ఆత్మనిర్భర బ్లాగు అను స్వయం సమృద్ధ బ్లాగు

నేను నా బ్లాగు పేరు మార్చడం లేదు. బ్లాగును ఆత్మ నిర్భర్ గా అంటే స్వయం సమృద్ధంగా తయారు చేసుకొమ్మని  ఆ తిరు వేంకటాద్రీశుడి ఆజ్ఞ. అది ఎట్లనిన, 
  
అసలు బ్లాగులో ఏమిటుండాలి? అతి ముఖ్యం టపాలు, కనీసం  ఒక టపా అయినా  ఉండాలి. 

టపా ఎప్పుడైనా, ఏ సమయంలో నైనా,  రోజుకొకటి గానీ, నెలకొకటి గానీ, మధ్యలో ఎన్ని మాట్లైనా కూడా వేసుకోవచ్చు. నేను బ్లాగులో కొచ్చిన కొత్తలో సమయం గురించి చర్చలు జరిగాయి. ఎందుకంటే అప్పట్లో టపా వేసిన తరువాత సంకలినులలో అది తక్కువ సమయం మాత్రమే ఉండేది. కూడలిలో నాల్గైదు గంటలు, మాలికలో ఇంకో రెండు మూడు గంటలు, హారం లోనూ, జల్లెడలోనూ  ఇంకొంచెం ఎక్కువ సమయం ఉండేవి. జనం ఎక్కువుగా చూసే, చదివే సమయం ఏమిటీ?   ఇండియాలో వాళ్ళు ఆఫీసు టైమ్స్ లో చదువుతారు అని ఒక అపప్రధ ఉండేది. అమెరికా వాళ్ళు మనకు రాత్రి సమయాలలో చదువుతారు. కొన్ని దేశాలలో మనకి ఇంకా తెల్లవారక ముందే చదివేసి వెళ్లిపోతారు. ఆ కాలంలో  ఇండియా, అమెరికా పాఠకులే ఎక్కువ. కాబట్టి టైము అనేది ముఖ్యం అనుకునేవాళ్లూ ఉండేవారు.  నా మట్టుకు నేను వివిధ సమయాలలో పబ్లిష్ చేసి చూశాను. అర్ధరాత్రి లేచి.  టపా వేసి చప్పట్లు కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా కొత్తగా వ్రాయడం మొదలు పెట్టిన బ్లాగర్స్  పాట్లు. కొంతకాలమైన తర్వాత అంతా భ్రాంతి అనే అనుకునే వాళ్ళు.  చదివే వారి సంఖ్య రెండో ముఖ్యమైంది అన్న మాట. 

మూడో ముఖ్యమైనది  టపాకి వచ్చే కామెంట్లు. మనం వ్రాసింది,  టపా వేసేసిన తర్వాత చదువుకుంటే అప్పుడప్పుడు మనకే చిరాకు వేస్తుంది. ఎందుకు వేశామా అని విచారించ వచ్చు కూడా. అటువంటప్పుడు ఎవరైనా కామెంటు పెట్టారనుకోండి, బ్రహ్మానంద భరితులమవుతాం. మనం వ్రాసింది బాగుందేమో ననే భ్రమ కలిగించేవి కామెంట్లు. ఈ కామెంట్లు సంపాదించడమెలా? వీటి మీద చాలా సలహాలు వచ్చేవి. కొంతమంది ఈ సబ్జెక్ట్ పై టపాలు వేసేరు కూడా. ముఖ్యమైన సలహా గోకుడు కార్యక్రమం. పక్కవారి బ్లాగులో మనం మూడు నాలుగు కామెంట్లు పెడితే ఆయన/ ఆమె మన బ్లాగులో కామెంటు పెడతారు. ఇది సాధారణంగా జరుగుతుంది. ఈ  విధంగా మనం కామెంట్ల దాతలను పోగు చేసుకోవచ్చు. ఇటువంటి కామెంట్ల దాతలు, మనం గోకడం మానేస్తే వాళ్ళు కూడా మానేస్తారు. ఇంకో పద్ధతి, ప్రచారం. మన బ్లాగు చిరునామా అందరి బ్లాగుల్లో కామెంట్ల ద్వారా పెట్టి, "నా బ్లాగును సందర్శించి సలహాలు ఇవ్వండి" అని అడగడం. ఎవరైనా దయదలిచి వచ్చి ఒక కామెంటు దానం చేసి వెళతారు.  ధైర్యస్థులు ఇతర బ్లాగర్స్ మెయిల్ అడ్రెస్ సంపాదించి “ మీ ప్రతిభ అసామాన్యం, అనన్యం, మీకు మల్లె వ్రాయాలని నా ప్రయత్నం” అని వ్రాస్తే   కరగని వాడుంటాడా?  ఇలా అనేక పద్ధతులు. ఈ క్రమంలో ఒకరిద్దరు వీరాభిమానులను సంపాదించుకుంటే పంట పండినట్టే. వారు  కామెంట్ల పరంపర కొనసాగిస్తారు. ఇంకోటి మీరే నాలుగు పేర్లతో పది కామెంట్లు పెట్టుకోవడం.  ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయి. మరెప్పుడైనా చెప్పుకుందాం. 

ఇవి కాక ఎప్పుడైనా మీరు వ్రాసింది నచ్చి ఏ ప్రముఖ బ్లాగరైనా కామెంటు పెడితే, వారిని చూసి ఇంకొంతమంది వచ్చి చదవవచ్చు, కామెంట్లు పెట్టవచ్చు.  అంటే మనం వ్రాసింది నలుగురికి నచ్చితే కామెంట్లు వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి.  నాలాంటి తృతీయ శ్రేణి రచయితలకు అటు పాఠకులూ ఉండరు, ఇటు కామెంట్లూ రావు. అటువంటప్పుడు చివరి ప్రయత్నంగా బ్లాగును ఆకర్షణీయంగా తీర్చి దిద్దాలి. కనీసం బ్లాగు రూపురేఖలను చూడడానికి కొంతమందైనా వస్తారేమో నని ఆశ. సరే నాకు ఇది కూడా చేతకాదు. కాబట్టి ఈ అవకాశం నేను కోల్పోయాను. అందుచేత వేరే మార్గం లేక  “పెను చీకటాయే లోకం చెలరేగే నాలో శోకం, ఇంతేరా ఈ జీవితం ఎంత తిప్పినా తిరగని రంగుల రాట్నం, చీకటిలో కారుచీకటిలో పడవ ప్రయాణం” అంటూ విషాద గీతాలు పాడుకునేవాడిని. ఆ పాటలు విని విని నాకే చిరాకు వేసి పాడడం మానేశాను. 

తరువాత తరువాత కొంచెం గ్నానము వచ్చింది. “ఎందుకోసం ఈ వ్రాయడం ఎవరికోసం ఎవరికోసం” అనుకొని  బ్లాగుకేసి  రావడం మానేశాను. సుమారు రెండు మూడేళ్లు గడిచిన తరువాత  దురద మళ్ళీ  మొదలయ్యింది. మళ్ళీ బ్లాగులకేసి రావడం మొదలు పెట్టాను. కానీ ఎంత ప్రయత్నించినా కొత్తవి వ్రాయడం కుదరలేదు. 

ఏదో ఆలోచిస్తుంటే  బాల్యం గుర్తుకు వచ్చింది. మా పక్కింట్లో ఒక జామ చెట్టు ఉండేది. ఆ ఇంటాయన దానికి ఎరువు వేసేవాడు కాదు. కనీసం నీళ్ళు కూడా పోసేవాడు కాదు.  పాపం ఆ చెట్టు అసలు చదువుకోలేదు. అందుచేత ఏడాది పొడుగునా కాయలు కాసేది. మేం చెట్టు ఎక్కి కాయలు కోసేవాళ్లం. చేతికి అందక పోతే కర్రతో కొట్టేవాళ్లం. రాళ్ళు కూడా విసిరి కాయను పడగొట్టే ప్రయత్నాలు చాలానే చేశాం.

మళ్ళీ నాలో  గ్నాన బల్బు వెలిగింది.   అన్ని దెబ్బలు తిన్నా  పాపం ఆ వెర్రి చెట్టు కాయలు కాయడం మానెయ్యలేదు. మళ్ళీ మళ్ళీ జామకాయలే కాసేది. ఇన్ని దెబ్బలు కొడుతున్నారు కదా అని ఎప్పుడూ   నిమ్మకాయలు కానీ వేపకాయలు  కానీ కాయలేదు.  జామ చెట్టుకు ఉన్న గ్నానము నాకు ఎందుకు లేదు? అందులోనూ అంతో ఇంతో చదువుకున్నాను గదా. గజనీ మహ్మద్ అనేక దండయాత్రలు చేశాడు అని తెలుసును  గదా.  విక్రమార్కుడు అసలు విసుగు చెందలేదు కదా. మనమేమైనా తక్కువ తిన్నామా? మెట్రిక్ మీద మనం కూడా దండయాత్రలు  చేశాం గదా. సెప్టెంబరు, మార్చి అని విసుగు చెందలేదు కదా. పరీక్షలు ఎప్పుడు పెట్టినా మనం ఎవర్రెడి కదా.  కొత్త పాఠాలు నేర్చుకోకున్నా కిందటేడు వ్రాసినవే  మళ్ళీ వ్రాసి  పాస్ కాలేదా?   ఇదీ అంతే.   కొత్తవి వ్రాయలేకపోతే పాతటపాలే వేద్దాం. కాలం మారుతోంది. మనం ఇదివరలో  వ్రాసినవి నచ్చే పాఠకులు ఇప్పుడు వచ్చారేమో? మళ్ళీ ప్రయత్నిద్దాం.  తప్పితే నష్టం ఏముంది మళ్ళీ సప్లిమెంటరీ పరీక్షలు వస్తాయి కదా.  జై భజరంగ్ భళి అని మొదలు  పెట్టాను. 
 
పాత టపాల పునఃప్రచురణ మొదలు పెట్టాను. అప్పట్లో  ఎంతో కొంత మంది పాఠకులు వచ్చిన, ఇన్నో అన్నో కామెంట్లు వచ్చిన టపాలతో మొదలు పెట్టాను. మనిషి అందులోనూ రచయితను అనుకునేవాడు భ్రమల్లోనే బతుకుతాడు అని మళ్ళీ ఇంకోమారు నిరూపించుకున్నాను. భ్రమలు భగ్నమైనా, సెప్టెంబర్ ఆచారస్తుడిని  కాబట్టి ఇంకొంతకాలం ప్రయత్నించాను. “your face, We dont care” అని ఈమాటు ఇంగ్లీష్ లో కోప్పడ్డారు పాఠకులు.  విక్రమార్కుడి వంశస్థుడిని కాబట్టి విసుగు చెందకుండా ఇంకొన్ని వేశాను. 

ఇంతలోనే కరోనా అన్నారు. లాక్ డౌన్ అన్నారు. ఇంట్లోనే కూర్చుని బఠానీలు తినమన్నారు. 

చేసిన పాపం చెబితే పోతుందని అంటారు. ఇంట్లోనే ఉంటారు కదా, చేసేది ఏమి లేక మన టపాలు చదువుతారేమో నని ఉబలాటపడ్డాను. “ అబ్బే, అమ్మా పిల్లలం దెబ్బలాడుకుంటాం, భార్యాభర్తలం యుద్ధాలు చేసుకుంటాం, అవసరమైతే మనోవైజ్ఞానిక నిపుణుల దగ్గరికి వెళతాము కానీ నీ బ్లాగు కేసి రాం రాం” అన్నారు.  

మళ్ళీ విషాదయోగం పట్టింది నాకు. తెలుగు సినిమా విషాద గీతాలు అచ్చిరాలేదని  పద్యాలు పాడుకోవడం మొదలు పెట్టాను,

“నల్లని వాడు రక్తనయనమ్ముల వాడు గద నూని మహా మహిషమ్ముపై ప్రవర్తిల్లెడు వాడు  
నా బ్లాగు ప్రాణ ధనమ్ము గొని తెచ్చె కనిపింపడుగా భిల్ల పురంధృలార దయచేసి తెల్పరే” 

రాగయుక్తంగా పాడుకోవడం సాగించాను. 

ఆ సమయంలోనే ఆత్మ నిర్భర భారత్ అన్నారు. స్వయం సమృద్ధ భారత్ అన్నారు. ఆ నినాదాలు పెరిగాయి. 

ఎంత చేతకాని వాడికైనా ఆ తిరు వేంకటాద్రీశుడు  అవకాశాలు కల్పిస్తూనే ఉంటాడు.  ఒక రాత్రి నిద్రలో కలగంటి కలగంటి,

కనకరత్న కవాట కాంతులిరుగడ గంటి, ఘనమైన దీప సంఘములు గంటి
అనుపమ మణి మయమ్మగు కిరీటము గంటి, కనకాంబరము గంటి, గ్రక్కన మేలుకొంటి

మేలుకొనగానే నా మెదడులో ఈమాటు ఏకంగా  గ్నాన సూర్యుడు భగ్గుమని వెలిగాడు. 
 
ఆత్మ నిర్భర బ్లాగు అని ముమ్మారు నా మెదడులో ప్రతిధ్వనించింది. 

అంతే మరేం ఆలోచించకుండా ఆత్మ నిర్భర బ్లాగు మాత్రమే నా కష్టాలు తీర్చగలదు అని నిశ్చయించుకున్నాను. 


“మన టపాలు మనమే వ్రాస్తాం గదా. మన పాఠకులను మనమే తయారు చేసుకోవాలి. మన కామెంట్లు మనమే పెట్టుకోవాలి. మన లైకులు మనమే కొట్టుకోవాలి” అని ఘట్టిగా సంకల్పం చెప్పుకున్నాను. కార్యోన్ముఖుడిని అయ్యాను. 

నాలుగు మెయిల్ ఐడి లను సృష్టించాను. సింహాద్రి అప్పన్న, శ్రీశైలం మల్లన్న, బెజవాడ కనకదుర్గ, తిరుపతి వెంకన్న అని. ఇంకో పది కూడా వేస్తాను. 

బంధు మిత్రగణా లందరికి మెయిల్స్ పంపాను. 

“కంప్యూటర్లో మీ పనులు చేసుకునేటప్పుడు, నా బ్లాగు ఓ మూల కిటికీ లో పెట్టి, మీ పనులు చేసుకోండి. బ్లాగు చదవాల్సిన అవసరం లేదు. ఈ పని మీరు చేయకపోతే మీ ఇంట్లో శుభకార్యాలకు నేను వచ్చి ఒక్క బిస్కెట్టు పాకెట్టు మాత్రమే ఇస్తాను. మరే గిఫ్ట్స్ ఇవ్వను. బహు పరాఖ్” అని బెదిరించాను. 

సుమారు రెండు వందల మెయిల్స్ పంపాను. కనీసం సగం మంది ఐనా మాట వింటారు అని ఆశ. మామూలుగా వచ్చే నలభై ఏభై మంది పాఠకులు ఎలాగూ  ఉంటారు. బ్లాగు కళ కళ లాడిపోతుంది అని సంబరపడి పోతున్నాను. 

తరువాతి టపాల నుంచి ఇదే మంత్రం. ఇది కూడా ఫలించక పొతే ఇంతే సంగతులు అని చెప్పేస్తాను. 

జై తిరు వేంకటాద్రీశా జై జై  తిరు వేంకటాద్రీశా, నీదే భారం.              

పుస్తక ప్రదర్సనలు - నేనూ

సంవత్సరం గుర్తు లేదు, ఎనభైలలో కలకత్తాలో  మొదటి మాటు పుస్తక ప్రదర్సనకి వెళ్లాను. వెళ్లాను అనడం కన్నా తీసుకెళ్ళబడ్డాను అనడం సబబుగా ఉంటుందేమో.  నన్ను అక్కడిదాకా తోసుకెళ్ళిన మిత్రుడు నారాయణ ,  పుస్తకాల గురించి చాలా సుభాషితాలే చెప్పాడు.  చిరిగిన చొక్కా తొడుక్కో కానీ పుస్తకం కొనుక్కో,  స్నేహితులని వదులుకున్నాఫరవాలేదు  పుస్తకాలు వదలకు,  ఒంటరిగా ఉన్నానని అనుకోకు పుస్తకాలే నీకు తోడు,  కష్టాలలో పుస్తకాలే కరదీపికలు, పుస్తకం హస్తభూషణం, అంటూ చాలానే చెప్పాడు. వాడో అరడజను పుస్తకాలు కొనుక్కోవడానికి నన్నో రెండు గంటలు తిప్పాడు. వాడు పుస్తకాలు తిరగేస్తుంటే వచ్చిన వాళ్ళను చూస్తూ నేను కాలం గడిపేసాను.
 
ఆ రాత్రి నాకూ వాడికి మా గెస్ట్ హౌస్లో వేదాంత చర్చ జరిగింది. 

ఒరేయ్ ఇందాకా నువ్వు చెప్పిన సూక్తులన్నీ చెప్పిన వారెవరురా? రచయితలా, పబ్లిషర్సా? పుస్తకాలు అమ్ముకోడానికి చేసుకునే ప్రకటనలలాగే ఉన్నాయిరా, అన్నాను. వాడికి కోపం వచ్చింది. 

అవి వివిధ రంగాలలో ప్రముఖులు చెప్పిన మాటలు.  సాహిత్యాన్ని మధించిన వారు ఉటంకించిన సత్యాలు అవి. కూపస్థ మండూకంలా, ఆఫీసు, ఇల్లూ, ఇల్లాలు.  పిల్లల తోటే జీవితం అనుకుంటే ఎలారా?  ప్రపంచంలో ఇంకా అనేక ఉదాత్తమైన విషయాలు ఉన్నాయి.  పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోరా అన్నాడు వాడు
  
ఎందుకురా అన్నాన్నేను 

ఎందుకేమిటి? జ్ఞానం పెరుగుతుంది. నాలుగూ తెలుసు కుంటావు.  ఆలోచనా పరిధి విస్తృతమవుతుంది. అవగాహన పెరుగుతుంది. ఇంకా ఇంకా బోల్డు బోల్డు లాభాలుంటాయి అని ఆయాసం తీర్చుకున్నాడు.

లాభాలు సరే,  చదవక పొతే నాకు వచ్చే నష్టాలు ఏమిటి? 

ఇది మూర్ఖపు ప్రశ్న.  జ్ఞానం పెరిగే కొద్ది చైతన్యం పెరుగుతుంది. నీలో ఉత్సాహం పెరుగుతుంది. కష్టాలను ధైర్యంగా, సంయమనంతో  ఎదుర్కుంటావు.  కష్టాలను తేలికగా అధిగమిస్తావు అని ఓ గ్లాసుడు మంచి నీళ్ళు తాగాడు.

ఈ కబుర్లు వద్దు. నీ జ్ఞానం వల్ల నీకేం లాభం కలిగింది. నా అగ్నానం వల్ల నాకేం నష్టం కలిగింది అని ఘట్టిగా ప్రశ్నిస్తున్నాను.  అసలు గ్నానం అనగా నేమి? అని కూడా వాడిని మొట్టి మరీ ప్రశ్నించాను.

పిచ్చివాడా జ్ఞానం అనగా జ్ఞానం అన్నమాట.  విషయ పరిజ్ఞానం వల్ల కలిగే ఆనందం.    జ్ఞానం అనగా పరమాత్ముని చేరుకునే మార్గం కూడా అని నువ్వు గ్రహించాలి.

అంటే నేను మోక్షుడిని కాలేనన్నమాట.

మోక్షుడు యనరాదు. చెంపలేసుకో.  మోక్షకామి యని గాని మోక్షగామి యని గాని యనవలెను. మోక్షకామి యనగా మోక్షమును కాంక్షించే వాడు. గామి యనగా  మోక్ష పధమున పయనించేవాడు యని యర్ధం యయ్యుండవచ్చు.
  
ఈ యయ్యుండడం ఏమిటి? అ అనే చోట  య ఎందుకు ఎక్కువుగా  ఉపయోగిస్తున్నావు?

ఇది వ్యాకరణ జ్ఞానం. అనేక రకములైన జ్ఞానములుండును. వాటిని గ్రహించి సాధన జేయుటయే మనుజుని కర్తవ్యం. పఠనము, అభ్యాసము చేతనే జ్ఞానులగుదురు.  జ్ఞానము లేనిచో  నంతయును నంధకారమే. అంధకారమున మసలు వానిని మూర్ఖుడందురు. అంధకారమున నుంటిమని గ్రహించుటయే  జ్ఞాన మార్గమున ప్రధమ సోపానము. జ్ఞానులలో ననేక తరగతుల వారుందురు. అజ్ఞాని, తధాజ్ఞాని, వ్యర్ధ జ్ఞాని,  అరజ్ఞాని, లోక జ్ఞాని,  జ్ఞాని, విజ్ఞాని, సుజ్ఞాని, మహాజ్ఞాని, సర్వజ్ఞాని, బ్రహ్మజ్ఞాని, కాలజ్ఞాని ఇత్యాది సోపానము లింకను ననేకమున్నాయి. అన్నట్టు జ్ఞాన వృద్ధులు, వృద్ధజ్ఞానులు యను  కొన్ని రకములవారు కూడా కలరు. 
  
తధాజ్ఞాని, వ్యర్ధజ్ఞాని యనగా నెవరు? చూసావా నాకుయున్ను వ్యాకరణ జ్ఞానము నబ్బుచున్నది. 

దీనిని సాంగత్య జ్ఞానమందురు.  జోగితో కరచాలనము చేసిన యడల కొంత బూడిద నీ కంటుకొనును గదా. తధాజ్ఞాని యనగా యధాతధముగా నభ్యసించు వాడు. గురువు గారు చెప్పినది వల్లెవేయువాడు. పుస్తకమున యున్నది కంఠతా పట్టువాడు. సారమును గ్రహించలేనివాడు. ఇప్పుడు విద్యాభ్యాసము చేయుచున్నవారిలో కొంతమంది తధాజ్ఞానులే. వ్యర్ధజ్ఞాని యనగా నెంతయో కొంత,  నక్కరకు రాని  జ్ఞానము కలవాడు. ఇంటర్వ్యూ కి వెళ్ళును. వాడేదో అడుగును. వీడికి తెలుసును. కానీ నాలిక వెనకే యుండిపోవును. బయటకు వచ్చుటకు తిరస్కరించును.  పరీక్షాపత్రంలో ప్రశ్నకి జవాబు తెలుసును  కానీ సమయానికి గుర్తు రాదు.  వీరు వ్యర్ధ జ్ఞాను లనబడుదురు. కర్ణుని వారసులుగా గుర్తింప బడతారు. 
          
గ్నాన సముపార్జనకి  పుస్తకాలు చదవాలంటావా?
 
గ్నాన కానీ జ్నాన కానీ కాదు.   జ్ఞాన  అనాలి జ కింద ఞ పెట్టాలి, న కాదు,  ఙ కాదు.  పుస్తకాలు చదివినా, పెద్దలు చెప్పిన మాటలు విన్నా , గుళ్ళో పురాణ ప్రసంగాలు విన్నా , నాబోటి వారితో చర్చలు జరిపినా  జ్ఞానము పెంపొందును. నీలో అజ్ఞాన తిమిరము నశించును. నీ హృదయాంతరాళమున వెలుగు ప్రవేశించును. 

ఈ వెలుగు ఎట్లు ప్రవేశించును? 

వెలుగు ఎప్పుడూ అరికాలు కింద నించి ప్రవేశించును. అది క్రమ క్రమం గా నీ శరీరమంతయునూ నాక్రమించును. అది నీ యుదరమున ప్రవేశించినచో నీవు సిద్ధుడవగుదువు. నీకు ఆకలి దప్పికలు యుండవు. జ్ఞాన పిపాస ఇంకనూ పెరుగును. విజృంభించి జ్ఞాన సముపార్జన ఉధృతం చేసినచో నది నీ శరీరము నంతయు నాక్రమించి, నీ శిరస్సు చివర కేంద్రీకరమై నొప్పును. ఆ స్థితిలో నీకు వాయుగమనము, దూరదృష్టి, దూర శ్రవణము  మొదలగునవి నలవడును. అని చెప్పి ఆయాసం తీర్చుకొనుటకు ఒక క్షణం ఆగాడు. ఆ విరామ క్షణంలో మరో ప్రశ్న నేను సంధించాను. 

ఆ పైన ఏమవుతుంది?

ఆపైన నీ జ్ఞానము పెరిగినచో నది నీ శిరస్సు వెనకాల కాంతిపుంజమై విరాజిల్లును. నీవు సంపూర్ణ జ్ఞాని యని, బ్రహ్మర్షి వని  లోకమున కీర్తింపబడతువు. నీకు యదేచ్చా త్రిలోక సంచారం కలుగును. దేవతల సమావేశములలో పాల్గొనే నవకాశం  కల్గును. సశరీరుడవై  స్వర్గమున  ఘ్రుతాచి నృత్య ప్రదర్శనను తిలకించ గలవు. 

ఆ చివరి వాక్యం మాత్రం వీనుల విందుగా నున్నది మిత్రమా.

కానీ యది సామాన్యులకు దుర్లభము. కఠోర తపస్సాధనచే మాత్రమే సాధ్యము. భగవత్కృపా కటాక్షములు మెండుగా ప్రసరించిన వారికే నది సాధ్యము. పుస్తక పఠనము నా పథమున సాగుటకు నత్యంతావసరము. 


తరువాత  దీని గురించి నేను మరిచిపోయాను. మందులో అనేకం మాట్లాడుతాం. అవి అప్పుడే మర్చిపోతాం గదా. ఓ రెండు నెలల తరువాత పాపం నారాయణకి కొన్ని కష్టాలు వచ్చాయి. వాడికి ముగ్గురు మగపిల్లలు. ఆడపిల్ల కావాలని ఇద్దరూ బహు ముచ్చట పడేవారు. చివరి ప్రయత్నంగా నాలుగో సంతానాన్ని కందామని నిర్ణయించుకున్నారు. ఆ ప్రయత్నంలో నాలుగో మాటు కవలపిల్లలు కలిగారు. ఇద్దరూ మగపిల్లలే. పిల్లల సంరక్షణలో పాపం వాడు,  వాళ్ళావిడకి చేదోడుగా ఉంటూ క్షణం తీరిక లేకుండా గడిపేవాడు. వాడి జ్ఞాన సముపార్జన అటకెక్కిందని వేరే చెప్పనఖ్ఖర్లేదు కదా. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తరువాత కూడా వాడు  చేతిలో పుస్తకంతో ఎప్పుడూ కనిపించలేదు. అప్పుడు నేనో పరమ సత్యం గ్రహించాను. జ్ఞాన సముపార్జన కూడా మన స్థితి గతుల మీద, పరిస్థితుల మీద ఆధార పడి యుండును, అని.


ఆ తరువాత కొన్ని ఏళ్ళకి హైదరాబాద్లో పని పాడు లేని ఒక సందర్భంలో పుస్తక ప్రదర్శనకి వెళ్లడం తటస్థించింది. అనుకోకుండా వెళ్లడం వల్ల, కొనే ఉద్దేశ్యం లేకపోవడం వల్ల, ప్రదర్శనకి వచ్చే వాళ్ళని కొంచెం శ్రద్ధగా గమనించాను. చిరిగిన చొక్కా వాళ్ళు ఒక్కరూ కనిపించలేదు. పట్టు, సిల్కు చీరలు, శాలువాలు, సూట్లు, బూట్లు.  స్వెట్టర్స్ కూడా చాలా కనిపించాయి.  ఒంటరిగా కూడా చాలా తక్కువ మందే వచ్చారు అని కూడా కనిపెట్టాను. ఎక్కువమంది స్నేహితుల తోనూ, భార్యా, పిల్లలు, బంధు గణంతోనూ వచ్చారు అని కూడా అనుకున్నాను.  కొంతమంది  పిక్నిక్కి వచ్చారేమో అనికూడా సందేహపడ్డాను.  సరదాగా వచ్చి, వచ్చాం కదా,  యని నాల్గైదు పుస్తకాలు కొన్నవారు కూడా ఉన్నారని దురభిప్రాయ పడ్డాను కూడా. నా జేబులో ఉన్న ఏభై రూపాయలతో  ఏదైనా పుస్తకం కొందామని చూసాను కానీ గంటల పంచాంగం తప్ప మరొకటి దొరకలేదు. జ్ఞానం కూడా చాలా ఖరీదు అనే సూత్రం కూడా తెలిసివచ్చింది.    

నాతో సాహిత్య చర్చ చేయించేవారు ఎవరూ కనపడక నేనే గేటు బయటకు వచ్చిన తరువాత సాహిత్య చర్చ చేసుకున్నాను. పుస్తక ప్రదర్శనలో కూడా తినుబండారాల దుకాణాలున్నాయి. ఆ పదార్ధాలు తింటూ, వాటి రుచులను గూర్చి చర్చించడమే నేను చేసే పెద్ద సాహిత్య చర్చ అని మీరు గ్రహించాలని నా తపన.


ఆ తరువాత  కొన్ని ఏళ్ళకి,  పదవీ విరమణ చేసి,  చేసేదేమీ లేక  బ్లాగుల్లోకి వచ్చి పడ్డాను. వచ్చిన కొద్ది నెలల్లోనే హైదరాబాద్ లో పుస్తక ప్రదర్సన వచ్చింది. కొంతమంది బ్లాగర్సు వెళ్ళి చూసి,  కొని వచ్చి,  దొంతరలు దొంతరలు పుస్తకాలు ఫోటోలు తీసి బ్లాగులో పెట్టేసారు. ఇంకా కొనాల్సినవి చాలా ఉన్నాయి  మళ్ళీ  వెళ్ళాలి అని  కొంతమంది ప్రకటించారు కూడాను.  ఇది చూసి మరి  కొందరు  మేమూ రెండాకులు చదువుతాం అని బొమ్మలు పెట్టి మరీ వక్కాణించారు.  ఒక పదిహేను రోజులు బ్లాగుల్లో పుస్తకాలు చాలానే దర్సనమిచ్చాయి. నా గుండె చెరువైంది. ఇంతింత జ్ఞానం వీళ్ళు ఇలా సంపాదించేస్తే,  వీళ్ళ సరసన నిలబడడానికి మనకి అర్హత ఉండదేమో నని బోరుమన్నాను. అప్పుడప్పుడు పక్కింటినుంచి తెచ్చిన వారపత్రిక చదవడానికే వారం రోజులు పడుతుంది నాకు. వీళ్ళకి ఇవన్నీ చదవడానికి ఎన్ని రోజులు పడుతుందా యని లెఖ్ఖలు వేసాను. లెఖ్ఖల్లో నేను మహా వీక్ కాబట్టి ఏ లెఖ్ఖా తెగలేదు. తెగించి నేను కూడా  అప్పో సప్పో చేసి నాల్గైదు పుస్తకాలు కొనాలని నిర్ణయించుకున్నాను.  సప్పే చేసి  (సప్పు అంటే తిరిగి ఇవ్వకూడనిది అని నా అర్ధం) ప్రదర్సనకి  వెళ్ళడానికి ముహూర్తం పెట్టుకున్నాను. అంతకు ముందు  రోజే ప్రదర్సన సమాప్తమయిందని తెలిసి హతాశుడ నయ్యాను.


నేను కూడా మార్గదర్శి లో చేరి నాలుగు పుస్తకాలు కొనుక్కోవాలని, జ్ఞాన పధంలో పయనించాలని, జ్ఞాన వెలుగుని కనీసం మోకాలు దాకా నైనా తెప్పించాలని ఆశ పడ్డాను.  పుస్తకాలు కొంటే పెట్టుకోడానికి బీరువాకూడా  ఒకటి సిద్ధం చేసుకున్నాను.  కానీ,   నేను ప్రదర్శనకి వెళ్ళకుండానే ఇంకో మూడు నాలుగేళ్ళు గడిచి పోయాయి.      ఏడు  తప్పకుండా వెళదామని దృఢంగా నిశ్చయించుకున్నాను. బ్లాగు మిత్రులని సంప్రదించి ఎక్కడ జరుగుతోందో, సమయాలు మొదలగునవి క్షుణ్ణంగా  తెలుసుకున్నాను.  ఆదివారం వెళితే బ్లాగు మిత్రులని కూడా కలిసే అవకాశం ఉంటుందని కూడా అనుకున్నాను. మొన్న ఆదివారం బయల్దేరాను. నాతోటి నా అర్ధాంగి కూడా బయల్దేరింది. ఆవిడ మధ్యలో  అశోక్ నగర్ లో మా సక్కుబాయి ఇంటి దగ్గర దిగిపోయింది. ఆవిడతోటి ఇంట్లోకి వెళ్ళి సక్కుబాయిని పలకరించి, అక్కడ నుంచి నేను ప్రదర్సన దాకా నడుచుకుని  వచ్చాను. (అన్నట్టు మా సక్కుబాయి గురించి ఎప్పుడో ఓ టపా వెయ్యాలి. ఆవిడ వన్ని సక్కుబాయి కష్టాలు).  వచ్చిన తరువాత  ఎంట్రి టికెట్ కొనాలేమో నని జేబులో చెయ్యి పెట్టాను. షాక్ తగిలింది. జేబులన్నీ వెతికాను.  చొక్కా విప్పి దులిపాను.  పేంటుకి ఉన్న అరడజను జేబులు మళ్ళీ మళ్ళీ  వెతికాను.  ఎంత వెతికినా నా పర్సు దొరకలేదు. ఇంట్లో మర్చిపోయానో లేక మా శ్రీమతి బేగ్ లో పాడేసుకున్నానో  గుర్తు రాలేదు.  అయినా నేను ధైర్యం వీడలేదు. గేటు దగ్గర నుంచుని టార్జాన్ స్టైల్ లో  ఓహోహో అని నాల్గైదు మాట్లు అరిచాను. లోపల ఉన్న  బ్లాగ్మిత్రులెవరైనా విని  నన్ను ఆదుకుంటారేమో నని. అబ్బే ఒక్కళ్ళూ రాలేదు.  విషణ్ణ వదనంతో, ప్రదర్సనపై నిరశన దృక్కులు ప్రసరిస్తూ, విషాదంగా  “ఆ అబ్ లౌట్ చలే” అని పాడుకుంటూ మా సక్కుబాయి గారింటికి వెళ్ళిపోయాను. 

      
ఈ రెండు రోజులు తీవ్రంగా ఆలోచించాను. నేనేమి సేయవలె అని చింతించాను.  మొన్న ప్రదర్సనకి వెళ్ళిన బ్లాగ్మిత్రుల పేర్లు సేకరించాను. వీళ్ళ ఇంటికి దండయాత్ర చేసి పుస్తకాలు సప్పు తెచ్చుకోవాలని తీర్మానించుకున్నాను. వీళ్ళే కాదు. ఇదివరలోనూ, కిందటి సంవత్సరాలలోనూ వెళ్ళిన వాళ్ళ పేర్లు, ఎడ్రస్ సంపాదిస్తున్నాను. వాళ్ళ ఇళ్లపై కూడా దాడి చేసి పుస్తకాలు సప్పు చేసో,  తస్కరించో నా బీరువా కళ కళ లాడేటట్టు చేయాలని భీషణ ప్రతిజ్ఞ చేసుకున్నాను. ఇలా సేకరించిన  పుస్తకాలన్నీ నా బీరువా భూషణాలై నలరారాలని ఉత్సాహ పడుతున్నాను.  


గమనిక :- ఇది మొదటి మాటు ఈ బ్లాగులో 17/12/2013 న ప్రచురించ బడింది.  

లాక్‍డౌన్‍లో ప్రద్యుమ్నుడు

లాక్ డౌన్ లో ప్రద్యుమ్నుడు అనే ఈ కధను ఈమాట జాల పత్రిక వారు, వారి జూన్ 2020 సంచికలో ప్రచురించారు.

  ఇక్కడ
https://eemaata.com/em/issues/202006/22787.html


గత రెండేళ్లగా కొత్తగా కధలు ఏమీ వ్రాయలేదు. మిత్రులు విన్నకోట నరసింహా రావు గారి ప్రోద్బలంతో  రెండు కధలు వ్రాసినా వాటిని ఇక్కడ ప్రచురించే సాహసం చేయలేదు. ఆ క్రమంలో వ్రాసిన ఈ కధ మూడోది. ఈ కధను పూర్తి చేయడంలో విన్నకోట వారి సహకారం చాలానే ఉంది. ఈ మాటకు పంపడంలో వారి ప్రోత్సాహం  ఉంది. విన్నకోట గారికి అనేక ధన్యవాదాలు. 

కధను  ప్రచురించిన ఈమాట సంపాదకులకు  ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాను.
 
ఈ కధను చదివి మీ అభిప్ర్రాయం తెలుపవలసిందిగా కోరుచున్నాను.