నేను ఎందుకు వ్రాస్తున్నాను

జీవితంలో ఎన్నోసమస్యలుండగా కొత్త సమస్య ఒకటి  వచ్చి పడింది. నేను ఎందుకు వ్రాస్తున్నాను, why am I writing,  మై క్యోం లిఖ్రహాహూ, మోయ్ కెలే లిఖిస్సూ,  నాకు వచ్చునను కుంటున్న మూడు భాషల్లోనూ, రాని అస్సామీ లో కూడా రాసేసాను.  పైగా ???? నాల్గు కొచ్చెను మార్కులు కూడా పెట్టేసాను. చాలదా ఒకటి నాలుగేలా అని అన్నమయ్య కీర్తన పాడకండి. కొచ్చెను మార్కుల్లో కూడా చాలా రకాలున్నాయి.

ఉదా.1//  నేను జోర్హాట్ లో ఉద్యోగంలో చేరిన కొత్తలో ఓ ఆదివారం, తెల్లవారు జామున అంటే సుమారు 8.30గం// మా  సమరేంద్ర నాధ్  సేన్ గారు భళ్ళున తలుపు తోసుకొని వచ్చి నన్ను కంగారు పెట్టేసాడు. లే లే ఇంకా పడుకున్నావా. టైము అయిపోతోంది అంటూ. విషయం అర్ధం కాకపోయినా నేను తయారయి రాగానే నన్ను సైకిలు మీద ముందు కూర్చోపెట్టి రయ్ రయ్ మని రొప్పుతూ రోజుతూ తొక్కేస్తున్నాడు.  నేను ఎక్కడికి అనగానే ముయ్ నోరు అన్నాడు.  నేను నోటితో పాటు కళ్ళు కూడా మూసుకొన్నాను.  కళ్ళు తెరిచి చూసేటప్పటికి నేనో సినిమా హాల్లో సుఖాసీనుడనై ఉన్నాను. సరిగ్గా టైము కి వచ్చామని సేను గారు  ఆనం  దించి నన్ను కూడా దించమన్నాడు. తెర మీద మనకి అర్ధం కాని భాషలో, అక్షరాలో,  అంకెలో కూడా తెలియకుండా వచ్చేసి, సినీమా మొదలై పోయింది. ఏమీ అర్ధం కావటం లేదు. అయినా అల్లాగే చూస్తున్నాను.  

ఓపది నిముషాల తర్వాత సినిమాలో ఓ కాకి వచ్చింది. కావ్, కావ్, కావ్, కావ్ మని నాలుగు మార్లు కావుమంది. మా సేనుడు వహ్వా, వహ్వా అన్నాడు. ఇంకో కొంతమంది కూడా వహ్వా, శభాష్, బ్యూటిఫుల్, అని ఆనంద పడిపోయారు. నేను కూడా కొంచెం ఆలోచించి లేచి నుంచుని వహ్వా అనబోతుండగా సేన్ గారు నా చేయిపట్టి లాగి కూర్చోపెట్టాడు. తెరమీద సీను మారిపోయింది. ఇప్పుడు ఒకాయన  ఓ పంచను రాతి కేసి కొట్టేస్తున్నాడు. ఉతుకుతున్నాడన్నమాట. మా సేను కళ్ళలో విషాద నీరు. 

నాకు కోపం వచ్చేసింది. ఏంజరుగుతోంది, ఆ కాకి ఎందుకు కావ్ మంది అని అడిగాను.  కాకి కావ్ మనక భౌ భౌ అంటుందా అని కోప్పడ్డాడు సేను గారు. అపుడు నాకేమీ అర్ధం కాక, పూర్తిగా అయోమయావస్థలో, బెంగాలీ సినీమాల్లో అందులో సత్యజిత్ రే  సినీమాలో, కాకులు ఎందుకు భౌ భౌ మన వని పెట్టిన కొచ్చెను మార్కు మొహం..

ఉదా.2//, నాబతుకు బండలు, జీవితం కొల్లేరు అవుతున్నరోజులు అవి. అప్పటి కింకా పెళ్ళి కాలేదు. అయినా నాకు  ముగ్గురు  బాసులుండే వారు.  ఎడా పెడా తిట్టేసేవారు. ఒకటి మాప్రాజెక్ట్ లీడర్,  రెండు మాడిపార్ట్ మెంటు హెడ్, (మా చిన్నబాసు)  మూడు మా డైరక్టరు (మా పెద్దబాసు) . ప్రాజెక్ట్ లీడర్ ను, వుయ్ డోంట్ కేర్. అందుకని ఆయన మా మీద మా చిన్నబాసుకి చాడీలు చెప్పేవాడు.  మాచిన్న బాసు గారు  ఓ రోజున నన్ను పిలిచి,

ఏమిటి నిన్న మీ శంఖనాదాన్ని చెడ తిట్టేవుట కేంటీను లో అని అడిగేడు. అప్పుడు నేను 

  లేదు సార్, మాబాసులే మాదేవుళ్ళు. కలడందురు అన్ని దిశలన్, మాకు కలవారు మీరే గదా అని పాడేను. ఆయన కొంత శాంతించిన వాడై, అయినను అనుమానం తీరక ఇంకా ఏదో అడుగుదామని అనుకుంటుంటే,  అసలు ఆ కేంటీను ఎక్కడుందో, నిన్న రాత్రి  నేనెక్కడున్నానో కూడ తెలియనట్టు నేను పెట్టిన  కొచ్చెను మార్కు ఫేసు.

ఉదా.3.// ఆదివారం బద్దకంగా నిద్రలేచి, మా కేంటీను కుక్కు బహదూరు గాడి  స్టాండర్డు  డైలాగు గుర్తు కొచ్చి, బ్రెడ్ మీద జామ్ వెయ్యనా, బట్టరు రాయనా లేక సాసు మీరే పూసుకుంటారా,  పోనీ గుడ్డు సొనలో ముంచి వేయించమంటారా

వెంటనే యజ్ఞోపవీతం తీసి చేతితో పట్టుకొని, కళ్ళ కద్దుకొని, ఎల్లాగా పట్టుకున్నాం కదా అని కొంచెం వీపు కూడా గోక్కొని మళ్ళీ బనీను లోపల దాచే ఎక్సరుసైజు అవసరమా అని ఆలోచించి, కాదూ అని నిశ్చయించుకొన్నవాడినై వేటకు బయల్దేరాను. మాకాలనీలో పాపం ఐదుగురు తెలుగు, రెండు మళయాళీ, ఒక తమిళ కుటుంబాలు ఉన్నాయి.  ఈఎనిమిది కుటుంబాలూ నా దురదృష్టం  కొద్దీ  ఒక అర కిలోమీటరు పరిధి లో ఉన్నాయి. అయినా కార్య సాధకుడు ఇటువంటి కష్టాలన్నీ అధిగమించాలని  ధృడ సంకల్పంతో బయల్దేరాను. వెతకగా, వెతకగా రావు గారిల్లు అనుకూలంగా కనిపించింది.  పాపం రావుగారు దూరంగా గార్డెనింగు చేస్తున్నట్టు నటిస్తున్నారు. వాళ్ళమ్మాయి శైలజ సూపెర్వైజు చేస్తోంది.  నేను మెల్లిగా వెనకనించి వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించాను. 

రావుగారి కంటబడితే ఆయన గార్డెనింగు వదలి మీ శంఖనాదం ఏమంటున్నాడోయ్ భజగోవిందం అంటూ వచ్చేస్తాడు. ఆయన ఆపని వదలి వచ్చేస్తే సావిత్రక్కయ్యగార్కి కోపంవచ్చేస్తుంది. మనకి కాఫీ కూడా దొరకదు.  

నన్ను చూడగానే సావిత్రక్కయ్యగారు కుశలప్రశ్నలు వేసి    ఏమిటి తమ్ముడూ అల్లా ఉన్నావు అని అడిగారు. అప్పుడు నేను కడు దీనంగా మొహం పెట్టి మొన్న రాత్రి కల వచ్చిందండి. కలలో మాఅమ్మగారు కనిపించే రండి. అంత దూరంలో ఒక్కడివి ఏం అవస్థలు పడుతున్నావో కదా నాయనా అంటూ జీడిపప్పు ఉప్మా పెడుతూ బాధ పడ్డారండి అని చెప్పేను.  మాఅమ్మ చేసిన జీడిపప్పు ఉప్మా తిని అప్పుడే నాల్గు నెలలయిందండి, అని హృదయ విదారకంగా దు:ఖించాను. 

"అయ్యో వెఱ్ఱినాగన్నా ఉప్మాదేం భాగ్యం నేను చేసి పెడతాను నాయనా కూర్చో" అని అన్నారు.  అన్న పావుగంటలో వేడి, వేడి ఉప్మా జీడిపప్పుతో సహా, కంచం నిండా పట్టుకొచ్చేసారు. అది అందుకొని  తినుటకు ఉపక్రమించితిని. ఇంతలో కొంపలంటు కొన్నట్టు రావుగారు ఇంట్లోకి వచ్చి, నన్ను, నాచేతిలో సగం ఖాళీ అయిన ఉప్మా కంచాన్ని చూసి కళ్ళెగరేసారు. సావిత్రక్కయ్య గారు, రావు గారికి విషయం విశదీకరించారు.  అప్పుడు ఆయన కూడా జాలిగా నా కేసి చూసి 

 అవును పాపం మొన్న కూడా వాళ్ళ అమ్మమ్మగారు పెట్టిన ఇడ్లీలు గుర్తుకొచ్చాయిట.  సంధ్యగారు చెప్పారు. డజను ఇడ్లీలు, గిన్నెడు సాంబారు తాగితే కానీ వాళ్ళ అమ్మమ్మగారిని మరచిపోలేకపోయాడట. అన్నారు. అప్పుడు సంధ్యగారెవరో, ఇడ్లీలు ఎలా ఉంటాయో కూడా ఎరుగనట్టు నేను పెట్టిన కొచ్చెను మార్కు ఫేసు. ఈవిధంగా అనేక కొచ్చెను మార్కులు ఉంటాయి.

మళ్ళీ మొదటి పేరా లోకి వెళ్ళిపోతే,  ఎంత ఆలోచించినా సమస్య తీరలేదు. బారు బారు దేఖో, హజారు బారు దేఖో అంటూ  మళ్ళీ మళ్ళీ మొదటికి వచ్చేస్తోంది. 

ఇంతలో నా లోంచి ఆత్మ, రాత్మ రెండూ బయట పడ్డాయి ఆత్మ మామూలు గానే తెల్ల లాల్చీ, తెల్ల  పైజామా వేసుకొని తెల్ల మొహం కూడా వేసుకొని వచ్చింది. రాత్మ మట్టుకు గళ్ళ లుంగీ, చారల బనీను వేసుకొని, విసుగ్గా, బధ్ధకంగా, ఆవులిస్తూ వచ్చింది.  

రాత్మ ను చూచి ఆత్మ కోపపడింది. బుద్దుందా నీకు, ఎంత దేభ్యం గాడైనా వీడి శరీరంలో అద్దె కూడా ఇవ్వకుండా, మనం ఇంత కాలం కాపురం ఉంటున్నాము గదా.  కొంచెం సభ్యతగా ఓ నల్లకోటు, నల్లఫేంటు వేసుకు  రావచ్చు గదా అని గడ్డి పెట్టింది. 

రాత్మ ఆత్మ కేసి కౄరంగానూ, కర్కశంగానూ చూసి, నాకేసి జాలిగా చూసి, ఈ గొట్టాంగాడితో సభ్యత ఏంటి? అయినా అర్ధరాత్రి నిద్రలేపి ఈ గొడవేంటి. అసలు సంగతి చెప్పు అని అడిగింది.. 

 పాపం మన బాసు గార్కి  పెద్ద సమస్య వచ్చింది. ఎందుకు రాస్తున్నాడో అర్ధం కావట్లేదుట. ఇందాకట్నించి తెగ  ఆలోచిస్తున్నాడు  అని అంది.  

ఏడిసేడు, ప్రతీదానికీ వీడు ఇల్లాగే గొడవ చేస్తాడు. ఆపైన మరచిపోతాడు. ఈ మాత్రం దానికి నా నిద్ర చెడగొట్టాలా?  ఛీ ఎదవ కొంప అని తిట్టుకుంటూ మాయమైపోయాడు. 

ఆత్మ కూడా నాకేసి చూసి "యోగా నేర్చుకోకూడదా  సింహాద్రి అప్పన్నా. కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, నీకు, మాకూ కూడా" అని ఓ సలహా పాడేసి మాయమైపోయింది.

సరే ఆత్మ చెప్పింది కదా అని యోగా గురువు ని వెతకడానికి బయల్దేరాను.

ఈ శ్రీశైలం మల్లన్న యోగా నేర్చుకొన్నాడా? యోగా నేర్చుకొంటే అసలు ప్రశ్నకి సమాధానం దొరుకుతుందా?  వివరాలు మళ్ళీ సంచికలో. మీ కాపీ వెంటనే బుక్ చేసుకోండి. ఆలసించిన  ఆశాభంగం. నేడే కొనండి.

 ఇతి శ్రీ బ్లాగోపనిషత్తాయ నే నెందుకు రాస్తున్నాను మహా పురాణే ప్రధమాధ్యాయ సమాప్త:

                                               ఇంతే సంగతులు,
                                                చిత్తగించవలెను,
                                                    ఇట్లు,
                                                బుధజన విధేయుడు


గమనిక :- ఇది మొదటి మాటు ఈ బ్లాగులో 23/09/2010 న ప్రచురించబడింది. 
                                                 

15 కామెంట్‌లు:

మనసు పలికే చెప్పారు...

హహ్హహ్హా. బులుసు గారు, కేక.. నవ్వలేక చచ్చానండీ..:) చివరిలో ఆ అనానిమస్ ఏంటా అని చూస్తే పి.యస్. లో ఆన్సర్ ఇచ్చేశారుగా..:)))
అసలు ఆ క్వశ్చన్ మార్కులని విశదీకరించారు చూడండి.. కడుపు పట్టుకుని నవ్వేశాను..:)
>> సంధ్యగారు చెప్పారు. డజను ఇడ్లీలు, గిన్నెడు సాంబారు తాగితే కానీ వాళ్ళ అమ్మమ్మగారిని మరచిపోలేకపోయాడట.
భలే ట్విస్ట్ కదా..
ఆత్మ రాత్మ వాటి ఆహార్యం, వాటి సలహాలు కెవ్వు..

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మనసు పలికే గార్కి,
మీ కామెంట్స్ కి ధన్యవాదాలు. మీ బ్లాగ్ లో నేను కామెంటు పెడుతున్నప్పుడే ఈ ఐడియా వచ్చిందండి.కాబట్టి ఈ టపాకి ముఖ్యంగా మీకు థాంక్స్ చెప్పుతున్నాను. ప్రవాస బ్రహ్మచారి ఆంధ్రుల బోజన కష్టాల్లో సావిత్రమ్మగార్లు, సంధ్యగార్లు లేకపోతే అని ఊహించుకోవడం చాలా కష్టం? మళ్ళీ కొచ్చెను మార్కు.

మనసు పలికే చెప్పారు...

సుబ్రహ్మణ్యం గారు, నా టపా చూసి వచ్చిన ఆలోచనా ఇది..?? (కొశ్చన్ మార్కు..;)) ఎంతా బారా రాశారో.. హ్మ్.. నిజమేనేమో.. అమ్మాయిలకైతే ఆ గొడవలు ఉండవు లెండి.. హాస్టళ్లలో అయినా దొంగతనంగా రైస్ కుక్కర్ లు పెట్టేస్కునేవాళ్లం, ఆ హాస్టల్ ఫుడ్ తినలేక బయట చెత్త కి డబ్బులు ఖర్చు పెట్టలేక.. :(

Sravya V చెప్పారు...

బ్లాగోపనిషిత్ అదిరిందండి . ఇక ఆ క్వశ్చన్ మార్కులని విశదీకరించారు చూడండి వహ్వా వహ్వా !
ఇంకా మీ ప్రొఫైల్ లో మీ గురించి ఎంత చక్కగా పరిచయం చేసుకున్నారో :)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మనసు పలికే గార్కి,

మీకు మళ్ళీ ధన్యవాదాలు.

శ్రావ్య గారికి,

థాంక్యూ మీ కామెంటు కి. అది బాటసారి సినిమాలో పాటలో ఒక వాక్యం సారీ చరణం అనాలనుకుంటాను.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

"అప్పటి కింకా పెళ్ళి కాలేదు. ’అయినా’ నాకు ముగ్గురు బాసులుండే వారు." హ హ :-) మీరు సైలెంట్ కిల్లర్ సారు :D

జ్యోతి చెప్పారు...

?????????????????

హరే కృష్ణ చెప్పారు...

:D :D
బ్లాగోపనిషిత్ అమోఘం

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

వేణూ శ్రీకాంత్ గార్కి,

మీ కామెంట్లుకి ధన్యవాదాలు. పెళ్ళైతే ఒకే ఒక్క బాసు అని పెళ్ళైతే కానీ తెలియలేదు. అందుకే ముగ్గురు బాసులుండేవారు అని రాయబోయి అయినా అని వ్రాసాను. అచ్చు తప్పు కూడా బాగానే ఉందని అల్లా వదిలేసాను.థాంక్యూ.

జ్యోతి గార్కి,

మీ ??.. మార్క్స్ కి ధన్యవాదాలు. అన్ని ? పెట్టినా నేను జవాబు ఇవ్వను. కావాలంటే నేను ఎటెండ్ అయిన ఇంటర్వూ లోని కమిటీ మెంబర్లని అడగండి. వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేసినా నేను ఒక్కదానికి సమాధానంచెప్పేవాడిని కాదు. ఒక్క ప్రశ్న కు జవాబు చెప్పితే విని పదవీ విరమణ చేసేస్తామని ప్రాధేయ పడినా చిరునవ్వే సమాధానం. ఇప్పుడు మీ ప్రశ్నకూడా అదే జవాబు. థాంక్యూ.

హరే కృష్ణ గార్కి,

థాంక్యూ మీ కామెంటు కి ధన్యవాదాలు.

..nagarjuna.. చెప్పారు...

గురువుగారు.......మీకు మీరేసాటి అండి...నొ questions...

సూపరు క్యామెడి.... :) :)

ఆ.సౌమ్య చెప్పారు...

శ్రీ ఎనానిమస్ వ్రాలు, మీ P.S....ఓహ్, నాగార్జున చెప్పినట్టు మీకు మీరే సాటి!

అయినా మీరింత గేప్ తీసుకుని రాయడం ఏమీ బాలేదు,తొందర తొందరగా రాసేస్తూ ఉండండి. చదవడానికి మేమంతా రెడీగా ఉన్నాంగా.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

నాగార్జున గార్కి,
మీ వ్యాఖ్యల కి ధన్యవాదాలు.నా టపా మీకు నచ్చినందుకు థాంక్యూ.

ఆ.సౌమ్య గార్కి,
ధన్యవాదాలు మీ కామెంట్లకి.మా టపాలు చదివే 20-25 మంది ఉన్నారనే ధైర్యం తోనే వ్రాసేస్తున్నాను. ఇంకా ఎక్కువగా రాస్తే ఉన్న వాళ్ళూ పారిపోతారనే భయం. థాంక్యూ.

కొత్త పాళీ చెప్పారు...

మాస్టారు నమస్తే, బాంచెన్, కాల్మొక్త.
బైదవే, మనం ONGC ఇలాకానా?

జేబి - JB చెప్పారు...

హహ్హహా హిహ్హిహీ
మీరు, అదే అనానిమస్‌‌గారు ఎందుకు వ్రాస్తున్నారు అంటే మాలాంటివారికి నవ్వులు ప్రసాదించడానికి

మీవి వదిలిపెట్టకుండ చదివే నేను ఇదింతవరకు ఎందుకు చదవలేదో.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కొత్తపాళీ గార్కి,
ధన్యవాదాలు. బ్లాగు లోకంలో నేనో వ్యర్ధ జ్ఞానిని, మీరు జ్ఞాన వృద్ధులు. సరదాకైనా మీరు అల్లా అంటే సిగ్గు గా ఉంటుంది.
ONGC కాదండి. రీజినల్ రీసెర్చి లెబోరేటరీ, జోర్హాట్ లో సైంటిస్ట్ గా పనిచేసాను.థాంక్యూ.

జేబీ గార్కి,
థాంక్యూ. మీ నవ్వులే నా ఆరోగ్య రహస్యం. ధన్యవాదాలు.