని విచారించు చుండగా ఆమె మరల ఏదో చెప్పబోయెను.     

ఆషాఢస్య    ప్రధమ    దివసే  అని  సంస్కృతమున  ఆమె   మొదలుపెట్టే లోపుల నేను తెల్ల జెండా ఎగర వేసితిని.

“దేవీ నేనోటమి నంగీకరించితిని . నా బ్లాగు మీద ఆన. మెత్తటి, ఒత్తయిన నీ జుట్టు మీద ఆన. నేను కవిత్వము వ్రాయను, వ్రాయను కాక వ్రాయ.”

అని ప్రతిజ్ఙ చేసితిని. మంగళం మహత్. మీకు శుభమగు గాక.                                


చివర మాట:   స్నేహ సమాఖ్య, South end park, L. B. Nagar, Hyderabad, వారి Souvenir, 2007,   లిఖిత   లో మిత్రులు శ్రీ యస్. వి. యస్. యమ్. శాస్త్రి గారి  రచన  కవితా రమణీయం    నుంచి యధేచ్చగా గ్రంధ చౌర్యం చేయడమైనది అని ఇందుమూలంగా తెలియపరచడమైనదహో.  


గమనిక: - ఈ టపా తొలి సారి 23/05/2011 న ఈ బ్లాగులో ప్రచురించ బడింది.